కరోనా, ఈ వైరస్ దెబ్బకు అనివార్యమైన లాక్డౌన్.. రెండూ కలసి ఎన్నో నిరుపేద
కుటుంబాలను ఛిన్నాభిన్నం చేశాయి. అర్ధాకలితో అలమటించేవారు కొందరైతే, ఒక్కపూట అన్నం కోసం ఎదురు చూసేవారు ఇంకెందరో!ఆ అన్నార్థుల ఆకలి తీర్చేందుకు ఓ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది‘పిక్స్ ఫర్ కాజ్.కామ్’.
లండన్ ఒలింపిక్స్ కాంస్య విజేత, షూటర్ గగన్ నారంగ్ తండ్రి ఇటీవల కరోనా బారిన పడ్డారు. ఆయన హార్ట్ పేషెంట్. దీంతో కొన్ని వారాలపాటు జాగ్రత్తగా చికిత్స అందించి ఒడ్డుకు చేర్చారు వైద్యులు. ఆ సమయంలో కరోనాతో బాధ పడుతున్న ఎన్నో కుటుంబాల స్థితిగతులను దగ్గరనుంచీ చూశారు గగన్. తన వంతుగా వీలైనంత ఎక్కువమందికి సాయం చేయాలనుకున్నారు. వెంటనే తన రైఫిల్ గన్ను పక్కన పెట్టి, కెమెరా చేతబట్టారు (ఫొటోగ్రఫీకూడా గగన్కు ఇష్టమైన వ్యాపకమే). అద్భుతమైన చిత్రాలను తన కెమెరాలో బంధించి, వాటిని ‘పిక్స్ ఫర్ కాజ్’ అనే డిజిటల్ ప్లాట్ఫామ్కు ఇచ్చారు. వారు ఆ చిత్రాలను విక్రయించి, వచ్చిన డబ్బుతో కరోనా బాధిత
కుటుంబాలకు ఆహారం,నిత్యావసరాలు అందించారు.అంతటితో ఆగకుండా, కెమెరా భుజాన వేసుకొని అలుపెరుగని బాటసారిలా ఓ మంచి ఉద్దేశం కోసం అద్భుతమైన ఫొటోలు
తీస్తూనే ఉన్నారు గగన్.
‘పిక్స్ ఫర్ కాజ్’ గురించి..
సాయం కోసం ఎదురు చూసేవారికి ఆసరాగా నిలుస్తున్న ఓ డిజిటల్ ప్లాట్ఫామ్ ‘పిక్స్ ఫర్ కాజ్’. ఇది ఉత్తమ చిత్రాలనుసేకరిస్తున్న డిజిటల్ గ్యాలరీ. పేరున్నఫొటోగ్రాఫర్లు తాము తీసిన ఫొటోలను ఈ వెబ్సైట్కు విరాళంగా ఇస్తుంటారు. ఆఫొటోలను ఆన్లైన్లో విక్రయిస్తూ, వచ్చిన డబ్బుతో నిరుపేదలకు సాయం చేస్తారు ‘పిక్స్ ఫర్ కాజ్’ ప్రతినిధులు. కరోనా సమయంలో హైదరాబాద్, బెంగళూరు, కొయంబత్తూరు నగరాల్లో రోజూ కొన్ని వేలమందికి ఉచితంగా ఆహారం, నిత్యావసరాలు అందించారు. ఉపాధి కోల్పోయిన చిరుద్యోగులకు ఆర్థిక సాయం చేస్తుంటారు. బెంగళూరులో జాన్ పవన్, ఆది నాగరాజు; హైదరాబాద్లోజితేందర్ వంటి ప్రతినిధులు అలుపెరగకుండా సేవ చేస్తున్నారు. ‘పిక్స్ ఫర్ కాజ్’తో ఎంతోమంది చేతులు కలుపుతున్నారు. కొందరు స్నేహితుల
ద్వారాకూడా విరాళాలు సేకరిస్తున్నారు. ఈ వెబ్సైట్కు నేరుగా విరాళం అందించొచ్చు లేదా అందమైన ఫొటోలను కొనుగోలు చేసి పరోక్షంగా సాయపడొచ్చు. Pix4cause.com వెబ్సైట్ను సందర్శిస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయి.