వరంగల్ : రాష్ట్రంలో పల్లె ప్రగతి కార్యక్రమం సంపూర్ణంగా విజయవంతం కావడానికి అధికారులు అంతా అంకితభావంతో కృషి చేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మంగళవారం వరంగల్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ పథకాల అమలుపై అధికారులకు దిశ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..పల్లె ప్రగతి కార్యక్రమం రాష్ట్రంలో ప్రారంభమై సుమారు ఏడాదిన్నర కావస్తున్నాదన్నారు. ఈ పథకం అమలుకు అధికారులు, ప్రజాప్రతినిధులు చేసిన కృషితో గ్రామాలు ప్రగతి బాటన పయనిస్తున్నాయని తెలిపారు.
అదే స్ఫూర్తితో కష్టపడి చక్కని ఫలితాలను సాధించాలని మంత్రి కోరారు. గ్రామాలలో ప్రధానంగా కనిపించే పచ్చదనం, పరిశుభ్రతలపై ప్రధానంగా దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నందున పెద్ద ఎత్తున మొక్కలను నాటాలని ఆయన కోరారు. జిల్లాలలో గతంలో నాటిన మొక్కలలో దాదాపు 85% శాతం మొక్కలు బతికాయని ఆయన అన్నారు. అన్ని గ్రామాల్లో నర్సరీలు ఉన్నాయని, గ్రామాలలో నాటడానికి నర్సరీలలో అన్ని రకాల మొక్కలు ఉండేటట్లు చూడాలని మంత్రి కోరారు. ఎప్పటికప్పుడు చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలను నాటాలన్నారు.
ప్రస్తుత వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా గ్రామాలలో పారిశుధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాలో వైకుంఠదామాల నిర్మాణం పూర్తి కాలేదని, అసంపూర్తిగా ఉన్న వైకుంఠధామాల నిర్మాణాన్ని 15 రోజుల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని మంత్రి తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మాణంలో ఉన్న వైకుంఠధామాలను పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఆయన కోరారు.
రాష్ట్రంలోని గ్రామాలలో వాడకంలో లేని బావులను, బోరు బావులను వెంటనే పూడ్చి వేయాలనాన్నారు. గ్రామ పంచాయతీల కరెంటు బిల్లులు ఇతర బిల్లుల పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు నిర్ధిష్ట గడువులోగ చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులు తప్పనిసరిగా నెలలో కొన్ని రోజులు గ్రామాల్లో నిద్ర చేయాలని, మరునాడు ఉదయం గ్రామంలో పర్యటించి పరిశుభ్రత, గ్రీనరీ ఇతర అంశాలను పరిశీలించి అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు.
గ్రామ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవోలపై ఫిర్యాదులు ఉంటే 15 రోజులలో నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. సస్పెండ్ అయిన సర్పంచులు పంచాయతీ రాజ్ ట్రిబ్యునల్ బదులు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటున్నారని మంత్రి అన్నారు. ఈ విషయాన్ని కులంకుషంగా పరిశీలించి తగిన చర్యలను తీసుకోవాలని ఉన్నతా ధికారులను మంత్రి ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్ రావు, మున్సిపల్, పంచాయతీరాజ్, అటవీ శాఖ సీనియర్ అధికారులు, అన్ని జిల్లాల నుంచి జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
భూమికి బరువయ్యేంత పంట పండిస్తాం : మంత్రి హరీశ్ రావు
దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్ల పంపిణీ
ఎంపీ వెంకటేష్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ కవిత
ఐసోలేషన్ సెంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్
200 కోట్ల డాలర్లు విరాళం ఇచ్చిన జెఫ్ బెజోస్ మాజీ భార్య