ఇతిహాస యుగళి
ఆదికావ్యం రామాయణం, అతిపెద్ద కావ్యం మహాభారతం. రెండూ రెండు యుగాల్లో జరిగినవి. ఆయా యుగధర్మాలను చాటిచెప్పినవి. అందుకే, అవి ఇతిహాసాలయ్యాయి. యుగయుగాలుగా ధర్మ విచారణకు దిక్సూచిగా నిలుస్తున్నాయి. పైకి దుష్టశిక్షణ – శిష్టరక్షణలా కనిపించినా రామాయణ, మహాభారత కావ్యాలలో ఉత్తమ, ఉదాత్త మానవ జీవన విధానం దాగి ఉన్నది. కాబట్టే, యుగాలు దాటినా ఇవి జాతిసంపదలుగా మిగిలి ఉన్నాయి. ఎందరో కవులు, రచయితలు తమ రచనా వైచిత్రితో ఈ కావ్యాలను మరింత రసరమ్యంగా ఆవిష్కరిస్తూనే ఉన్నారు.
రామాయణంలో కనిపించని మలుపులు భారతంలో కోకొల్లలు. ‘పంచమవేదం’గా పేరున్న భారతం పద్దెనిమిది పర్వాలతో నేత్రపర్వంగా సాగుతుంది. వ్యాస భారతాన్ని కవిత్రయం తెలుగులోకి అనువదించారు. వారు జాతికి అందించిన శ్రీమదాంధ్ర మహాభారతాన్ని ఈ తరానికి చేరువ చేయాలనే ఉద్దేశంతో సరళ భాషలో రచించారు వనం జ్వాలా నరసింహారావు. ‘మహాభారతం’లోని ప్రతి ఘట్టం అపురూపమే. శాకుంతలోపాఖ్యానం నుంచి స్వర్గారోహణం వరకు మేటి మలుపులు ఎన్నో. భారతగాథలో ఉపకథలు కోకొల్లలు. అప్పటికి ఆ సన్నివేశాన్ని రక్తి కట్టించడానికి వాటిని ఉటంకించలేదు వ్యాసులవారు. అందులోని సారాన్ని గ్రహించడానికి అవే సోపానాలు. కుటుంబ విలువలు, సమర్థ పాలన, రాజకీయ తంత్రం, సాహసం, దీక్ష, దక్షత ఇలా మహాభారతంలో చెప్పని విషయం లేదు. ఆ భావాలను అందరికీ అర్థమయ్యే రీతిలో అందంగా సరళతరం చేశారు జ్వాలా వారు. భారతంలోని సన్నివేశాలను కథలుగా మలిచి ‘శ్రీమదాంధ్ర మహాభారత కథలు’ పేరుతో అందమైన గ్రంథంగా అందించారు. ఏ కథ ఏ పర్వం లోనిదో, ఏ ఆశ్వాసం లోనిదో వివరించారు. ముఖ్యంగా కురుక్షేత్ర సంగ్రామం గురించి పొందుపరిచిన కథలు, యుద్ధాన్ని కండ్లముందు ఉంచాయి. ఈ పుస్తకం చదివితే మహాభారతంపై పూర్తి సాధికారత వస్తుంది. మన ఇతిహాసాలు, అందులోని గొప్పదనాన్ని ఈ తరానికి పరిచయం చేయాలన్న రచయిత ఉద్దేశం సఫలమైందనడంలో ఎలాంటి సందేహం లేదు.
