సిటీబ్యూరో, మే 22 (నమస్తే తెలంగాణ): అవును.. పేదల కోసమే ప్రత్యేకంగా కొవిడ్ ఆక్సీకేంద్రం ఏర్పాటైంది. సైబరాబాద్ పోలీసు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యురిటీ కౌన్సిల్ దీనికి అంకురార్పణ చేసింది. అక్సిజన్ లేక ఇబ్బంది పడే వారికి ప్రాణవాయువును అందించేందుకు మెడికవర్ దవాఖాన సౌజన్యంతో గచ్చిబౌలిలో ఆక్సికేర్ను శనివారం ప్రారంభించారు. కొవిడ్ బారిన పడి ప్రాణవాయువు కోసం ఇబ్బంది పడే పేద వారి కోసం ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో 50 పడకల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆక్సీకేర్లో చేరాలనుకునే వారు 080-45811138 నంబర్కు ఫోన్ చేయాల్సి ఉంటుంది. కొవిడ్ వచ్చిన వారు పూర్తిగా కోలుకునే వరకు ఈ పడకలను ఉపయోగించుకోవచ్చని ఆక్సీకేంద్రం ప్రతినిధులు తెలిపారు.