రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): దశాబ్దాల దోపిడీ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగించిన కే చంద్రశేఖర్రావు నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీయే రాష్ర్టానికి శ్రీరామరక్ష అని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. నాడు పదవులను తృణప్రాయంగా త్యాగంచేసి ఒకేఒక్కడుగా కేసీఆర్ తెలంగాణ ప్రజల కోసం జెండా చేతపట్టారని చెప్పారు. ఆ సమయంలో ఆయన వద్ద మజిల్ పవర్ లేదు, మనీ పవర్ లేదు, మీడియా పవర్ లేదని.. సంకల్ప బలంతోనే నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారని పేర్కొన్నారు. అలాంటి కేసీఆర్పై ఉమ్మడి రాష్ర్టంలో ఆంధ్రపాలకులకు జీహుజూర్ అంటూ మోకరిల్లిన కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శలు చేస్తే ఊరుకొనేది లేదని హెచ్చరించారు. తిరగబడాల్సి వస్తే ప్రధాని, కేంద్రమంత్రులనూ వదిలేదిలేదని మండిపడ్డారు. శుక్రవారం సిరిసిల్లలోని పద్మనాయక కల్యాణ మండపంలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాడు అన్ని పార్టీల నాయకులు, బడా సేట్లు అందరూ తెలంగాణను వద్దన్నవారేనని విమర్శించారు. 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ను స్థాపించిన కేసీఆర్.. రాష్ర్టాన్ని సాధించేదాక ఎత్తిన జెండాను దింపితే రాళ్లతో కొట్టి చంపండి అంటూ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. అనేక ప్రతికూల పరిస్థితుల మధ్య, ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ తెలంగాణ కలను సాకారం చేశారని చెప్పారు.
పదవులు శాశ్వతం కాదని.. కన్నతల్లి లాంటి టీఆర్ఎస్ను కంటికి రెప్పలా కాపాడుకోవడమే ముఖ్యమని కేటీఆర్ ఉద్బోధించారు. తెలంగాణలోని కోటి కుటుంబాలు మనవేనని.. లక్ష్యానికి మించి పార్టీ సభ్యత్వాలను నమోదు చేయించాలని సూచించారు. సంక్షేమ పథకాలు లబ్ధిపొందుతున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకొనేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను కడుపులో పెట్టుకుని కాపాడుకోవాలని నాయకులకు సూచించారు. సోషల్మీడియా లో ప్రచారం అవుతున్న అవాస్తవాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తలకు త్వరలో గుర్తింపుకార్డులు ఇస్తామని.. బీమా సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. వేములవాడ, సిరిసిల్లను రెండుకండ్లలా అభివృద్ధి చేస్తానన్నారు. మార్చిలో పార్టీ పునర్నినిర్మాణం జరుగుతుందని, ప్రతిఒక్కరూ కష్టపడి సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని.. జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానం లో నిలుపాలని పిలుపునిచ్చారు. 300 మంది యువకులు పార్టీలో చేరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, టీఆర్ఎస్ జిల్లా ఇంచార్జి కర్ర శ్రీహరి, రాష్ట్ర ప్రధానకార్యదర్శి బండి రమేశ్, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, సిరిసిల్ల జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ తదితరులు పాల్గొన్నారు.