పీవీ నరసింహారావు..కొందరి దృష్టిలో ‘Insider’.. బహు భాషాకోవిదుడు! ఇంకొందరికి ‘Half Lion’.. అపర చాణక్యుడు! మరికొందరికి స్థితప్రజ్ఞుడు.. రాజనీతి దురంధరుడు! మిగిలిన వారికి బహుముఖ ప్రజ్ఞాశాలి.. సంస్కరణాభిలాషి! ఇలా ఒక్కొక్కరికి ఒక్కోలా కనిపిస్తూ, ఒక్కో కోణంలోకి విస్తరిస్తున్న పీవీ నరసింహారావు మూర్తిమత్వ పునాదులు ఎక్కడున్నాయి? ఆయన వ్యక్తిత్వ నిర్మాణ మూలాలు ఎక్కడనుంచి మొదలయ్యాయి? అంటే, అక్షరం నుంచి.. సాహిత్యం నుంచే ప్రారంభమయ్యాయి.ఆయనలో ఆ సాహితీ వృక్షం విస్తరిస్తున్నకొద్దీ పీవీ విశ్వరూపం ఆవిష్కృతమవుతూ వచ్చింది.
అక్షరాన్ని ఓనమాలుగా దిద్దుకున్నప్పటినుంచే సాహిత్యం మొదలవుతుంది. బాల్యంనుంచే ప్రతి మనిషిలో సాహిత్యం, సృజనాత్మకత, కళలు, సంస్కృతి, చరిత్రపట్ల ఆసక్తి అంకురప్రాయంగా ఆరంభమవుతుందని సైకాలజిస్టులు చెబుతున్న సత్యం. ఏ మహనీయుడి జీవితచరిత్ర చదివినా ఈ విషయం అర్థమవుతుంది. పాములపర్తి వెంకట నరసింహారావు కూడా అలాంటి వ్యక్తే. వీరు పుట్టింది లక్నేపల్లి గ్రామం. అక్కడినుంచి ప్రస్తుతం వరంగల్ అర్బన్ (పూర్వ కరీంనగర్) జిల్లాలోని వంగరకు వచ్చారు. అక్కడే ఆయనకు సాహిత్యాన్ని మథించడానికి కావాల్సిన నేపథ్యం లభించింది. మొదటినుంచీ ఆటలకంటే కూడా అధ్యయనం, తెలుసుకోవాలనే తృష్ణ ఎక్కువ. పెరిగిన వాతావరణం, చుట్టూ ఉండే పుస్తకాలు అన్నీ కలిసి పీవీలో అక్షరం, సాహిత్యం, కవిత్వం పట్ల ఒకలాంటి ప్రేమను, అభిమానాన్ని, గౌరవాన్ని పెంపొందించాయి.
పీవీది కరణాల కుటుంబం. తెలంగాణ గ్రామీణ జీవనంలోని విశిష్టత ఏమిటంటే, ఆ కాలంలో కరణాలు భూమికి సంబంధించిన రెవెన్యూ విషయాలన్నీ చూసుకోవడం మాత్రమే కాదు.. సంప్రదాయం, విజ్ఞానం గురించి తెలియజేయడం, గ్రామీణ ప్రజలకు వివిధ విషయాలపై అవగాహన కల్పించడం కూడా వారి నిత్య వ్యవహారంలో అంతర్భాగంగా ఉండేవి. సాధారణంగా ఇలాంటి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఎక్కువమంది మళ్లీ భూమికి సంబంధించిన అంశాలు, రెవెన్యూ విషయాలు, పాలనకు సంబంధించిన వ్యవహారాలపైనే ఆసక్తి చూపిన సందర్భాలు కనిపిస్తాయి. కానీ, పీవీ నరసింహారావు బాల్యంలో ఎప్పుడైతే అక్షరాలతో పరిచయం పెంచుకొన్నారో.. భారత భాగవతాలలోని శ్లోకాలు, సంస్కృత గ్రంథాలు చిన్నప్పటినుంచే ఇంట్లో వినడం, చదవడం అయ్యవార్లద్వారా తెలుసుకొన్నారో.. అప్పటినుంచి ఆయనకు సృజనాత్మక అంశాలపట్ల ఆసక్తి మొదలైందని చెప్పవచ్చు. చిన్నపిల్లలకు స్టోరీ టెల్లింగ్పట్ల, చందమామ కథలపట్ల, కల్పన, ఫాంటసీ కథలమీద ఆసక్తి ఉండటం సహజం. కొంతమందికి ఎక్కువ ఆసక్తి ఉంటది. ఆ ఆసక్తి తరువాత తరువాత జ్ఞానతృష్ణకు దారితీస్తది. ఆ జ్ఞానతృష్ణ చివరికి సాహిత్యాన్ని మథించే గొప్ప ప్రయాణం చేయడానికి కావలసిన స్ఫూర్తినికూడా తీసుకొస్తది. అలాగే, పీవీ నరసింహారావు బాల్యంలోనూ అదే జరిగింది. దీనివల్లే వీరికి మొదటినుంచీ సాహిత్యం, కవిత్వం పట్ల ఒక ప్రత్యేకమైన అనురాగం ఏర్పడేలా చేసింది. పీవీ ‘ఫిలాసఫర్ కింగ్’ లాగా ఎదగడానికి సాహిత్యం పట్ల ఆయన ఆసక్తే కారణమైంది.