కవిత్రయ విరచిత
శ్రీమదాంధ్ర మహాభారత కథలు
రచన: వనం జ్వాలా నరసింహారావు
పేజీలు: 478, వెల: రూ.499
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఆంధ్ర వాల్మీకి రామాయణ రసరమ్య గాథలు
పేజీలు: 358 వెల: రూ.499
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
రంగనాథ రామాయణం మొదలు రామాయణ కల్పవృక్షం వరకు ఆదికావ్యం తేట తెలుగులో తేనెలూరింది. వాల్మీకి 24 వేల శ్లోకాలతో రామాయణం రాస్తే ఆంధ్ర వాల్మీకిగా పేరున్న వావిలికొలను సుబ్బారావు (వాసుదాస స్వామి) 24 వేల పద్యాలతో తాత్పర్య సహితంగా ‘మందరం’ పేరుతో తెలుగు రామాయణ కావ్యాన్ని రచించారు. ఆ ‘మందరం’లోని మకరందాన్ని గ్రోలి వనం జ్వాలా నరసింహారావు రామాయణ గాథను సరళతరం చేసి వచన రూపంలో కథలుగా అందించారు. అనంత ఆనంద సాగరంలోని మేలి ముత్యాల్లాంటి సన్నివేశాలను ఏర్చి ‘ఆంధ్ర వాల్మీకి రామాయణ రసరమ్య గాథలు’గా అద్భుత పుస్తకాన్ని అందించారు. ప్రముఖ ఆధ్యాత్మిక మాసపత్రిక ‘దర్శనం’ సౌజన్యంతో ఈ ఇతిహాస యుగళ గ్రంథాలను వారు ప్రచురించారు.
ఓ గాయకుడి గాథ
చిట్టి కథైనా, నాటకమైనా, నవల అయినా, చివరికి సినిమా అయినా.. దేన్నయినా సూపర్హిట్ చేసే ఏకైక ఫార్ములా ముక్కోణపు ప్రేమ. నారీనారీ ఉంటేనే నడుమన ఉన్న మురారిపై ప్రేక్షకుడికి జాలో, ప్రేమో, ద్వేషమో కలుగుతుంది. ప్రేక్షకుడిని రెండున్నర గంటలు సీట్లో కూర్చోబెట్టాలన్నా, పాఠకుడిని ఆసాంతం చదివించాలన్నా ఊహించని ట్విస్టులు ఉండాలి. కథావస్తువు ఏదైనా అందులో ప్రేమకు ప్రాధాన్యం లేకపోతే అంతగా రక్తి కట్టదు. అందులోనూ త్రికోణ మైత్రిని ఏ కోణంలో చూపించినా ప్రేక్షకుడు, పాఠకుడు ఆసాంతం ఆస్వాదిస్తాడు. ఈ చిన్న ఫార్ములా ఆధారంగా ‘గాన గంధర్వుడు’ అనే చిట్టి నవలను ఆవిష్కరించారు రచయిత బి.యస్.జగదీష్. చిన్నతనంలో తనకు తెలిసిన ఓ హరికథా కళాకారుడి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇది రాసినట్టు ‘ముందుమాట’లో చెప్పుకొచ్చారు రచయిత. సంగీత కళానిధి అయిన ఆ గాయకుడి గానానికి వశురాలైంది ఓ ముగ్ధ, అతడి వ్యక్తిత్వానికి దాసోహం అయింది మరో ఇంతి. ఈ ఇరువురిలో ఎవరికి అతడు దగ్గరయ్యాడన్నది అసలు సస్పెన్సు. మూడు పాత్రల చుట్టూ ఓ ప్రణయ కావ్యాన్ని సృష్టించొచ్చు. కానీ, రచయిత అందుకు భిన్నంగా ఓ జీవిత ప్రయాణాన్ని ఆవిష్కరించారు. కలిమి లేములను, కష్టసుఖాలను పండించారు. త్యాగాలను, మోసాలను వివరించారు. సంపదలో ఎలా ఉండాలో చెప్పారు. నిజమైన సంపదేంటో చెప్పకనే చెప్పారు! కల్పితమే అయినా ఇందులోని పాత్రలు, సన్నివేశాలు ఎవరినో మనకు పరిచయం చేసినట్టు అనిపిస్తుంటుంది.
గాన గంధర్వుడు
(సినిమా కోసం చిట్టి నవల)
రచన: బి.యస్.జగదీష్
పేజీలు: 94, వెల: రూ.100
ప్రతులకు: 87121 53417