మనిషి బతుకే గందరగోళంలో పడింది. మాయరోగం అతలాకుతలం చేస్తున్నది. ఇక, పక్షి కెవ్వరు దిక్కు? జంతువుకెక్కడిది భరోసా? అసలే ఇది ఎండకాలం. హైదరాబాద్ నగరంలో రోడ్లపై బతికే మూగజీవాల పరిస్థితి ఏమిటి? ‘నేనున్నానంటూ’ మూగజీవాల దాహార్తిని తీరుస్తున్నదో స్వచ్ఛంద సంస్థ.
లక్ష్మణ్ విద్యావంతుడు. సామాజిక స్పృహ కలిగిన యువకుడు. ముఖ్యంగా జంతు సంక్షేమం, హక్కులు, పర్యావరణ పరిరక్షణకోసం కృషి చేస్తున్నాడు. ‘సెంటర్ ఫర్ సోషల్ ఇనీషియేటివ్ అండ్ మేనేజ్మెంట్’ (సీఎస్ఐఎం) నుంచి ‘సోషల్ ఆంత్రప్రెన్యూర్షిప్ అండ్ ఎన్జీవో మేనేజ్మెంట్’లో సర్టిఫికెట్ పొందాడు. సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పదేండ్లు పనిచేసినా, ఆ కొలువు సంతృప్తినివ్వలేదు. దీంతో సమాజసేవలో ఆనందాన్ని పొందాడు. ప్రజలకు జంతు పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నాడు. వాటికి ఆహారం అందిస్తున్నాడు. ఆరోగ్యం క్షీణించిన జంతువులకు, పక్షులకు మందులు ఇస్తున్నాడు. వీటి గురించి వీడియోలు చేసి, సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూ మూగజీవాల పాలిట బంధువుగా నిలుస్తున్నాడు. వాటి దాహార్తిని తీరుస్తూ, పరిరక్షణ కోసం Animals Water Bowl Project (AWBP) Trustను స్థాపించాడు.
కదిలించిన సంఘటన
లక్ష్మణ్ చెన్నైలోని ఓ ఐటీ కంపెనీలో పనిచేసేరోజుల్లో ఒక సంఘటన జరిగింది. పనిమీద బెంగళూరు వెళ్లినప్పుడు ఒక వీధి శునకం తన పిల్లలతో కలిసి మురుగుకాల్వలోని నీళ్లు తాగుతూ కనిపించింది. కొద్దిసేపటికే అది కుప్పకూలి పోయింది. ఆ నీళ్లు అంత విషపూరితం. ఇది చూసి చలించిపోయాడు లక్ష్మణ్. ఆ సంఘటన తన మనసులో బలంగా నాటుకుపోయింది. అప్పుడే, ఒక ఆలోచన వచ్చింది. ‘మూగజీవాలకు స్వచ్ఛమైన ఆహారం, నీరు అందిస్తే, అవికూడా ఆరోగ్యంగా ఉంటాయి కదా?’ అనుకున్నాడు. వారాంతాల్లో హైదరాబాద్ వచ్చినప్పుడు మూగజీవాల పరిరక్షకులను, పశువైద్యులను కలిసేవాడు. పక్షులు, జంతువుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేవాడు. ఈ కార్యక్రమాలన్నీ ఒక ఛత్రం కిందికి తీసుకొచ్చే ఉద్దేశ్యంతో, ‘యానిమల్స్ వాటర్ బౌల్’ ప్రాజెక్ట్ను ప్రారంభించాడు.
క్షేత్రస్థాయిలో అధ్యయనం
లక్ష్మణ్ మూగజీవాల జీవన స్థితిగతులపై లోతైన అధ్యయనం చేశాడు. హైదరాబాద్లోని వీధి శునకాలు, పక్షులు ఆకలికి అలమటిస్తూ చనిపోతున్నాయని గ్రహించాడు. మనుషుల మాదిరిగానే జంతువులకు, పక్షులకు నీరు ప్రాథమిక అవసరమని తెలుసుకున్నాడు. తాగునీరు అందుబాటులో లేని కారణంగా వేలాది ప్రాణులు ‘డీహైడ్రేషన్’కు గురై మృత్యువాత పడుతున్నాయి. గతిలేని పరిస్థితుల్లో మురికినీళ్లు తాగడం వల్ల రకరకాల చర్మవ్యాధులు, ఇన్ఫెక్షన్లు సోకుతున్నాయి. ‘మనుషుల ఆరోగ్యమే గందరగోళంలో ఉన్న సందర్భంలో వీటి పరిస్థితి ఏంటి?’ అన్న కోణంలో నిపుణులతో చర్చించారు. ఆరోగ్యకరమైన పరిసరాలు సృష్టించి, యానిమల్ వాటర్ బౌల్స్ అందజేస్తే వాటిని రక్షించుకోవచ్చని అనుకున్నాడు. ఒక బృందాన్ని ఏర్పాటు చేసి నగరవ్యాప్తంగా నీటితొట్లు ఏర్పాటు చేశాడు. వలంటీర్లు ఈ తొట్లలో రోజూ నీళ్లు పోస్తారు. వారానికోసారి శుభ్రం చేస్తారు. ఆ తొట్లు పశుపక్ష్యాదులకు ఎలా ఉపయోగపడుతున్నాయో ఎప్పటికప్పుడు వీడియోలు తీసి పంపుతున్నారు.
విస్తరిస్తున్న వాటర్ బౌల్స్
లక్ష్మణ్ ప్రధాన ఉద్దేశ్యం మూగజీవాలను కాపాడటం. ‘మంచి సమాజాన్ని నిర్మించాలనుకున్నప్పుడు జంతు సంక్షేమం, హక్కుల పరిరక్షణతోనే అది ప్రారంభం కావాలి’ అనేది ఆయన సిద్ధాంతం. హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో ఈ కార్యక్రమాలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. తెలంగాణలోనేకాక విశాఖ, ముంబై, పుణె, బెంగళూరు, చెన్నై వంటినగరాల్లోనూ యానిమల్స్ వాటర్ బౌల్ ప్రాజెక్ట్ను మొదలుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. వీధుల్లోనే కాకుండా పబ్లిక్ పార్క్లు, పాఠశాలలు, కళాశాలలు, కార్పొరేట్ సంస్థల సముదాయాల్లో వాటర్ బౌల్స్ ఏర్పాటు చేసి, వలంటీర్లను అప్రమత్తం చేస్తున్నాడు. జంతు పరిరక్షణలో భారతదేశాన్ని ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో లక్ష్మణ్ అండ్ టీమ్ కృషి చేస్తున్నది. ఈ కార్యక్రమంలో వలంటీర్లుగా చేరాలనుకునేవాళ్లు, తమవంతు సాయం అందించాలని అనుకొనేవారు www. awbptrust.org ద్వారా సంస్థ ప్రతినిధులను సంప్రదించవచ్చు.