భాషా ప్రావీణ్యం
ఈ ప్రపంచంలో రెండిటివల్ల ఏదైనా సాధ్యమే. ఒకటి అవసరం. రెండోది ఆసక్తి . ఈ రెండూ ఉంటే దేన్నయినా సాధించవచ్చు. ప్రతి మనిషీ పుట్టుకతోనే అత్యంత మేధతో, జ్ఞానంతో పుడతాడు. కాకపోతే, మనకు నిర్ధ్దారితంగా ఎంపిక చేసుకున్న (సెలెక్టివ్) అంశాలమీదనే ఆసక్తి ఉంటుంది. కాబట్టి, మిగతా వాటిని విస్మరిస్తూ పోతుంటాడు. ఈ సూత్రాన్ని ఎవరికైనా వర్తింపజేయొచ్చు. పీవీ నరసింహారావు విషయంలోనూ అంతే. ఆయనకు అవసరం, ఆసక్తి రెండూ ఉన్నాయి. మొదట్లో ఆయనకు ఆసక్తి. అందుకే, భాషలను లోతుగా పరిశీలించి, తెలుగుభాషను అధ్యయనం చేశాడు. తెలుగుభాషలో ఒదిగి ఉన్న లింగ్విస్టిక్స్ను, ఫైలాలజీని, ఎటిమాలజీనీ విస్తృతంగా అధ్యయనం చేశాడు. తెలంగాణ ప్రాంతపు పదాలు, మాండలికాలు, ఇక్కడుండే గోస, యాస.. ఇవన్నీ చూశాడు. వాటితోపాటు తెలుగుభాషలో ఉండే అంశాలనూ గమనించాడు. అవి ఎందుకు వైవిధ్యంగా ఉన్నాయనే కుతూహలం ఆయనలో!ఆయన మిగతావాళ్లలా ఏదో యాథాలాపంగా బట్టీ పట్టి అమ్మానాన్న, బడి, కాలేజీ చెప్పిన వాటిని యథాతథంగా చెప్పడం కాకుండా, వాటిని అన్వేషించడం, వాటిలోని అంతరార్థాన్ని గుర్తించడం, భావార్థాన్ని తెలుసుకోవడం, వాక్యార్థాన్ని గమనించడం, భాషాపరమైన అంశాలనూ తెలుసుకునే ప్రయత్నం చేయడం, ఆయనకున్న ఆసక్తివల్ల సహజంగానే అబ్బింది.
ఇక, ప్రపంచంలో ఏ భాష అయినా, సైకో లింగ్విస్టిక్స్లో ‘నోమ్ చామ్ స్కీ’ చెప్పినట్టు భాషకూడా మ్యాథమెటిక్స్ లాంటిదే. దానికొక గ్రామర్ (సూత్రం) ఉంటది. అలాగే, ఆ సూత్రాన్ని ఒడిసి పట్టుకుంటే ఏ భాషలోనైనా ప్రావీణ్యం సాధ్యమే. ఆ సూత్రాలను, ఆ మౌలిక అంశాలను ఆకళింపు చేసుకునే ఒక నైపుణ్యం, లోపలి లోతుల్లోకి వెళ్లి పరికించే జ్ఞానం పీవీకి ఉంది. సాధారణంగా ఒక వ్యక్తి ఒక భాషను నేర్చుకున్నాక రెండు అభిప్రాయాలు ఏర్పడతాయి. ఒకటేమో తను నేర్చుకున్న భాషపట్ల అభిమానం. రెండోది ఇతర భాషలపట్ల దురభిమానం. అయితే, నిజమైన భాషా ప్రేమికుడు తన మాతృభాషలోని సొబగు, సౌందర్యం, సారస్యం, దాంట్లోని గొప్పదనాన్ని ఇతర భాషల్లోని గొప్పదనంతో పోల్చుకుంటాడు. ఒక భాషపట్ల నిజమైన ప్రేమ ఉన్నవాళ్లు, దాన్ని అభిమానించేవాళ్లు ఇతర భాషల్లోని వైవిధ్యాన్ని, విశిష్టతనూ గమనిస్తరు, గౌరవిస్తరు. అంటే, భాషా వైవిధ్యతలోని ఆ విశిష్టతనూ గుర్తిస్తరు.
వేయి భావాలు..
పీవీ ఒక నిరంతర తాపసి. నిరంతర దహితుడు. నిత్య అన్వేషకుడు. అలా అన్వేషించే క్రమంలో తెలుగుభాషలో మంచి పాండిత్యాన్ని సాధించిన తరువాత ‘వేయి పడగలు’ లాంటి అత్యంత అద్భుతమైన సమకాలీన సంప్రదాయవాద సాహిత్యాన్ని ఆపోసన పట్టే స్థాయికి వచ్చారు. ఆ క్రమంలోనే ఆయన ఉర్దూ మీడియంలో చదువుకున్నారు కాబట్టి, ఉర్దూను అభ్యసించడంతోపాటు అధ్యయనమూ చేశారు. ఆయన చదువు కొనసాగుతున్న క్రమంలోనే మరాఠీ, ఇంగ్లిష్ వంటి ఇతర భాషలను తెలుసుకోవడం, తెలుసుకున్నదాన్ని ఆకళింపు చేసుకోవడం, ఆకళింపు చేసుకున్నదాన్ని అనుసరించి ఆయా భాషల్లోని ఔన్నత్యాన్ని గమనించడం, గుర్తించడం, గౌరవించడం చేశారు. మొదట అవి అవసరాలుగా మొదలై, ఆసక్తులుగా ఎదిగాయి. తరువాత రాజకీయాల్లో వివిధ హోదాలలో కొచ్చిన తరువాత, ఢిల్లీకి వెళ్లిన క్రమంలో, కేంద్ర మంత్రివర్గంలో విదేశీ వ్యవహారాల శాఖమంత్రిగా ఉన్న సమయంలో ఆ ఆసక్తులన్నీ ఆయనకు ఎంతో సహాయకారిగా నిలిచాయి. అలా, పీవీ విషయంలో అవసరం, ఆసక్తీ రెండూ కలిసినయి.
