నిజాముల కాలం నుంచీ అంతే. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాదీ వంటకాలకున్న క్రేజే వేరు. ధమ్ బిర్యానీ, హలీమ్, ష్వార్మా, లుక్మీ వంటి వంటలు ఎనలేని ఖ్యాతిని గడించాయి. హైదరాబాద్ అంటే చాలు వెంటనే గుర్తొచ్చేది..హైదరాబాదీ బిర్యానీ. నిజానికి కబాబ్లకికూడా హైదరాబాద్ పెట్టింది పేరు. విదేశాల్లోనూ హైదరాబాద్ స్పెషల్ కబాబ్స్ నోరూరిస్తున్నాయి. ఆ కబాబ్ల కథేమిటో చూద్దామా!
కబాబ్లు పోషకాల్లోనూ తక్కువేం కాదు. తయారు చేసే ముందు ముక్కలకు మసాలా, ఉప్పు, కారం, మిరియాల పొడి, నూనె వంటి పదార్థాలు పట్టించి నిప్పులపై కాలుస్తారు. దీనివల్ల మటన్, చికెన్లలోని కొవ్వు ఆవిరైపోతుంది. కూరగాయలు పాక్షికంగా ఉడికిపోతాయి. దీంతో వాటిలోని పోషకాలు ఆవిరికాకుండా శరీరానికి అందుతాయి.
పక్కా హైదరాబాదీ వంటకాల్లో బిర్యానీ తర్వాతి స్థానం కబాబ్స్దే. సిటీలో విందులంటే, అథమ పక్షం ఇరవై వెరైటీలు వరుసకట్టాల్సిందే. అందులోనూ కణకణమండే నిప్పులపై కాలుతూ కబాబ్స్ కనువిందు చేయాల్సిందే. వాటిని బిర్యానీతో ఆరగించాల్సిందే.
పోషకాల అవసరం పెరిగింది. ఆరోగ్య చైతన్యం అధికమైంది. దీంతో
ఒకప్పటి వంటకాలన్నీ కొత్తకొత్త
అవతారాలు ఎత్తుతున్నాయి. పాత రుచులే ప్రత్యేకంగా మారాయి. ఫైవ్స్టార్ హోటళ్ళు సైతం చద్దన్నం, తర్వాణి వంటి అమ్మమ్మల వంటకాలను వండి వారుస్తున్నాయి. ఆదిమ మానవుడు తాను వేటాడిన జంతువుల మాంసాన్ని నిప్పులపై కాల్చుకుని తినేవాడు. అదే అలవాటు కబాబ్లుగా రూపాంతరం చెందిందంటారు ఆహార చరిత్రకారులు.
తెలంగాణ పల్లెల్లో ఇప్పటికీ కబాబ్ సంప్రదాయ వంటకంగా చలామణిలో ఉన్నది. కొన్ని ప్రాంతాల్లో పోశమ్మ, మైసమ్మ వంటి గ్రామదేవతల పూజల్లో భాగంగా లివర్ (కాలేయం)ను నిప్పులపై కాల్చుకుని తినే ఆచారం ఉంది. గ్రామాల్లో నాటుకోళ్ళను నిప్పులపై కాల్చాకే వండుతారు. చర్మంలోని కొవ్వులు కరగడమే కాకుండా, కొన్నిరకాల బ్యాక్టీరియాలు, వైరస్లు నశిస్తాయి. అంటే, ఇలా కాల్చడంలోనూ ఆరోగ్య రహస్యం దాగుందన్నమాట.
మాంసాహార ప్రియులు చికెన్, మటన్, కీమా, చేపల కబాబ్లను ఇష్టపడతారు. అయితే, శాకా
హారులుసైతం వీటి రుచిని ఆస్వాదించేలా మష్రూమ్, పనీర్, బేబీకార్న్ కబాబ్లు ఉండనే ఉన్నాయి. ఉల్లిపాయ, క్యాప్సికమ్, టమాటాలు జత చేరి కమ్మని రుచితోపాటు ఆరోగ్యాన్నీ అందిస్తాయి.చికెన్, మటన్లలో ప్రొటీన్లు పుష్కలం. ఇవి శరీర దృఢత్వానికి ఉపయోగ పడతాయి. శరీర సౌష్ఠవం పెంచుకోవాలని ప్రయత్నించేవారు రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మాంసాహారం వల్ల శరీరానికి కావలసిన మాంసకృతులు, కొవ్వులు లభిస్తాయి. చేపల్లోని ఫ్యాటీ ఆమ్లాలు గుండె, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. మటన్లో విటమిన్- బి12 ప్రమాణాలు ఎక్కువ. ఇవి ఎర్ర రక్తకణాల తయారీకి దోహద పడటమే కాదు, దెబ్బతిన్న కణాలను సైతం బాగు చేస్తాయి.
పాక్షికంగా ఉడికిన కూరగాయలను తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. కూరగాయల్లోని పోషకాలు మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి. వీటిలోని మైక్రో న్యూట్రియంట్లు, విటమిన్లు, ఖనిజాలు శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తాయి. మెగ్నీషియం, ఐరన్, కాపర్, ఫాస్పరస్ వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి.