సంకల్పం తోడుంటే వైకల్యం అడ్డు కాదని నిరూపిస్తున్నాడు ఇందూరుకు చెందిన ఓ యువకుడు. అంధత్వాన్ని జయించి లఘుచిత్రాలు నిర్మిస్తున్నాడు. పేదరికం వెంటాడుతున్నా, తన ఆశయాన్ని నెరవేర్చుకునేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నాడు. షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ బాలీవుడ్ను లక్ష్యంగా పెట్టుకున్నాడు పాంచల్ విశాల్.
నిజామాబాద్కు చెందిన పాంచల్ విశాల్కు బాల్యం నుంచే స్పష్టమైన చూపు లేదు. అర మీటరు దూరంలోని వస్తువులు, మనుషులు తప్ప తన కంటికి ఏమీ కనపడదు. మూడో తరగతిలో ఉండగా, ఈ ఇబ్బందిని మొదటిసారిగా గుర్తించాడు. దీంతో బ్రెయిలీ లిపిలో విద్యాభాస్యం చేశాడు. హైదరాబాద్లో ఇంటర్ చదువుతూనే సంగీత తరగతులకు హాజరయ్యాడు. అనంతరం నాలుగేండ్ల రెగ్యులర్ కోర్సునూ పూర్తి చేశాడు. తర్వాత తనకు ఇష్టమైన లఘుచిత్రాల రూపకల్పనపై దృష్టి పెట్టాడు.
సవాళ్లను ఎదుర్కొంటూ..
శాస్త్రీయ సంగీతం, సినిమా..రెండూ విశాల్కు ప్రాణం. సినీరంగంలో మంచిపేరు తెచ్చుకోవాలన్నది ఆశయం. అయితే, దృష్టి లోపం ఆ యువకుడికి శాపంగా మారింది. తన ఆశయాన్ని నలుగురితో పంచుకుంటే, వెకిలి నవ్వులే ఎదురయ్యాయి. అయినా, కుంగిపోకుండా సవాళ్లను అధిగమిస్తూ ముందుకు సాగాడు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పింఛను డబ్బుతోనే లఘుచిత్రాల రూపకల్పనకు శ్రీకారం చుట్టాడు. తొలి ప్రయత్నంగా ‘ఆదర్శ దివ్యాంగులు’ పేరిట ఓ షార్ట్ ఫిల్మ్ చేశాడు. ఈ చిత్రంప్రముఖుల ప్రశంసలు అందుకున్నది. ఆ తర్వాత ‘స్నేహ సొసైటీ’ సిద్ధయ్య సహకారంతో రెండో లఘుచిత్రం ‘మరువలేని ప్రేమ’ను నిర్మించాడు. ఇందులో నిరుపేద యువకుడికి, సంపన్న యువతికి మధ్య ప్రేమను కండ్లకు కట్టాడు. నిజామాబాద్ జిల్లాలో దుబాయ్ కష్టాలపై ‘గల్ఫ్ గోస’ను తెరకెక్కించాడు. ఈ చిత్రం కూడా విజయం సాధించడంతో విశాల్ ప్రతిభ గురించి పది మందికీ తెలిసింది.
పెద్ద సినిమాల్లోనూ..
లఘుచిత్రాలతో ప్రతిభను చాటిన విశాల్ ‘ఒక్క క్షణం’, ‘రుబాబు’ తదితర టాలీవుడ్ చిత్రాలకు కో-డైరెక్టర్గా చేశాడు. ప్రస్తుతం ఓ ఇండిపెండెంట్ సినిమాపై దృష్టి పెట్టాడు. స్నేహితుల సహకారంతో ‘మౌనప్రేమ’ పేరుతో గంటన్నర నిడివితో ఓ సినిమాను పట్టాలెక్కించాడు. ఇందులో మూగ అమ్మాయిలోని స్వచ్ఛమైన ప్రేమను చూపించబోతున్నాడు. ఈ సినిమాకోసం రెండు పాటలను కంపోజ్ చేస్తున్నాడు. ఈ చిత్రాలకు పెట్టుబడి కోసం స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకున్నాడు. నిజామాబాద్ జడ్పీ కార్యాలయం పక్కనే ఓ పాన్ డబ్బాను ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరిపైనా ఆధార పడకుండా తన అభిరుచికి మెరుగులు దిద్దుకుంటున్నాడు.
ఎదురు ఉండొద్దు..
‘వయసు పెరిగే కొద్దీ నా అంధత్వం ఎక్కువవుతున్నది. 40 ఏండ్లు వచ్చేసరికి కంటిచూపు పూర్తిగా మందగించే ప్రమాదం ఉన్నట్టు నిపుణులు గుర్తించారు. అయినా, ధైర్యం కోల్పోకుండా నా కాళ్లపై నేను నిలబడే ప్రయత్నం చేస్తున్నా. నాకు ఎంతో ఇష్టమైన లఘుచిత్రాల రూపకల్పనలో రాణిస్తున్నా. పాన్ డబ్బా నడుపుకొంటూ కుటుంబాన్ని పోషిస్తున్నా. ఎన్నటికైనా భారీ బడ్జెట్ సినిమా తీయాలన్నది నా కల. చిత్రసీమలో రాణించి, దివ్యాంగులకు ఏ రంగంలోనూ ఎదురు లేదని నిరూపిస్తా’ అంటున్నాడు పాంచల్ విశాల్.