ఎనిమిది భారతీయ భాషల్లో ఆయన అనర్గళంగా మాట్లాడగలిగేవారు, ఆయన తెలుగెంత చక్కగా మాట్లాడుతరో హిందీ, కన్నడ, తమిళ్, గుజరాతీ, మరాఠీ, బెంగాలీ, పంజాబీ వంటి భాషల్లోనూ అంతే చక్కగా సంభాషిస్తరు. అప్పుడున్న నైజాం హైదరాబాద్ స్టేట్లో మరాట్వాడ ప్రాంతం అంతర్భాగం. అందుకని, మరాఠీ భాష సహజంగా అప్పట్లో చాలామందికి వచ్చేది. పైగా హైదరాబాద్ నుండి వెళ్లి నాగ్పూర్లో చదువుకున్నారు. మొదట్లో చదివింది ఉర్దూ మీడియం కనుక ఉర్దూ, తన మాతృభాష తెలుగు వచ్చింది. తరువాత ఆసక్తి కొద్దీ ఇంగ్లిష్ను చదువుకున్నరు. ఇలా ఆయనకు నాలుగైదు భాషలు విద్యార్థి దశలోనే అలవోకగా వచ్చినయి. అంటే, అప్పుడుండే సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, విద్యా పరమైన పరిస్థితులు దీనికి దోహదపడ్డాయి. అందుకే, ఆ కాలంలోని వీరి సమకాలినులందరికీ మూడు, నాలుగు భాషలు వచ్చేవి. వాళ్లంతా ఆ మూడు నాలుగు భాషలవద్దే ఆగిపోయారు.
పీవీ నరసింహారావు అంతటితో ఆగకుండా ఆ తృష్ణను కొనసాగిస్తూ వచ్చారు. వివిధ భాషలపై పట్టు సాధించారు. ఆ తరువాత తను ఎదుగుతున్న కొద్దీ తన జ్ఞానం పరిధి, పదవి, హోదా విస్తృతమవుతున్నకొద్దీ, ఆ విస్తరణ మేరకు తనను తాను తన మేధో పరిమితులన్నిటినీ అధిగమించుకుంటూ వెళ్లిపోయారు. దాన్ని విస్తరించుకుంటూ పయనించారు. ఇది ఆయనలోని ప్రత్యేకత. మిగతావారిలో లేనిది, వీరిలో ఉన్న ఒక విశిష్టత. ఎప్పుడైనా ఎవరినైనా, ఒక మనిషిని తట్టాలంటే మనం కనిపిస్తే సరిపోతది. కానీ, ఒక హృదయాన్ని తట్టాలంటే మాత్రం భాషే ఆ సంధాన వారధి. ఏ ప్రాంత ప్రజలైనా, ఎవ్వరైనా వారి భాషలో మనం సంభాషించినప్పుడు, మనం ప్రతి భావాన్నీ వ్యక్తం చేయగలుగుతం. తరువాత ఏ విధమైన దూరతనం లేని ఒక దగ్గరితనాన్నీ, ఆత్మీయతనూ ప్రదర్శించగలుగుతం. అందుకే, భాష మనుషుల మధ్య ఒక అత్యంత శక్తివంతమైన వారధి. ఒక అనుబంధాల జలధి. అందుకని, పీవీ ఆ సూత్రాన్ని గమనించాడు. ఆ సూత్రం దానిలోని మౌలికత పీవీ నరసింహారావుకు తెలుసు గనక ఏ ప్రాంతానికి వెళ్తే, అక్కడ ఆ ప్రాంతీయ భాషల్లోనే సంభాషించాడు. అందరి వాడయ్యాడు!
ఇప్పుడు అలెగ్జాండర్ల కాలం పోయింది. అలెగ్జాండర్లాగా ప్రపంచాన్ని జయించేంత సమయం లేదు. ఇప్పుడు సాధించగలిగిందల్లా మేధోపరమైన విజయమే. ప్రపంచాన్ని జయించాలంటే మేధతోనే జయించాలి. ఆ మేధస్సును వ్యక్తం చేసే ఒక పార్శ్వం భాష. అందుకని, పీవీ నిరంతరం తనను తాను చెక్కుకుంటూ ఎదిగారు. ఎదుగుతున్న కొద్ది తనను తాను నిర్మించుకున్న మనిషి. విస్తరిస్తున్న కొద్దీ తనను తాను ఆవిష్కరించుకున్న మనిషి. ఇది ఒక అద్భుతమైన వ్యక్తిత్వ వికాస పాఠం. ఇలా ఒక మానసిక పరిణతి, ఒక అభ్యుదయ వికాసం పీవీ నరసింహారావు వ్యక్తిత్వంలో, జీవన గమనంలో మనకు కనిపిస్తది. ఇదే వికాసం, పరిణామం ఆయన సాహితీ కృషిలోనూ స్పష్టంగా తెలుస్తది. అంటే, భాష నేర్చుకోవడంలో, సాహిత్యాన్ని సృజించడంలో, సాహిత్యాన్ని అధ్యయనం చేయడంలో, ప్రజలతో, ఇతర ప్రాంతభాషల ప్రజలతో ఆయన అన్వయించుకున్న విధానం గానీ, వాళ్లతో మమేకమైన తీరుగాని గమనిస్తే ఇది ప్రస్ఫుటమవుతుంది. ఇవన్నీ కలిసి నరసింహారావును ఒక విశ్వమానవుడిగా తయారు చేయడానికి కావాల్సిన సన్నాహాలను రూపొందించాయి.
