రాజన్న సిరిసిల్ల జిల్లా .. కరీంనగర్-కామారెడ్డి మార్గంలో సిరిసిల్లనుంచి 20 కి.మీ. దూరం వెళ్లాక ఓ చోట మన చూపులు ఆగిపోతాయి. రాచర్ల గొల్లపల్లి, రాచర్ల బొప్పాపూర్, రాచర్ల తిమ్మాపూర్, రాచర్ల గుండారం.. ఈ నాలుగు గ్రామాలకు ఇంటిపేరులా ఓ కోటపేరు అక్కడ కనిపిస్తుంది. ఆ మూడక్షరాల వెనుక చరిత కెక్కని ఘన చరిత్ర ఉంది.
రాచర్ల బొప్పాపురం గ్రామానికి పడమర వైపున కిలోమీటరు దూరంలో 70 ఎకరాల్లో విస్తరించిన కోట శిథిలాలు మనకు దర్శనమిస్తాయి. ఇదే ఘనత వహించిన రాచర్ల కోట. బురుజులు, కోట ద్వారాలు, అగడ్తలు.. ఇదొక ప్రాచీన స్థల దుర్గమనడానికి సాక్ష్యాలు. కోటకు నాలుగువైపులా నాలుగు
ద్వారాలున్నాయి. ప్రస్తుతం తూర్పున ప్రధాన ద్వారం జాడలు మాత్రం తెలుస్తున్నాయి. పడమటి తోవను ‘ఏనుగుల దిడ్డి’ అని పిలుస్తారు. ఇక్కడి నుంచే రాజుగారి పట్టపుటేనుగు ఆ పక్కన ఉన్న జక్కుల చెరువుకు వెళ్లి నీళ్లు తాగేదట.
దక్షిణపు దారిని ‘గొల్లదాని దిడ్డి’ అంటారు. ఈ తొవ్వన ఒక యాదవ మహిళ కోటకు పాలు, పెరుగు తెస్తుండేదని, ఆమె పొరపాటున రహస్యం చెప్పడం వల్లనే రాచర్లకోటను గోల్కొండ నవాబు కొల్లగొట్టాడని చెబుతారు. ఇప్పటికీ ఉత్తర ద్వారం గుర్తులున్నాయి కానీ, భూమిలో బాగా పూడుకుని పోయింది. కోటచుట్టూ అగడ్తలు కనిపిస్తాయి (లోతైన కాలువలు). పటేండ్ల అగుర్త, భట్టోండ్ల అగుర్త అని పిలుస్తుంటారు. కోటలోపల పాతబావుల బొందలు, హనుమాండ్ల విగ్రహాలు, జైనవిగ్రహాలు, రాతి గానుగలు, మండపాలు, నందులు, వినాయకుడు, ఏనుగు, నాగశిలలు, లింగాలు, స్తంభాలు, కూలిన గుళ్లు, మసీదుల ఆనవాళ్లున్నాయి. ప్రతి శిథిలం వెనుకా ఓ కథ ఉంది. గ్రంథాలు చెప్పని చారిత్రక ఘట్టాలున్నాయి. ఆ నిజాలు వెలికిరావాల్సి ఉంది.
రాచర్ల పరగణాగా పేరు
రాచర్ల బొప్పాపురం ఒకప్పుడు 40 ఊర్ల పరగణా. ‘రాచర్ల పరగణా’గా పేరు పొందింది. ఈ కోటను సింగమహారాజు, బొప్పరాజు పాలించారు. రాచర్ల కోట కాకతీయుల కాలంలో సామంత రాజ్యంగా ఉండేది. సింగమహారాజు అనే సామంతుడు రాచర్ల ప్రాంతాన్ని పాలించాడని, ఆయన రెండో ప్రతాపరుద్రుడి సమకాలికుడని చెబుతారు. కోట వెనుక చెరువుకు దక్షిణం వైపు చిట్టాలగడ్డ ఉంది. ‘చిట్టెం’ అంటే లోహాన్ని కరిగిస్తే ఏర్పడే మైలగడ్డ. ఇక్కడ ఆయుధాలు తయారు చేసేవారని, ఆయుధ కర్మాగారం కూడా ఉండేదనీ తెలుస్తున్నది. కోటకు 3 కి.మీ. దూరంలో సర్వాయిపల్లె ఉంది. ఇక్కడ బురుజు నిర్మించి రాచర్లకోటకు రక్షణగా సైన్యాన్ని ఉంచేవారు. రాచర్ల కోటపై దాడి చేసేందుకు గుంటూరునుండి వచ్చిన మాచర్ల రాజులు ఇక్కడ సైన్యాన్ని నిలిపి కుట్రలు పన్నారట. మాచర్ల రాజులు వచ్చిన విషయం తెలిసి సింగమహారాజు కత్తితో పొడుచుకొని ఆత్మార్పణ చేసుకున్నాడని చెబుతుంటారు. ప్రస్తుతం సర్వాయిపల్లె వారంతా బొప్పాపూర్లో స్థిరపడ్డారు.
మహిమగల్ల జక్కులమ్మ
ఎనుక దిడ్డి (ఏనుగు దిడ్డి)పై జక్కులమ్మ గుడి ఉంది. గుడిలో పురాతన శివలింగం ఉంది. జక్కులమ్మ బొప్పాపూర్కు చెందిన వైశ్యుల (అల్లాడి వారు) ఆడపడుచు. ఈమె కోమటిపల్లిలో నివాసం ఉండేదట. రోజూ కోటవెనుక ఉన్న చెరువు నుంచి నీళ్లు తెచ్చి శివలింగానికి అభిషేకం చేసేదట. జక్కులమ్మకు చాలా మహిమలు ఉండేవని గ్రామస్తులు నమ్ముతారు. ఒకరోజు జక్కులమ్మ చెరువులోకి నీళ్లు తెచ్చేందుకు వెళ్లి అందులో మునిగి చనిపోయిందట. అప్పటి నుంచి శివుడి గుడిని, చెరువును ఆమె పేరుతో పిలుస్తున్నారు. గ్రామంలో ఇప్పటికీ కొందరి ఇంటి పేరు అదే. కోమటిపల్లె కోటకు ఒకపక్కన వీరుండేవారట. వ్యాపారం వీరి వృత్తి. వీరి ఆడపడుచుయే జక్కులమ్మ.
-రాజు అతికం