బాబా జీవన దర్శనం
పరమాత్ముడి అవతారంగా పూజలు అందుకొనే సిద్ధపురుషులలో షిరిడి సాయిబాబా ఒకరు. పిల్లలకు ‘సాయి’ అని పేరు పెట్టుకోవడం సర్వసాధారణం. దాదాపు వందేండ్ల కిందట షిరిడిలో నడయాడిన మానవతామూర్తి ‘సాయి’. ఆ మనీషిని దేవుడిని చేసి, ఆలయాలు నిర్మించి, పూజించడానికి దారి తీసిన క్రమాన్ని వివరిస్తుంది ‘మానవోత్తముడు షిరిడి సాయిబాబా’ పుస్తకం. సాటి మనుషుల క్షేమం మాత్రమే కాదు, సర్వప్రాణుల శ్రేయస్సునూ కోరే సూఫీ తత్వచింతన నేపథ్యంలోంచి సాయిబాబా జీవితాన్ని విశ్లేషించారురచయిత గుడిపాటి. మొత్తం పద్దెనిమిది అధ్యాయాల్లో సాయిబాబాను దర్శింపజేశారు. ఇది ఒకరకంగా సాయిబాబా జీవిత చరిత్ర. మరోరకంగా సాయిని కొత్తకోణంలో విశ్లేషించే ప్రయత్నం. సాయి జీవితాన్ని, బోధనల్నీ ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలో ఈ పుస్తకం తెలియజేస్తుంది.
బాబా నేపథ్యంలో వచ్చిన పుస్తకాలు, కవిత్వం, సినిమాలు, టీవీ సీరియల్స్ గురించి ఇందులో ప్రస్తావించారు. ఇవన్నీ సాయిబాబా మీద భక్తిభావాన్ని పెంచడానికి దోహదం చేసిన తీరును వివరించారు. అయితే, గుడిపాటి ఇతర పుస్తకాల్లో కమ్యూనిస్టు భావజాలం కనిపిస్తుంది. తాజాగా ఆయన సాయిబాబా జీవితాన్ని రచనా వస్తువుగా ఎంచుకోవడం, అందులో బాబాను ‘సామ్యవాద తాత్వికుడు’ అని విశ్లేషించడం కొంత ఆసక్తికరమే. ఏదేమైనా సాయిబాబా నిరాడంబర జీవనశైలి, ఆయన బోధనలు ఏ విధంగా ఇతరులకు ఆదర్శమో చెప్పడం బాగుంది. సాయి కోట్లాది మందికి ఆరాధనీయుడు అయ్యారన్నది నిజం. సాయితత్వ చింతన గురించి విశ్లేషించిన మంచి పుస్తకం ఇది. సాయిగురించి వినూత్న కోణంలో చూపించిన తీరు ఆసక్తికరం.
మానవోత్తముడు షిరిడి సాయిబాబా
రచయిత: గుడిపాటి
పేజీలు: 104, వెల: రూ.100
ప్రతులకు: పాలపిట్ట బుక్స్, 98487 87284
రోల్మోడల్ బాపూజీ
విద్య ఉంది. వినయం లేదు. వనరులు ఉన్నాయి. క్రమశిక్షణ లేదు, బాధ్యత లేదు. ధనం ఉంది, దాతృత్వం లేదు. సంఘం ఉంది. సరైన మార్గదర్శనం లేదు. ఆలోచనలు ఉన్నాయి, ఆచరించే నిజాయతీ లేదు. తోటి మనుషులపై సానుభూతి లేదు, సహానుభూతి అసలే లేదు. ఇవన్నీ ఇప్పటి మన సమాజ స్థితిగతులు. వీటి గురించి ఏనాడో చెప్పినవారు, ఆచరించి చూపినవారు గాంధీజీ. స్వాతంత్య్రం కన్నా సామాజిక బాధ్యత, క్రమశిక్షణ తనకు ముఖ్యమన్నారు మన జాతిపిత. ఇవ్వాళ మన మేధావులు చెప్పే మినిమిలిజం (నిరాడంబర జీవితం) గురించి ఏనాడో చెప్పారాయన. ‘అన్నీ నాకే కాదు, అందరికీ అన్నీ’ అన్న సామ్యవాద సిద్ధాంత ప్రాణధాతువుకు తన పద్దతిలో ప్రచారాన్ని చేశారు బాపూజీ. ఈ కోణంలో చూస్తే ఈ తరానికి ఆయన రోల్ మోడల్.
భావితరాలకూ స్ఫూర్తిప్రదాత! ఈ అంశాన్ని ‘నవతరానికి రోల్ మోడల్ గాంధీజీ’ అన్న తన పుస్తకంలో సోదాహరణంగా వివరించారు డా॥ కాళ్ళకూరి శైలజ. పిల్లల పెంపకం, ఆర్థిక క్రమశిక్షణ, మహిళా సాధికారత, కళలు వంటి అన్ని విషయాలనూ కూలంకషంగా పరిశోధించి కొత్త సిద్ధాంతాలను రూపొందించారు. ఖైదులో కూడా క్రమశిక్షణ పాటించబట్టే స్వయంగా ఉర్దూ నేర్చుకుని, ఖురాన్ చదివారు బాపూజీ. అలాగే, అన్ని మతగ్రంథాలనూ చదివి వాటి సారాంశం ఒకటే అన్న నిర్ణయానికి వచ్చారు. బాల్యంలో భయస్తుడిగా, బలహీనుడిగా ఉన్న ఓ పిల్లవాడు తదనంతర కాలంలో రవి అస్తమించని ఓ సామ్రాజ్యంతో తలపడి స్వాతంత్య్రం తెచ్చాడంటే- అతను తనను తాను తీర్చిదిద్దుకుంటూ, సమాజాన్ని చదువుతూ ఎలా ముందుకు వెళ్లాడన్నదే చరిత్ర. ఈ పుస్తకంలో ప్రతి పేజీ అమూల్యమే. తప్పక చదవాల్సిన పుస్తకం ఇది. మహాత్ముడి అడుగుజాడల్లో సమాజంలోని అనేక సమస్య లకు పరిష్కారం ఉంది.
నవతరానికి రోల్మోడల్ గాంధీజీ
రచన: డా. కాళ్ళకూరి శైలజ
పేజీలు: 136, వెల: రూ. 125
ప్రతులకు: జి. మాల్యాద్రి, నెల్లూరు, ఫోన్: 9440503061
నవోదయ బుక్హౌస్, కాచిగూడ చౌరస్తా, హైదరాబాద్,
ఫోన్: 040-24652387
-చంద్ర్ర పతాప్
ఇవీ కూడా చదవండి…
27 మంది హైకోర్టు లాయర్లకు పదోన్నతులు
పాలకూర ప్యాకెట్లో పాముపిల్ల.. వీడియో
వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం పెంచాలి: ప్రధాని మోదీ