విశ్వనాథ ప్రభావం: అనుసృజనం
పీవీ ఎంత సంప్రదాయవాదో అంత ఆధునికవాది. ట్రెడిషన్, ట్రెండ్ రెండూ కలగలిసిన ప్రయాణం ఆయనది. పీవీ జీవితాన్ని గమనిస్తే, ఒకవైపు వేయి పడగలు లాంటి సంప్రదాయ సాహిత్యాన్ని, సంప్రదాయ భాషా పాండిత్యాన్ని ఎంతగా ప్రేమించేవారో, కంప్యూటర్ను, ఆధునిక టెక్నాలజీనీ అంతే ఆహ్వానించేవారు. మానవ వనరుల శాఖా మంత్రిగా ఉన్న సమయంలోనే దేశంలో మొట్టమొదటిసారిగా కంప్యూటర్ బేస్డ్ లెర్నింగ్ టీచింగ్ ప్రాసెస్ను ప్రవేశ పెట్టడానికి కావాల్సిన పూర్తి పథకాలు రూపొందించారు. ఇక్కడ గమ్మత్తేమిటంటే, మనకు తెలిసిన సంప్రదాయ మౌఖిక భాషలతోపాటు ఆయన అప్పట్లోనే, మొదటి తరంలోని కోబాల్, బేసిక్, లోటస్ 123 లాంటి కంప్యూటర్ సాంకేతిక భాషలనూ నేర్చుకున్నారు. ఇవన్నీ ఎవరో ట్రైనర్ దగ్గరకెళ్లి నేర్చుకోవడం కాదు, మాన్యువల్స్ను పట్టుకొని, కంప్యూటర్తోపాటు వచ్చే హ్యాండ్ బుక్స్ ఆధారంగా నిరంతరం చదివి, అధ్యయనం చేసి పట్టు సాధించారు.
అలా ఇటు మూలాలను వదలనివారు, అటు ప్రపంచ గమనాల్నికూడా విస్మరించనివారు.. పీవీ నరసింహారావు. అందుకే, ఆయన దృష్టిని వేయి పడగలు ఆకర్షించి ఉండవచ్చు. ‘వేయి పడగలు’ ఒక నవ్య సంప్రదాయ ఆలోచనలతో కూడిన అద్భుతమైన గ్రంథం. మరోమాటలో చెప్పాలంటే, అదొక సమకాలీన సామాజిక ఇతిహాసం! ఇందులో ఎన్నెన్నో పాత్రలు ఉంటాయి. వాటిని అల్లుకొని ఎన్నెన్నో జీవన నియమాలు, జీవన గమనాలు, జీవన సత్యాలు అందులో ఆవిష్కృతమయ్యాయి. గ్రీకు సాహిత్యంలోని ఇతిహాసాలైన ‘ఇలియడ్’, ‘ఒడిస్సీ’లను హోమర్ రాశాడు. అలాగే, భారతీయ సాహిత్యంలో రామాయణ, మహాభారతం ఉన్నాయి. ఆ కోవకు చెందిన మన కాలపు తెలుగు రచన ‘వేయి పడగలు’, ‘రామాయణ కల్పవృక్షం’ వంటివి. ఇలాంటివన్నీ కూడా ఎపిక్ స్థాయికి చెందిన అద్భుతమైన సాహితీ సృజనలు.
పీవీ పూర్తి ఆధునికవాది, సంప్రదాయవాది. ఆయన తరంలో ‘వేయి పడగలు’ ఈ రెండిటికీ ప్రతీక. అలాగే భాష, సాహితీ విలువల పరంగానూ దాంట్లోని కథా వస్తువు విషయంలోనూ భారతీయ సంస్కృతి, సంప్రదాయ మూలాలు కాపాడాలనే లక్ష్యంతో విశ్వనాథ సత్యనారాయణ నవ్య సంప్రదాయవాదం పంథాలో ‘వేయి పడగలు’ గ్రంథం రాశారు. అప్పటికే మహాభారతం, రామాయణం, భగవద్గీత, భాగవతం ఉన్నాయి. ఇంక అంతకు పూర్వకవులు ఎన్నో అద్భుతమైన కావ్యాలు రాశారు. తెలుగులో, సంస్కృతంలో పద్య కావ్యాలు అందించారు. అయినప్పటికీ, పీవీ ‘వేయి పడగలు’నే అనువదించడానికి వెనుక కారణాలను అధ్యయనం చేయాలంటే, ముందు అప్పుడుండే సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, చారిత్రక పరిస్థితులు అంటే 1960, 1970 దశకాల మధ్యలోని పరిస్థితులను మనం గమనించాలి.
లోతైన కోణాలు
అంటే, ఆ కాలంనాటి తెలుగు సాహిత్యంలో విశ్వనాథ సత్యనారాయణ గురించి, వారి రచనల గురించి ముందు అధ్యయనం చేస్తే, మనకు ఈ‘సహస్ర ఫణ్'(వేయి పడగలు హిందీ వెర్షన్) ఎందుకు పుట్టిందనడానికి ఒక ప్రాతిపదిక దొరుకుతది. విశ్వనాథ సత్యనారాయణ ‘వేయి పడగలు’ ఎందుకు రాశారు? ‘నియో క్లాసిసిజం’ అనే భావన (నవ్య సంప్రదాయ భావన)ను ఎందుకు తలకెత్తుకున్నరు? అంటే, అప్పుడే పాశ్చాత్య భావజాలానికి సంబంధించిన ఉదారవాద వైఖరులు, అభ్యుదయవాద ధోరణులు తెలుగు సాహిత్యంలో ప్రవేశిస్తున్నాయి. ఆ సమయంలో భారతీయత, భారతీయ సంస్కృతి, భారతీయ సంప్రదాయం, తెలుగు జీవనం.. ఇవన్నీకూడా కొంత ప్రశ్నార్థకంలో పడిపోయిన పరిస్థితి. మిగతా అన్ని వైపులనుంచీ ఎంతోమంది నవ్య ఆలోచనలతో దాడి చేస్తున్న సందర్భం.
