‘బడాయోడితో పోయి.. లడాయి తెచ్చుకున్నట్లు’
‘ఏందిరా అయ్యా! నీకేం పనిలేనట్లు ఆ బడాయోడితో పోయి తన్నులు తిన్నవా? వాడొక పెద్ద బొంబోతులోడు. లడాయి లేందే ఇంటికిరాడు. వాడితో నీకు సోపతేందిరా?’ అంటూ పిల్లలను హెచ్చరిస్తుంటారు పెద్దలు. బడాయి అంటే లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు చెప్పడం. ప్రతి విషయంలోనూ గొప్పలకు పోవడం. తాలు మాటలు చెప్పడం. ఇసొంటోళ్లు ఏదైనా కొత్త ప్రదేశానికిపోతే ఆ బడాయి చేష్టల కారణంగా తొందరగానే తన్నులు తింటారు. సోపతికి పోయినోడినీ ఉతుకుతారు. అందుకే, ‘బడాయోడితో పోయి.. లడాయి తెచ్చుకోకు బిడ్డా’ అని భయం చెబుతుంటారు. ఇంసొంటిదే మరో సామెత ‘బొంబోతులోని వెంబడిపోతే.. బోకెలు చేతుకత్తయి’. బొంబోతులోడు అంటే మాయ మాటలతో అరచేతిలోనే స్వర్గం చూపెట్టేవాడు. పక్కా మాయగాడు, మహా మాటకారి. బోకెలు అంటే చిప్పలు. మీ సోపతిగాళ్లలో ఇసొంటోళ్లు ఉంటే జాగ్రత్త సుమీ!
‘అంగట్ల అవ్వా అంటే.. ఎవనికి పుట్టినవ్ బిడ్డా అందట’
తెలియని (అపరిచితులు) వ్యక్తులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించే సామెత ఇది. నాలుక అదుపులో లేకపోతే నలుగురిలో అబాసుపాలు కావాల్సి వస్తుంది. లేని సంబంధాన్ని అంటగట్టే సందర్భంలోనూ ‘అంగట్ల అవ్వా అంటే.. ఎవనికి పుట్టినవ్ బిడ్డా అందట’ అనే సామెతను వాడతారు. మర్యాద తెలియనివాళ్లతో జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరిస్తూ చెప్తారు జానపదులు. ఎవరైనా తెలిసినవాళ్లు అనుకోకుండా కనిపిస్తే వాళ్లకు మనం తెలిసినా తెలియనట్లు నటిస్తూ, ‘ఎవని బిడ్డవో’ అని తప్పించుకునే సందర్భంలోనూ, ఈ సామెతను వాడతారని పెద్దలు అంటారు. ఇలాంటి కొన్ని మాటలకు ఉత్తగనే అపార్థాలు తీస్తారు. ‘ఏయ్’ అని పిలిస్తే ‘నీకు నేను పెళ్లాన్నా..’ అని లొల్లి పెట్టుకుంటారు. ‘ఆగవయ్యా’ అంటే ‘ఏం నీకు నేను బామ్మర్దినా?’ అని గొడవకు వస్తారు. అందుకే, అపరిచితులతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే, నలుగుట్ల నవ్వుల పాలవుడు ఖాయం.
ఓ ఎంకన్నా.. మంద పెట్టించినవా?
పురుగు మందులు, రసాయన ఎరువులు లేని కాలంలో భూమిని సారవంతం చేసేందుకు జానపదులు ఎక్కువగా ఉపయోగించిన పద్ధతి మంద పెట్టుడు. అంటే, పంటకాలం అయిపోయిన తర్వాత దుక్కి దున్నిన పొలంలో గొర్లు, మేకల మందలకు, గేదెలకు తడికలు వేసి, వాటిని అందులో ఉంచేవారు. ఉదయం మేతకు పంపి రాత్రి మాత్రం అందులో ఉంచేవారు. పొద్దున్నే గొర్లపెంట, గొడ్లపేడ పొలమంతా చల్లించి భూమిని సారవంతం చేసేవారు. ఏ జంతువులైనా గుంపుగా ఉంటే ‘మంద’ అంటారు. ‘గొర్లమంద’ ఇలా పుట్టిందే. కొన్ని ఊర్లలో బాతుల మందతో కూడా మంద పెడతారు. యాసంగి పంట కోసిన పొలాల్లోనే ఎక్కువగా మంద పెడుతుంటారు.
సాలేర్వాలు అయ్యిందా?
వ్యవసాయ సంబంధమైన పలుకుబడి సాలేర్వాలు (సాలు, ఇర్వాలు). తొలకరి వర్షాలు మొదలైన తర్వాత పొలాలు దున్నేటప్పుడు విరివిగా వినిపించే మాట ఇది. సాలు (నిలువు) ఒకసారి దున్నడం. ఇర్వాలు అంటే రెండోసారి (అడ్డం) దున్నడం. ఒక వాలున పొలం దున్నిన తర్వాత రెండో వాలులో దున్నడం. రెండుసాళ్ల దుక్కిని సాలేర్వాలు అంటారు. ఇందులోనే ‘ఇడుగు ఇర్వాలు’ అనే పదబంధం కూడా ఉంది. అంటే, రెండుసార్లు దున్నిన భూమిని ఎటువైపు నుంచైనా మూడోసారి కూడా దున్నడం. ఆ తర్వాత గొర్రు తోలుతారు. ఆనంక గుంటకు కొట్టి సాగుకు యోగ్యంగా పొలాన్ని తయారు చేస్తారు. వరిపొలాలకు గొర్రు, గుంటక ఉండదు. జంబు గొడతారు. ఆ తర్వాత, నాట్లకు పూనుకుంటారు.
-డప్పు రవి