ఒకరి వయసు 73. ఇంకొకరి వయసు 71. ఒకరికి గుండెపోటు. డాక్టర్లు కనీసం మెట్లుకూడా ఎక్కొద్దన్నారు. ఇంకొకరికి కాలు విరిగింది. వీల్ చైరే ప్రపంచం.అడుగు తీసి అడుగు వేయలేరు. అయినా, వాళ్లిద్దరూ కలిసి కశ్మీర్నుంచి కన్యాకుమారి వరకు దేశమంతా తిరిగారు. అదీ, 1974 మోడల్ బుల్లెట్మీద.
గుజరాత్లోని వడోదరకు చెందిన 73 ఏండ్ల మోహన్లాల్ చౌహాన్, అతడి సహచరి 71 ఏండ్ల లీలాబెన్.. ఇద్దరిదీ ఇంట్లోనుంచి బయటికి వెళ్లలేని పరిస్థితి. అయితేనేం, సాహసయాత్రకు బయల్దేరారు. ఇప్పటికి 30 వేల కి.మీ. మేర దేశాన్ని చుట్టేశారు. మోహన్లాల్కు అడ్వెంచర్స్ అంటే ఇష్టం. ఇంత వయసొ చ్చినా ఆ అలవాటు మానలేదు. ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తపా’ అంటూ లీలా తోడైంది.
కొత్త జీవన శైలి
మోహన్లాల్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) మాజీ ఉద్యోగి. 2011లో తీవ్రస్థాయిలో గుండెపోటు వచ్చింది. కనీసం మెట్లుకూడా ఎక్కొద్దన్నారు వైద్యులు. యువకుడిగా ఎన్నో సాహస కృత్యాలు చేసిన మోహన్లాల్కు ఎటూ కదలకుండా ఉండటం నరకంలా అనిపించింది. తన అలవాట్లను సైతం మార్చుకొని సరికొత్త జీవనశైలిని అలవర్చుకున్నాడు. దాని ప్రకారమే తన జీవితం సాగాలనుకున్నాడు.
కదల్లేని స్థితిలో..
చిన్నప్పుడు తండ్రి స్కూటర్ ఎక్కి తిరిగిన జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. ‘చిన్న పిల్లాడిని కాబట్టి, ఎటూ వెళ్లలేక ఇంట్లోనే ఉండేవాడిని. ఇప్పుడు మళ్లీ అలాగే అయ్యింది పరిస్థితి. చిన్నప్పటిలా స్కూటర్పై తిరుగుతూ ప్రకృతిని ఆస్వాదించాలి’ అనే కోరిక కలిగింది. 2015లో సాహసించి ఒక చిన్న సోలో ట్రిప్కు వెళ్లాడు. ‘ఒక్కడివే వెళ్లే బదులు నన్నూ తీసుకెళ్లొచ్చు కదా?’ అని లీలాబెన్ కోరింది. 2010లో లీలాబెన్ ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడింది. దెబ్బ బలంగా తగలడంతో కాలు విరిగింది. అతికించడానికి ఎంత ప్రయత్నించినా ఫలించలేదు. ఇలాంటి వ్యక్తిని ఎలా తీసుకెళ్తారు? అసలే సాహసయాత్ర. కానీ ఆమె పట్టుబట్టడంతో, ‘ఓకే’ చెప్పాడు మోహన్లాల్. ఓ శుభ ముహూర్తాన బండి కదిలింది.
రామేశ్వరంలో ఆగింది
2016లో ఈ జంట మొదటి యాత్రకు బయల్దేరింది. వడోదరనుంచి ప్రారంభమై మహారాష్ట్ర, కేరళ, గోవా, కర్ణాటక, తమిళనాడు మీదుగా దేశ సరిహద్దులు దాటి శ్రీలంకను సందర్శించే ప్రయత్నం చేశారు. అక్కడి పరిస్థితుల కారణంగా రామేశ్వరం నుంచి వెనుదిరిగారు. 2018 ఫిబ్రవరిలో రెండో ట్రిప్కు వెళ్లారు. ఈసారి గమ్యం థాయిలాండ్. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అస్సాం దాటుకొని మేఘాలయ చేరుకున్నారు. థాయ్లాండ్కు అతిచేరువలో ఉండగానే కొండచరియలు విరిగిపోయాయి. దీంతో రాకపోకలకు త్రీవ ఆటంకం ఏర్పడింది.
చీలమండ విరిగినా..
మూడో పర్యటనలో ఉండగా, మధ్యప్రదేశ్లో లీలాబెన్ కిందపడి పోయింది. చీలమండ విరిగిపోయింది. ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ‘మా పర్యటనలో ఎన్ని అవరోధాలు ఎదురైనా తిరిగి ఇంటికి వెళ్దామని లీలా అనలేదు. లీలా నా బుల్లెట్కు రెండో బ్యాటరీ. ఏదేమైనా ఈ వయసులో మేం కలిసి దేశమంతా తిరగడం మామూలు విషయం కాదు’ అంటున్నాడు మోహన్లాల్. ‘మా ట్రిప్స్కు సంబంధించి ఫైనాన్షియల్ ప్లానింగ్ నేనే చేస్తాను. రోజుకు రూ.3,000-4,000 బడ్జెట్ అవుతుంది. ఆహారం, బస, పెట్రోల్, ఇతర ఖర్చులు చూసుకుంటాం. ప్రతీ ట్రిప్కు ఎంత లేదన్నా రూ.2 లక్షలకు పైనే ఖర్చు చేశాం’ అని చెప్తున్నది లీలాబెన్. వీరు దాదాపు అన్ని రాష్ర్టాలను కవర్ చేశారు.
శ్రీశైలం యాత్ర
2020లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ యాత్ర చేపట్టారు. నల్లమల అటవీమార్గం గుండా ప్రయాణించి శ్రీశైలం సందర్శించారు. అయిదో పర్యటనకు కూడా ప్రణాళిక వేసుకున్నా కరోనా మళ్లీ విజృంభించడం వల్ల ప్రస్తుతానికి సాహసయాత్రను నిలిపేశారు. ఈ మొత్తం అడ్వెంచర్ టూర్లో వాళ్లు ప్రతీది పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. ముఖ్యంగా ఆహారం. అన్ని రకాల రుచులూ ఆస్వాదిస్తారు. పనీర్ పరాటా, టమాట సూప్, వెజిటబుల్ పులావ్, మసాలా బాత్, పెరుగు, పాలు రెగ్యులర్ డైట్లో తీసుకుంటారు. ‘మోహన్తో జర్నీ చేయడంలోని ఆనందం మరేదాంట్లో నాకు దొరకదు’ అంటున్నది లీలా.