కవితలు, కథలు, సాహిత్యం ద్వారా అవన్నీ పొడచూపుతున్న సందర్భం. భారతీయతలో ఏవో కొన్ని దురాచారాలు ఉండవచ్చు. కానీ, అంతకు మించిన సదాచారాలు ఎన్నో ఉన్నాయి. గొప్ప ఆచారాలు, గొప్ప సంప్రదాయాలుకూడా భారతీయ జీవనంలో, తెలుగువారి జీవనంలో అంతర్భాగంగా కొనసాగుతూ వస్తున్నాయి. అయితే, భారతీయ జీవనంలోని సతీ సహగమనం వంటి దురాచారాలపై నిషేధం విధించాలనే ఆలోచనకు రాజా రామ్మోహన్ రాయ్ కృషికి బ్రిటిష్ ఉదారవాదం తోడు అవడమే కారణం. అంతేగాక, ఇలాంటి దురాచారాల నిర్మూలన విషయంలో యూరప్ భావజాలాన్ని అనే కాకుండా, మరే ఇతర భావపరంపరనైనా ఆహ్వానించవచ్చు. అదే సమయంలో, భారతీయతలో ఒక అద్భుతమైన జ్ఞానం ఉంది. వేదాల్లో గొప్ప విజ్ఞానం ఉంది. వేదాల్లో మ్యాథ్స్, ఖగోళం, వైద్యం ఉన్నాయని కూడా నిరూపితమైంది. మరి వాటిని విస్మరించలేం కదా!
ఇలాంటి నేపథ్యంలో, పాశ్చాత్య భావజాలంతో ప్రభావితమైన కొంతమంది సాహితీవేత్తలు భారతీయ మూలాలను, భారతీయ తాత్వికతను, భారతీయ జీవన విధానంలోని సామాజిక పరిస్థితులను ప్రశ్నించడం మొదలెట్టారు. ఆ ప్రశ్నించడం ఆ కాలం నాటి యువతను విపరీతంగా ఆకర్షించింది. దేవుణ్ణి, వ్యవస్థను, వ్యవస్థలోని నియమాలను, సంప్రదాయాలను, మనకుండే ఆచారాలు, కట్టుబాట్లు అన్నిటినీ ప్రశ్నిస్తూ, ధిక్కరిస్తూ వస్తున్న ఒక తరం మొదలైంది. అలాంటి వారందరికీ ఒక సమాధానం చెప్పాలి. వాళ్లందరిలో మన జాతిమూలాలకు సంబంధించిన ఒక చైతన్యాన్ని నింపాలంటే, అప్పుడు కచ్చితంగా ఒక నియో క్లాసిసిజం అప్రోచ్తో ఒక నవల రాయాలనుకొని, విశ్వనాథ సత్యనారాయణ ‘వేయి పడగలు’ రాశారని సాహితీ పరిశోధకుల అభిప్రాయం. ఆయన రాసిన రచనల్లో ‘చెలియలి కట్ట’, ‘విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు’ లాంటి రచనలుకూడా నవ్యసాంప్రదాయ ధోరణితోనే ఉంటాయి. అంటే, మన సంప్రదాయాల్లోని ఔన్నత్యాన్ని చెప్పడం ఉంటుంది. ఉదాహరణకు ఆవుపేడతో ఇంటిముందట కల్లాపి చల్లుతాం. బహుశా దాని వెనుక ఎన్ని కారణాలు ఉన్నాయో మనకు తెలియదు. కానీ, అదొక ఆచారంగా వచ్చింది.
ఆవుపేడలో సూక్ష్మజీవులు, వైరస్ను నాశనం చేయగలిగే శక్తి ఉందని, పొద్దున్నే సూర్యకిరణాలు పడినప్పుడు అవి ఈ ఆవుపేడలోని నీళ్లలో కలిసి బ్యాక్టీరియాను అంతా నాశనం చేస్తుందనేది.. ‘కల్లాపి చల్లడం’ అనే ఆచారానికి ఇప్పుడు మనం చెప్తున్న శాస్త్రీయ హేతువు . అప్పుడే, 1960లలోనే విశ్వనాథ సత్యనారాయణ తన రచనలద్వారా ఆ ప్రయత్నం చేశాడు. అంటే, ప్రతీ భారతీయ సంప్రదాయంలో, ప్రతి భారతీయ సామాజిక వ్యవస్థలో ఉండే సంప్రదాయం, ఆచారం ఏర్పడటం వెనుక ఉండే ఒక సామాజిక అవసరాన్ని, దానిలోని ఔన్నత్యాన్ని ఆయన తన కథలద్వారా చెప్పడం మొదలెట్టారు. అంటే, దాంట్లో ఆధునికత ఉంది. ఆధునిక కాలానికి తగినటువంటి ‘అడాప్టేషన్’ దాంట్లో ఉంది అన్నమాట!
