దౌల్తాబాద్, జూలై 12:ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 50లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారు. భారతదేశం చూసినట్లయితే ప్రతీసంవత్సరం 2లక్షల మంది పాముకాటుకు గురయితే అందులో 50వేల మంది చికిత్స అందకపోవడంతో మృతిచెందుతున్నారని అంచనా. ప్రపంచ వ్యాప్తంగా మూడువేల రకాలైన పాములున్న ప్పటికీ వాటిలో సుమారు 350రకాలు మాత్రమే విష పూరితమైనవి. వీటిలో కట్లపాము, తాచుపాము, నాగత్రాచు, సముద్ర సర్పం, రక్తపెంజర అతిప్రమాదకరమైనవి. వీటిలో కట్లపాము, నాగుపాము, తాచుపాము కాటేస్తే వీటి విషం నేరుగా కేంద్ర నాడీ మండలం, ఊపరితిత్తులపై పని చేస్తోంది. హృదయ స్పందన ఆగి వెనువెంటనే మరణం సంభవిస్తుంది. రక్తపింజర విషం ఎక్కువగా రక్త నాళాలపై ప్రభావం చూపుతుంది. రక్తనాళాలు చిట్లి నోటి నుంచి రక్తం వస్తుంది. రక్త నాళాల్లో రక్తప్రసరణ ఆగిపోతుంది. రక్తం గడ్డ కట్టడం వలన కాటుకు గురైన వ్యక్తి మరణిస్తాడు.
నాటువైద్యంతో ముప్పే..
పాముకాటు వేసిన వెంటనే దవాఖానకు తీసుకెళ్లాలి కానీ చాలా మంది ముఢనమ్మ కాలతో మంత్రగాళ్లను ఆశ్రయిస్తారు. పాముల్లో చాలా వాటికి విషం ఉండదు ఇవి కాటువేసిన వెంటనే పెద్దగా ప్రమాదం ఉండదు. అలాగే దుస్తులపై నుంచి పాముకాటు వేసినప్పుడుకూడా ప్రభావం తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు మంత్రగాళ్ల వద్దకు తీసుకెళ్లే కొందరు బతుకుతారు. వారే బతికించారని భ్రమపడుతారు. విష సర్పాలు కాటేసిన ప్పుడు. వైద్యుడిని సంప్రదించాలి త్వరగా దవాఖానకు తీసుకెళ్లితే ప్రాణాలతో బయటపడొచ్చు.
పాములన్ని ప్రమాదం కాదు..
పాములు వంద రకాలు ఉన్న అందులో కొన్ని రకాల పాములకే మాత్రమే విషం ఉంటాయి. ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాల్లో మూడు రకాల సర్పాలు ప్రమాదకరం నాగుపాము, పెంజర, కాట్లపాము, గ్రామాల్లో సాధారణంగా కనపడే వానకోయిల, నాగులవాసం, నీరుకట్టె, జెరిపోతు, పాములు విష పాములు కావు విషం లేని పాములు పరోక్షంగా మనుషులకు సహకరిస్తాయి. భయంకర నాగుపాము పంట పొలాల్లో ఎలుకలను తింటాయి. దీంతో ఎలుకల సంతతి తగ్గుతుంది. అలాగే విషం ఉన్న పాముల గుడ్లను విషంలేని పాములు తింటాయి. 50 శాతం కాట్లు ప్రమాదం కాదు. సాధారణంగా చికిత్స తీసుకుంటే నాయమవుతుంది. పాము కాటు కన్నా చాలా మంది భయంతోనే ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఇరుగు.. పొరుగు వారు ధైర్యం చెప్పడానికి బదులు ఏడుపులు ప్రారంభిస్తే పాముకాటు బాధితులు మరింత ఆందోళనకు గురవుతారు.
త్వరగా వైద్యం అందించాలి..
పాముకాటుకు గురైనప్పుడు తక్షణమే స్పందించి వైద్యం అందేలా చూడాలి. వారిని నడిపించకూడదు. దౌల్తాబాద్, సిద్దిపేట, గజ్వేల్ దవాఖానల్లో యాంటి స్నేక్ వీనం ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా భయాందోళనకు గురికావొద్దు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవాలి.