పాతతరం కార్లు.. ఎప్పుడూ సమ్థింగ్ స్పెషల్గానే ఉంటాయి. చూడగానే ‘వహ్వా!’ అనిపిస్తాయి. ప్రస్తుతం ఎక్కువగా మ్యూజియాలకే పరిమితమైనా, అక్కడక్కడా రోడ్లపైనా ‘రయ్’మంటూ దూసుకెళ్తున్నాయి. అలాంటి వండర్ వింటేజ్ కారు కథే ఇది.
1938లో తయారైన ‘హంబర్ సూపర్ స్నిప్ కార్’కు ఘనమైన చరిత్రే ఉంది. రెండో ప్రపంచయుద్ధంలోనూ పాలుపంచుకున్న ఈ రకం వాహనాలు ప్రస్తుతం చాలా తక్కువ సంఖ్యలోనే మిగిలి ఉన్నాయి. అలాంటి అద్భుతమైన కార్లలో ఒకటి.. సికింద్రాబాద్లోని మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్(ఎంసీఈఎంఈ)లో దర్శనమిస్తున్నది. అప్పటి తరాన్ని గుర్తుకు తెచ్చేలా.. రాజసం ఉట్టిపడేలా కనిపిస్తున్న ఈ కారు ఇప్పటికీ రోడ్లపైన దూసుకెళ్తున్నది. గత చరిత్రకు ఘనమైన గుర్తుగా మిగిలిన ఈ వాహనాన్ని మిలిటరీ ఉన్నతాధికారులు కంటికిరెప్పలా జాగ్రత్తగా కాపాడుతున్నారు.
ఎన్నో ప్రాంతాలు తిరిగి..
1938 అక్టోబర్లో ‘బ్రిటిష్ మిలిటరీ స్టాఫ్ కార్’ పేరిట ఈ ఫోర్ సీటర్ కారు తయారైంది. 1943లో యూరప్నుంచి తొలిసారిగా భారత్ గడ్డపై అడుగుపెట్టింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, జనరల్ కేఎం కరియప్పన్కు 1958 దాకా సేవలందించింది. ఆ తర్వాత బెంగళూరులోని 515 ఆర్మీబేస్ క్యాంపునకు చేరింది. అక్కడ 12 ఏండ్లపాటు ఎంతోమంది కమాండెంట్ల ప్రయాణాలకు సాయపడ్డది. 1977లో సికింద్రాబాద్లోని ఎంసీఈఎంఈకి చేరింది. అయితే, నిర్వహణ లేకపోవడంతో చాలా ఏండ్లపాటు కేవలం‘షోకేస్ పీస్’గానే ఉండిపోయింది. 1994లో ఎంసీఈఎంసీ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఈ కారుకు మరమ్మతులు చేపట్టారు. అప్పటినుంచి తిరిగి కండిషన్లోకి రావడంతో ప్రస్తుతం ఈ హంబర్ సూపర్ స్నిప్ను కమాండెంట్ వాడుతున్నారు.
-ఎన్.సత్యనారాయణ