అనంత తాత్వికుడు
పీవీ అనువాదం చేయాలనుకుంటే, మళ్లీ రామాయణం, మహాభారతం కాకుండా ఒక కొత్త రచనను అనువదిస్తే బాగుంటుందని భావించి ఉండొచ్చు. అయితే, ‘వేయి పడగలు’ను అనువదించడం అత్యంత కష్టం, క్లిష్టం, సంక్లిష్టం! అది పాత్రలు, భాష, పదాలు, కథా వస్తువు పరంగా, దాంట్లోని మొత్తం విస్తృతి పరంగాకూడా చాలా సంక్లిష్టమయింది. వేయి పడగలు విషయానికి వచ్చేసరికి భాషను అర్థం చేసుకోవాలి. ఎన్నెన్నో కొత్త పదాలు. మన తెలుగులోనే వాడుకలో లేని ఎన్నెన్నో అద్భుతమైన పదాలు మనం వెతుక్కోగలుగుతం. అంటే, ఎన్నో పదాలు కాలక్రమంలో వాడుకలో లేకపోవడం వల్ల కేవలం పుస్తకాలకే పరిమితమైపోయి గమనంలో, వ్యవహారంలో, వాడుకలో మాత్రం కనుమరుగైపోయాయి. అలాంటి ఎన్నెన్నో పదాలు మనకు ‘వేయి పడగలు’లో దర్శనమిస్తాయి. పీవీ ఎప్పుడూ ప్రాచీనతను గౌరవించే వ్యక్తి. ప్రాచీన సంప్రదాయాన్ని, భారతీయ తాత్వికతను, భారతీయ దార్శనికతను కూడా గుండెలకు హత్తుకునే మనిషి. కనుక, ఇవన్నీ కలగలిసిన ‘వేయి పడగలు’ గ్రంథం ఆయనను బాగా ఆకర్షించి ఉంటుంది. దాన్ని మొత్తం వంగరలోని వాళ్ల గృహంలోనే హిందీలోకి అనువదించారు.
(ఏ గదిలోనైతే పీవీ నరసింహారావు కూర్చొని ‘సహస్ర ఫణ్’ను అనుసృజన చేశారో, ఆ గదిని నేను సందర్శించాను. చిన్న గది, అందులో చిన్న మంచం, ఒక చిన్న కిటికీ, ఆ గదిలోనే కూర్చొని రాసుకున్నారట!) ఈ వేయి పడగలు నవలలోని ఔన్నత్యం జాతీయస్థాయిలో దేశ ప్రజలకు తెలియాలి. తెలుగువాడి సత్తా, తెలుగు సాహిత్యం గొప్పతనం తెలియాలనే ఆకాంక్ష ఆయనను బహుశా ఈ అనువాదం చేయించుండొచ్చు. అనువదించాలనుకుంటే కన్నడ, మరాఠీ, ఉర్దూల్లో చేయొచ్చు. కానీ, ఆయన హిందీనే ఎన్నుకున్నాడు. హిందీ ఎందుకంటే, అది భారత జాతీయ భాష, అధికార భాష. హిందీలో రాయడం ద్వారా ఒక నేషనల్ స్పెక్ట్రమ్లోకి ఒక తెలుగు రచనను తీసుకెళ్లినట్టు అవుతుందన్న భావనతోనే చేశారని నేను అధ్యయనం చేసిన మేరకు నాకు అర్థమైంది.
అందుకని, ‘సహస్ర ఫణ్’ అనుసృజన ద్వారా పీవీ తన ప్రజ్ఞను, ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పారని చెప్పొచ్చు. దానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా రావడమనేది బంగారానికి తావి అద్దడం లాంటిదే! అలాగే, ఆయనకుండే సంప్రదాయ భావజాలం, దాంతోకూడిన ఆధునిక భావాలకు సంబంధించిన ఒక విషయ వివేచన కలిసి ‘వేయి పడగలు’ లాంటి ఒక నియో క్లాసిక్ వర్క్ను అనుసృజన చేశారని చెప్పొచ్చు. అది సాహిత్యపరంగా వారికి జాతీయ స్థాయిలో అవార్డు తీసుకురావడం కూడా చంద్రుడికో నూలుపోగు లాగా, మబ్బుకి మెరుపు తీగలాగా, ఆయన పాండిత్యానికి ఒక గుర్తింపులాగా మిగిలిపోయింది.
పత్రికలు: సృజనాత్మక సాహిత్యం
ఇదే సందర్భంలో పీవీకి సంబంధించి మరికొన్ని విషయాలూ తెలుసుకోవాలి. పీవీ వరంగల్లో ‘కాకతీయ పత్రిక’ సంపాదకుడిగా వ్యవహరించారు. అంటే, ఆయన జర్నలిస్టు కూడా! ఇక జర్నలిస్టుకు ఉండే గొప్ప అర్హత అన్నీ తెలుసుకోవాలనే తపన. జర్నలిస్టు అంటే జనరలిస్ట్. అంటే, జనరల్గా ఉండే అన్ని అంశాలూ స్పెషలిస్ట్ స్థాయిలో తెలుసుకోవాలి. అలా అన్ని సబ్జెక్ట్స్, ప్రపంచంలో భూమిమీద, ఆకాశం కింద ఉండే ప్రతి అంశాన్నీ తెలుసుకోవాలనే ఒక సహజమైన ఉత్సుకత జర్నలిస్టుకు ఉంటది. అలాగే, పీవీకూడా ఆ ఉత్సుకత కొద్దే అన్ని రకాల అంశాలమీద వ్యాసాలు రాయడానికి అనువుగా ‘కాకతీయ పత్రిక’కు సంపాదకుడిగా పనిచేశారు. ఈ పత్రికలో ఆయన ‘ఆర్తగీతికలు’ అనే పేరుతో కవితలుకూడా చాలా చక్కగా రాశారు.
ఆయన రాసిన కవితలన్నీ సంప్రదాయ కోణంలోనే ఉంటాయి. ఆ భాషకూడా గ్రాంథికానికి, వ్యావహారికానికీ మధ్యేమార్గంగా ఉంటది. అంటే, సంస్కృత భాష ప్రభావిత పాండిత్యంతో కూడుకున్న తెలుగు. ఇప్పుడుండేలాగా వ్యవహారికంగా మన మాటలు మన జీవనంలో ఉండే భాషనే వాడటమనేది అప్పట్లో అంతగా లేదు. వ్యవహారిక భాషా ఉద్యమం అప్పటికే వచ్చింది. కానీ, ఈ సంప్రదాయ భాషనే, ఈ సంప్రదాయ సాహిత్యాన్నే, సంప్రదాయ శైలిలో ఉండే పదాలను ఉపయోగిస్తూనే కావ్యం రాయడమనేది అప్పట్లో ఉన్న ఒక పాండిత్య సృజనగానూ, మేధోతనానికి కొలమానంగానూ ఉండేది. కనుక, ఆయన కూడా అలాగే రాసిండు. ఆయన ‘కాకతీయ పత్రిక’లో రాసిన ఆర్తగీతికలు, శీర్షికకూడా ఎంతో లోతైన అర్థంతో కూడి ఉంటాయి. ఆయన రాసిన కవితలన్నీ ఆర్తితో కూడినవి. అంటే, ఒక దుఃఖం, వేదన, నివేదనతో కూడిన కవితలు అనే ఆలోచనలతో ‘ఆర్తగీతికలు’ అనే పేరుతో తన నివేదనను వ్యక్తం చేశారాయన.
