బైక్, కారే కాదు.. ఏ వాహనాలైనా బయటికి తీద్దామంటేనే భయం. కారణం, రోజురోజుకూ పెట్రోలు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అలాగని, మన అవసరాలు తీర్చుకోకుండా ఉండలేం. ఈ సమస్యకు పరిష్కారమే లేదా? అంటున్న సామాన్యుడికి, ‘ఇదిగో’ అని భరోసా ఇస్తున్నది హైదరాబాద్ స్టార్టప్ ‘ఈ-ట్రియో’. ఈ సంస్థ రవాణా ‘ఈ-వాహనాల’ను అద్దెకిస్తూ మార్కెట్లో దూసుకుపోతున్నది.
హైదరాబాదీ ఎలక్ట్రిక్ వాహనాల స్టార్టప్ ‘ఈ-ట్రియో’. ఎలక్ట్రిక్ వాహనాలకు మార్కెట్లో డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఆకర్షణీయమైన అద్దె పథకాలతో ముందుకొస్తున్నదీ సంస్థ. వచ్చే ఆరు నెలల్లో రోడ్లపై వెయ్యికి పైగా ఎలక్ట్రిక్ వాహనాలను తిప్పాలన్నది లక్ష్యం. ఈ మధ్యే ఈవీ ‘టూరో’ పేరుతో కార్గో త్రీ-వీలర్ వాహనాన్ని మార్కెట్కు పరిచయం చేసింది ట్రియో. అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఐకియా, బిగ్బాస్కెట్, లెట్స్ ట్రాన్స్పోర్ట్ వంటి పలు కార్పొరేట్ లాజిస్టిక్ కంపెనీలకు ఇవి ఎంతోగానో ఉపయోగపడుతున్నాయి.
భలే బేరం… అద్దె
‘ఈ-ట్రియో’ సంస్థ తాను తయారుచేసిన టూరో మినీ, టూరో మ్యాక్స్ కార్గో వాహనాలను అద్దెకు ఇస్తున్నది. అద్దె వ్యవధి 18 నెలల నుంచి 42 నెలల వరకూ ఉంటుంది. ఆర్డర్నుబట్టి ఒక్కో కంపెనీకి దాదాపు 20 వాహనాలను సమకూరుస్తున్నది. బాడుగ రూ. 7,000 నుంచి ప్రారంభమవుతుంది. మోడళ్లనుబట్టి ఆ మొత్తం మారవచ్చు. అదికూడా ఆర్డర్ పెట్టగానే ఇవ్వరు. ట్రాక్ రికార్డును తెలుసుకుంటారు. కంపెనీ స్థితిగతులు విశ్లేషించుకొంటారు. ఆ తర్వాతే ఒప్పందం ప్రకారం వాహనాలను అద్దెకు ఇస్తారు. వాహనాల అద్దె గడువు ముగిసే లోపు బాడుగకు తీసుకున్న కంపెనీ ముందు రెండు ఆప్షన్లు ఉంటాయి. వాహనాన్ని తిరిగివ్వడం, వాహనం తిరిగిన కాలాన్ని పరిగణనలోకి తీసుకొని దానికి విలువ చెల్లించి, సొంతం చేసుకోవడం. బీమా సౌకర్యమూ ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరులలో మాత్రమే టూరో మినీ సేవలు అందుబాటులో ఉన్నాయి. కొద్ది నెలల్లోనే దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో విస్తరిస్తామని ‘ఈ-ట్రియో’ ఫౌండర్స్ సత్య యలమంచిలి, దీపక్ చెబుతున్నారు.
ఆయిల్ ఇంజిన్ తీసేసి..
పెట్రోలు ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో సామాన్యులు, మధ్యతరగతి ప్రజల ఇబ్బందులను గమనించారు సత్య, దీపక్. ఈ సమస్యకు పరిష్కారంగా 2017లో ‘ఈ-ట్రియో’ స్టార్టప్ను ప్రారంభించారు. ఆయిల్ ఇంజిన్ను తీసేసి ఎలక్ట్రిక్ ఇంజిన్, గేర్ వ్యవస్థను అమర్చే టెక్నాలజీని సమకూర్చుకొని, రెట్రోఫిట్టింగ్ విధానంతో సక్సెస్ అయ్యారు. మారుతి ఆల్టోస్, వాగన్-ఆర్ వాహనాలకు అమర్చిన విద్యుత్ ఇంజిన్లకు ఎటువంటి ఇబ్బందులూ రాకపోవడంతో సంబంధిత సంస్థల ఆమోదమూ లభించింది. రెట్రోఫిట్టింగ్ ద్వారా అమర్చిన ఎలక్ట్రిక్ ఇంజిన్లకు ఒక్కసారి చార్జింగ్తో దాదాపు 150 కి.మీ. ప్రయాణించవచ్చు. ఇలా బైక్లు, తక్కువ బరువుండే ఫోర్ వీలర్ వాహనాలకూ విజయవంతంగా ఎలక్ట్రిక్ ఇంజిన్లను అమర్చారు. ‘ఈ-ట్రియో’ రూపొందించిన ఎలక్ట్రిక్ వాహనాలకు ఎక్కడైనా, ఎప్పుడైనా సులువుగా చార్జింగ్ పెట్టుకోవచ్చు. సాధారణ సాకెట్లో అయితే, ఫుల్ చార్జ్ అవడానికి 5 గంటలు పడుతుంది. కానీ, వీటికి ఫాస్ట్ చార్జింగ్ వెసులుబాటుకూడా ఉంది. గంటలోనే పనైపోతుంది.
సింగపూర్ ఫండింగ్
సామాన్య, మధ్యతరగతి ప్రజల కోసం ఎలక్ట్రిక్ (ఈ) బైక్లు, ఈ-సైకిళ్లను ప్రవేశడుతున్నది టియో. ఇటీవల అశ్వ, ఐస్విచ్ పేరుతో రెండు ‘ఈ-సైకిళ్ల’ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఓ సింగపూర్ సంస్థ ఈ ప్రాజెక్టులో భారీగా పెట్టుబడులు పెట్టింది. ‘హైదరాబాద్లోని 20,000 చ. అ. విస్తీర్ణంలో మా సంస్థ కార్యకలాపాలు సాగిస్తున్నది. ఉద్యోగాల్లోనూ స్థానిక యువతకే ప్రాధాన్యం ఇస్తున్నాం. మన దేశంలో వాయు కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం’ అన్నారు వ్యవస్థాపకుల్లో ఒకరైన సత్య యలమంచిలి.