హైదరాబాద్ : ప్రయాణీకులు, విమానాశ్రయ సిబ్బంది భద్రత కోసం విమానాశ్రయంలో కోవిడ్ నిబంధనలు పాటించడం చాలా ముఖ్యంగా మారింది. విమానాశ్రయంలోని వివిధ ప్రదేశాలలో ఎంట్రీ, చెకిన్, సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ల వద్ద క్యూ నిర్వహణ, ప్రయాణీకుల నిరీక్షణ సమయాన్ని తగ్గించడం, రద్దీని నివారించడం, భద్రత కీలకంగా మారాయి. ప్రయాణీకుల సౌలభ్యం కోసం అనేక సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించుకుంటున్న జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తాజాగా సెక్యూరిటీ కెమెరాలు, కృత్రిమ మేధ వీడియో అనలిటిక్స్ కలిపిన క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్స్ను అమలులోకి తెచ్చింది. ఇది విమానాశ్రయంలోని వివిధ ప్రదేశాలలో ప్రయాణీకులు నిరీక్షించే సమయాన్ని తగ్గిస్తుంది. తద్వారా ప్రయాణీకుల అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. దీనిని GHIAL ఈ టెక్నాలజీలో భాగస్వామి అయిన ఆల్గోవిజన్ టెక్నాలజీస్తో కలిసి అమలు చేస్తోంది.
కెమెరా ఆధారిత వీడియో అనలిటిక్స్ను ఉపయోగించే ఈ స్మార్ట్ క్యూ మేనేజ్మెంట్ సొల్యూషన్ ప్రయాణికులు వేచి ఉండే సమయాన్ని పర్యవేక్షిస్తూ రద్దీని తగ్గించడంలో సహాయపడుతుంది. దీని వల్ల విమానాశ్రయంలో ప్రయాణీకులు ఎంత సేపు నిరీక్షించాలి, వారి సర్వీస్ టైమ్ ఎంత పడుతుంది వంటి వివిధ కీలక అంశాలు ప్రయాణికులకు ముందుగానే తెలుస్తాయి. తద్వారా వారు రద్దీగా లేని మార్గాలను ఎంపిక చేసుకోవచ్చు. ఈ అధునాతన వీడియో అనలిటిక్స్ – వివిధ కెమెరాల నుండి అందే వీడియోలను విశ్లేషించి, ప్రయాణీకుల సంఖ్యను ఖచ్చితంగా అంచనా వేయడానికి డీప్ లెర్నింగ్ బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడళ్లను ఉపయోగిస్తుంది. దీని ద్వారా క్యూ మేనేజ్మెంట్తో పాటు, కెమెరా ట్యాంపరింగ్, పార్కింగ్ ఉల్లంఘన, తప్పుడు మార్గంలో వచ్చే వాటిని గుర్తించడం లాంటి వాటిని కూడా పసికట్టవచ్చు.
GHIAL సీఈవో ప్రదీప్ మాట్లాడుతూ.. ప్రస్తుత కొవిడ్ సమయంలో ప్రయాణీకుల భద్రత ముఖ్యమన్నారు. ప్రయాణీకులు సురక్షితంగా ఉండడం కోసం GHIAL అనేక భద్రతా చర్యలను తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ స్మార్ట్ క్యూ మేనేజ్మెంట్ టెక్నాలజీ వల్ల ప్రయాణికుల భద్రత మరింత పెరుగుతుందన్నారు. ఆల్గోవిజన్ సీఈఓ కె. శ్రీనివాసన్ మాట్లాడుతూ.. హైదరాబాద్ విమానాశ్రయంలో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని విజయవంతంగా అమలు చేయడానికి సహకరించిన జీఎంఆర్ గ్రూపు నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. కృత్రిమ మేధ/మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ విమానాశ్రయంలోని వివిధ ప్రదేశాలలో ప్రయాణికుల రాకపోకలను నియంత్రించడానికి మా క్యూ మేనేజ్మెంట్ సొల్యూషన్ సహాయపడుతుందన్నారు.