పీవీకి అక్షరం విలువ ఎంత తెలుసో, అక్షరాలన్నీ ఒక్కచోట మూటకట్టే వేదిక అయిన పత్రిక ప్రాధాన్యం కూడా అంతకన్నా ఎక్కువే తెలుసు. అందుకే, కాకతీయ పత్రిక ద్వారా తన ఆలోచనలను, మనోభావాలను వార్తలు, విశ్లేషణల రూపంలో పంచుకోవడమేకాక అందులో ఎన్నో సృజనాత్మక రచనలను కూడా చేశారు. పాములపర్తి శేషగిరిరావుతో కలిసి ‘జయ-విజయ’ కలం పేర్లతో ఈ పత్రికలో ఎన్నెన్నో గేయాలు, పద్యాలు, వ్యాసాలు రాశారు. అంతేగాక, 1949 ప్రాంతంలో ఇదే పత్రికలో తను రాసిన ‘గొల్ల రామవ్వ’ కథను పీవీ ప్రచురించారు. అయితే, ఆ కథకు తన సొంత పేరు కాకుండా కలం పేరు ‘విజయ’ను వాడటం విశేషం. అలాగే, అప్పట్లోనే పీవీ ‘మంగయ్య అదృష్టం’ పేరుతో ఓ సోషియో ఫాంటసీ నవలికను కూడా రాశారు.
ఇది ఆయనలోని కాల్పనిక సామర్థ్యాన్ని మాత్రమేకాక రాజకీయ, సామాజిక అంశాలపట్ల సెటైర్ను, వ్యంగ్య ధోరణిని కూడా సున్నితంగా తెలియజేస్తుంది. అలాగే, ప్రముఖ మరాఠీ రచయిత హరి నారాయణ్ ఆప్టే రాసిన ‘పాన్ లక్షత్ కోన్ ఘోతో’ రచనను తెలుగులో ‘అబలా జీవితం’ పేరుతో అనువదించారు. మరోవైపున కాకతీయ పత్రికకు అనుబంధంగా ‘కాకతీయ గ్రంథమాల’ పేరుతో గ్రంథాల ముద్రణనూ నిర్వహించారు. ఇలా, పీవీ జర్నలిస్టుగా, రచయితగా, ముద్రాపకుడిగా, ప్రచురణకర్తగా కూడా నిర్మాణాత్మక కృషి చేశారని చెప్పవచ్చు. పీవీ నరసింహారావు ఎన్ని కోణాలనుంచి కనిపించినా, ఆ కోణాలన్నిటికీ మూలాలు ఎక్కడ ఉన్నాయని వెదికితే, అవి కచ్చితంగా అక్షరం నుంచి, సాహిత్యం నుంచి, భాషపట్ల ఆయనకుండే ప్రేమనుంచే మొదలయ్యాయని చెప్పవచ్చు. అంటే, పీవీ మూర్తిమత్వ సౌధానికి పునాదులన్నీ సాహిత్యంలోనే ఉన్నాయి.
భాషలే శ్వాసగా..
ఒక సగటు తెలంగాణ బిడ్డ అంతర్జాతీయ స్థాయిలో ఒక విశ్వమానవుడిగా ఎదగడానికి కావలసిన నేపథ్యాన్ని తనకు తాను మార్గాన్ని వేసుకొని, తనను తాను నిర్మించుకున్న పథాన్ని మనకు ఆవిష్కరిస్తది. అందుకే, ఆయన తనకున్న అవసరం, ఆసక్తి అనే రెండు కారణాల వల్ల, ఫ్రెంచ్, స్పానిష్, అరబిక్ వంటి విదేశీ భాషల్లోనూ అద్భుతమైన ప్రావీణ్యాన్ని సాధించాడు. ఏ దేశానికి వెళ్తే ఆ దేశంలో వారితో ఆ భాషలోనే మాట్లాడే ప్రయత్నం చేశాడు. 17 భాషలు (మొత్తం తొమ్మిది భారతీయ భాషలు, ఎనిమిది అంతర్జాతీయ భాషలు) ఆయన అనర్గళంగా మాట్లాడేవారు. ఈ ప్రావీణ్యానికి ఆయనలోని తృష్ణ, విజ్ఞాన దాహంతోపాటు అప్పట్లో ఆయనకుండే అవసరం కూడా దోహదపడింది. దానికి ఆయన ఆసక్తి తోడై బహుభాషాకోవిదుడిగా మారడానికి కారణమైంది.
