తెలుగు యూనివర్సిటీ, మే 22: పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందని జీవ వైవిధ్య మండలి రాష్ట్ర కార్యదర్శి కాళీచరణ్ అన్నారు. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవంను పురస్కరించుకొని తెలంగాణ జీవ వైవిధ్య మండలి, సాగర్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ సంయుక్తంగా ఆన్లైన్లో పెయింటింగ్, ఫొటోగ్రఫీ, వ్యాసరచన, నృత్యం, కార్టూన్ డిజైన్, క్విజ్, ఫ్యాన్సీడ్రెస్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల విజేతలతో కూడిన పోస్టర్ను సైఫాబాద్లోని అరణ్యభవన్లో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాళీచరణ్ మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా ఈ వేడుకలను ఆన్లైన్ వేదికగా నిర్వహించామన్నారు. జీవ వైవిధ్యంపై 9 అంశాల్లో పోటీలు నిర్వహించగా 5600మంది పాల్గొన్నట్లు తెలిపారు. జూనియర్, సీనియర్ విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాగర్సాఫ్ట్వేర్ సొల్యూషన్ సీఈఓ జోగి రితేశ్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.