ఆయన చదివింది పదో తరగతే! అయితేనేం, ఇంజినీర్లకు తీసిపోరు. తన చేతికి ఏది చిక్కినా, చక్కని వస్తువుగా మారిపోవాల్సిందే! జనాలకు ఎంతోకొంత ఉపయోగపడాల్సిందే! వైద్యం, వ్యవసాయం, ఆటోమొబైల్ ..రంగం ఏదైనా వినూత్న ప్రయోగాలతో ‘ఔరా!’ అనిపిస్తున్నారు అల్లాడి ప్రభాకర్. కొత్త కొత్త ఆవిష్కరణలలో తన ప్రతిభను నిరూపించి, మహామహుల మెప్పును పొందారు ఈ సామాన్య సైంటిస్టు.
ప్రభాకర్ది జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్. పదో తరగతి తర్వాత ఐటీఐలో చేరారు. మధ్యలోనే చదువు ఆపేయాల్సి రావడంతో తండ్రికి సాయంగా ఎలక్ట్రీషియన్ వృత్తిలోకి దిగారు. అందులో అనుభవం సాధించిన తర్వాత, ముప్పయ్ ఏండ్ల కిందట మెట్పల్లికి మకాం మార్చారు. కరెంటు పనిచేస్తూనే ఏదో ఒక కొత్త ఆవిష్కరణ చేయాలని తపించేవారు. నలుగురిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాటపడేవారు. ఈ క్రమంలో తన సృజనతో ఇంజినీర్లకు సైతం సాధ్యం కానీ అనేక వస్తువులను ఆవిష్కరించారు. ‘ప్రభాత్ ఇండస్ట్రీస్’ను నెలకొల్పి, దానిని తన ప్రయోగాలకు కేంద్రంగా మార్చుకున్నారు.
అన్నీ ‘ఆటోమేటిక్’గా..
ప్రభాకర్ ప్రయోగాలు ఒక రంగానికి పరిమితం కాలేదు. వ్యవసాయం మొదలు కరోనా వరకు ప్రజల అవసరాన్ని బట్టి నూతన ఆవిష్కరణలు చేస్తుంటారు. తొలినాళ్లలోనే విద్యుత్ నిలిచిపోగానే ఆన్ అయ్యేలా, కరెంట్ రాగానే ఆఫ్ అయ్యేలా ‘ఆటోమేటిక్ జనరేటర్ స్టార్టర్’ను రూపొందించారు ప్రభాకర్. కేంద్ర చిన్నతరహా పరిశ్రమల సంస్థ నుంచి పేటెంట్ కూడా పొందారు. వ్యవసాయ పంపు సెట్ (మోటర్) కోసం టైమ్ స్టార్టర్ను తయారు చేశారు ప్రభాకర్. దీంతో పొలానికి నీటి అవసరాన్ని బట్టి, మోటర్ ఎంత సమయం నడవాలో టైమ్ సెట్ చేసుకోవచ్చు. దీనివల్ల విద్యుత్తోపాటు భూగర్భ జలాలనూ పొదుపుగా వాడుకునే అవకాశం ఉంది. 2002లో సైరన్తో కూడిన ఫోకస్ లైట్ పరికరాన్ని తయారు చేశారు. దీనిద్వారా 500 మీటర్ల దూరం వరకు కాంతిపుంజాన్ని ప్రసరింపజేయవచ్చు. సైరన్ శబ్దం మూడు కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది. ప్రమాద సమయాల్లో ప్రజలను అప్రమత్తం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇలాంటి ఎన్నో ఆవిష్కరణలు ప్రభాకర్ పనితనాన్ని తెలియజేస్తాయి.
రకరకాల ఆవిష్కరణలు
ప్రభాకర్ ప్రాణంపోసిన మొబైల్ స్ట్రెచర్ కూడా ఎంతో ఉపయోగకరమైనది. మడత పెట్టేందుకు వీలుగా ఉండే ఈ స్ట్రెచర్ను ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లవచ్చు. లైన్మెన్లు విద్యుత్ స్తంభాలు ఎక్కడానికి వీలుగా పోల్ క్లిప్లు, సేఫ్టీబెల్ట్లు తయారు చేశారు. బంబోకూలర్, బోర్వెల్ పుల్లింగ్ యంత్రం, మిడతల భరతం పట్టే పరికరం, సోలార్ ట్రాకింగ్ సిస్టమ్, టర్మరిక్ బాయిలర్.. ఇలా పదుల సంఖ్యలో ఆవిష్కరణలు చేశారు ప్రభాకర్. కొవిడ్ నేపథ్యంలో శానిటైజర్ స్టాండ్ తీర్చిదిద్దారు. ఆటోమేటిక్ డిస్-ఇన్ఫెక్షన్ టన్నెల్ను కూడా ఆవిష్కరించారు. డ్రైనేజీల్లోనూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి, భూగర్భ జల నిల్వలు పెంచుకోవచ్చని ప్రయోగాత్మకంగా నిరూపిస్తున్నారు. తన ఇంటి ముందు నుంచి పారే మురుగు కాలువలో ఈ ప్రయోగం చేశారు. ప్రభాకర్ను అనేక అవార్డులూ వరించాయి. జిల్లాస్థాయి విశిష్ట పురస్కారం మొదలు మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ ప్రశంసా పత్రం వరకు ఎన్నో కీర్తిపతాకలు ఆయన ఆవిష్కరణలపై రెపరెపలాడాయి. 2019లో సీఐఐ, తెలంగాణ ప్రభుత్వం నుంచి లీడర్షిప్ మాన్యుఫ్యాక్చరింగ్ ఎక్స్లెన్స్ పురస్కారం, 2020లో ఏఎస్సీఐ ప్రశంసా పత్రం అందుకున్నారు ప్రభాకర్.
ఉపరాష్ట్రపతి మెచ్చుకోలు
ప్రభాకర్ ఆవిష్కరణల్లో అత్యంత ఆదరణ పొందింది.. మల్టీపర్పస్ బెడ్. నిస్సహాయస్థితిలో ఉన్న వృద్ధులకు, రోగులకు సౌకర్యంగా ఉండేలా ఈ మల్టీపర్పస్ బెడ్కు రూపకల్పన చేశారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లో జరిగిన ‘ఇంటర్నేషనల్ ఇన్నొవేషన్ ఫెయిర్-2019’లో ఈ ఆవిష్కరణకు ఉత్తమ అవార్డు దక్కింది. దీని పనితీరును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్వయంగా తిలకించి, ప్రభాకర్ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రితోపాటు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రభాకర్ పురస్కారాన్ని అందుకున్నారు.
-అలాల శంకర్