పీవీ- కేసీఆర్:సాహితీ పిపాస – కళా హృదయం
మనకు చాలా అరుదుగా కనిపించే అద్భుతమైన మూర్తిమత్వాలు, వ్యక్తిత్వాలలో ఒకవైపు పీవీ నరసింహారావు ఉంటే మరోవైపు కేసీఆర్ కనిపిస్తడు. ఎందుకంటే, కేసీఆర్కూడా అచ్చమైన కళాప్రేమికుడు. కళాహృదయం ఉన్న మనిషి. సాహితీవేత్త కూడా. ఆయనా కవితలు, పాటలూ రాస్తరు. సంప్రదాయ సాహిత్యం అంటే వల్లమాలిన ప్రేమ. పద్య సాహిత్యం పట్ల విపరీతమైన ఆరాధన. ఎన్నెన్నో పద్యాలను సుభాషిత శతకాలనుంచి మొదలుకొని పోతన పద్యాల వరకూ అత్యంత అద్భుతంగా, అనర్గళంగా, కంఠతా చెప్పగలిగిన ప్రావీణ్యం, ప్రేమ ఉన్న అరుదైన పాలకులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు! ఇది వారికి సాహిత్యం పట్ల ఉన్న ప్రేమకు ఉదాహరణ. తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు, ఆవిర్భవించిన తర్వాత ప్రతి సందర్భంలోనూ సాహితీవేత్తలందరూ తలలెత్తుకొని తెలంగాణ జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ప్రయత్నం చేయడం వెనక కేసీఆర్ వ్యూహం, ఆయనకు అక్షరం పట్ల, సాహిత్యం పట్ల ఉండే ప్రేమే కారణం!తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత కేసీఆర్ సారథ్యంలో ఎన్నెన్నో అద్భుతమైన సాహితీ, సాంస్కృతిక కళా కార్యక్రమాలను, భాషా సాంస్కృతిక శాఖద్వారా ప్రభుత్వం నిర్వహిస్తున్నది.
‘దాశరథి’ పేరిట పురస్కారం, జయంతి ఉత్సవాలు చేయడం, ‘కాళోజీ నారాయణరావు’ పేరిట తెలంగాణ భాషా దినోత్సవం ప్రకటించడమే కాకుండా, ఆయన పేరిట పురస్కారాన్ని ఏర్పాటు చేసి సాహితీవేత్తలందరినీ గౌరవించుకోవడం. అలాగే, 2017లో నభూతో.. స్థాయిలో ‘ప్రపంచ తెలుగు మహాసభలు’ నిర్వహించడం కొన్ని ఉదాహరణలు. ప్రపంచ తెలుగు మహాసభలు 1975లో మొదలయ్యాయి. కానీ, తెలంగాణ రాష్ట్రమొచ్చిన తర్వాత తెలుగు మహాసభలు జరిగినంత వైభవంగా, గతంలో ఎప్పుడూ జరగలేదనే పేరును, ప్రతిష్టను, గౌరవాన్ని పొందింది. ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలుగుభాష, సాహిత్యం, కవులు, కళాకారుల పట్ల ఉన్న ప్రేమ, అనురాగం, అనురక్తివల్లనే ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. రాజకీయాలకు అతీతంగా సాహిత్యాన్ని అభిమానించే వ్యక్తిగా కేసీఆర్ ఎప్పటికప్పుడు ప్రతి సందర్భంలోనూ, తను ముందుండి సాహిత్యం పట్ల ఉండే ప్రేమను చెప్తారు!
అరుదైన వ్యక్తిత్వాలు
అలా పీవీ నరసింహారావుకు ఎట్లయితే సాహిత్యం పట్ల ప్రేమ ఉందో, అదే లక్షణాన్ని మళ్లీ మనం కేసీఆర్లో గమనించవచ్చు. కేసీఆర్కూడా చాలా కవితలు రాస్తరు. నల్లగొండ ఫ్లోరోసిస్మీద కేసీఆర్ చెప్పిన వాక్యాలైతే అప్పట్లో జనం గుండెలను రగిలించాయి. అలాగే, తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలను ఉర్రుతలూగించిన ప్రతిపాట వెనుక దాంట్లోని వాక్యాలు, దానికి స్ఫూర్తి, దాన్ని ఏ కోణంలో రాయాలో మొత్తం నిర్దేశించి ఆయా రచయితల చేత పాటలు రాయించుకున్నది, రాయించింది ప్రత్యక్షంగా కేసీఆరే! ఇది అందరికీ తెలుసు. అందుకని, కవిత్వం పట్ల, సాహిత్యం పట్ల వారికుండే అభిమానం అనన్యసామాన్యం. పాలకులు సాహిత్యాభిమానులుగా ఉండటమనేది తక్కువగా చూస్తాం. అలాంటి అరుదైన వ్యక్తిత్వం, మూర్తిమత్వం, సాహితీ అభినివేశం, అక్షరం పట్ల గౌరవం ఉన్న ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. అందుకే, ఇప్పుడు జరుగుతున్న ‘శత జయంతి’ ఉత్సవాలు పీవీ నరసింహారావులాంటి సాహితీవేత్తకు మరొక సాహితీవేత్త అందిస్తున్న నీరాజనంగానే భావించాలి. పీవీలోని బహుముఖీన తత్వాన్ని సాహితీ వ్యక్తిత్వాన్ని, అంతర్జాతీయ నైపుణ్యాన్ని, విదేశీ దౌత్య వ్యవహారాల నైపుణ్యాన్ని, నూతన ఆర్థిక సంస్కరణలను రూపొందించిన ప్రవక్తగా ఆయన ప్రభావాన్ని, మొత్తం భారతీయ ఆర్థిక జీవనంలో, భారతీయ పాలనారంగంలో, తెలుగు పాలనారంగంలో వారు వేసిన ముద్రను.. విద్యారంగంలో, జైళ్ల్ల సంస్కరణలలో, భూసంస్కరణలలో వారు చూపిన ప్రభావాన్ని ఆవిష్కరించాలనే లక్ష్యంతోనే ఈ ‘పీవీ శత జయంతి ఉత్సవాలు’ అద్భుతంగా నిర్వహించాలని కేసీఆర్ కంకణం కట్టుకున్నారు.
-మామిడి హరికృష్ణ, 8008005231