సింగపూర్లో కొత్త రకం కరోనా అంటూ కేజ్రీవాల్ చేసిన ట్వీట్పై వివాదం రేగింది. కేంద్ర ప్రభుత్వం, కేజ్రీవాల్ సర్కారు మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. కేజ్రీవాల్ వ్యాఖ్యలను అటు సింగపూర్ ప్రభుత్వంతోపాటు ఇటు కేంద్రప్రభుత్వం ఖండించింది. ఢిల్లీ సీఎం వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని విదేశాంగశాఖ మండిపడింది. అయితే కేంద్రం ప్రతిష్ఠకోసం ఆరాటపడుతున్నదని, తమ భయమంతా పిల్లల గురించేనని ఢిల్లీ సర్కారు ప్రతిస్పందించింది.
సింగపూర్లో కొత్త రకం కరోనా వెలుగుచూసిందని, ఇది పిల్లలకు ప్రమాదకరమని తెలుస్తున్నదని కేజ్రీవాల్ అన్నారు. ఇది భారత్లో థర్డ్వేవ్కు కారణమయ్యే ప్రమాదం ఉన్నదని పేర్కొన్నారు. సింగపూర్ నుంచి వచ్చే విమానాలను నిలిపివేయాలని కేంద్రానికి సూచించారు.
‘సింగపూర్లో కొత్త కొవిడ్ స్ట్రెయిన్ ఉందన్న వార్తలు అవాస్తవం. పరీక్షల్లో అది భారత్ వేరియంటేనని తేలింది’ అని సింగపూర్ పేర్కొన్నది. కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలని ఆ దేశ ప్రజలు సామాజిక మాధ్యమాల్లో డిమాండ్ చేస్తున్నారు.
‘కేజ్రీవాల్ వ్యాఖ్యలను సింగపూర్ ప్రభుత్వం ఖండించింది. మన రాయబారికి సమన్లు జారీచేసి అభ్యంతరం వ్యక్తం చేసింది. కొవిడ్ వైరస్ రకాలు, పౌర విమానయాన విధానంపై మాట్లాడేంత అవగాహన కేజ్రీవాల్కు లేదని మన రాయబారి వివరణ ఇచ్చారు’ అని భారత విదేశాంగశాఖ తెలిపింది. ‘కొవిడ్పై పోరాటంలో భారత్, సింగపూర్ బలమైన భాగస్వాములు. లాజిస్టిక్ హబ్, ఆక్సిజన్ సరఫరాదారుగా ఆ దేశ పాత్రను అభినందించండి. మనకు సాయం అందించడానికి సింగపూర్ సైనిక విమానాలను రంగంలోకి దించడం ఇరు దేశాల మధ్య సంబంధాలను తెలియజేస్తున్నది. అయితే కొందరు చేసిన బాధ్యతారహిత వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీస్తాయి. కేజ్రీవాల్ భారతప్రభుత్వం తరఫున మాట్లాడే ప్రతినిధి కారని స్పష్టంచేస్తున్నా’ అని విదేశాంగ మంత్రి జైశంకర్ ట్వీట్చేశారు.
‘దేశంలోని చిన్నారుల భద్రత దృష్ట్యానే కేజ్రీవాల్.. సింగపూర్ స్ట్రెయిన్ గురించి మాట్లాడారు. బీజేపీ దీనిపై దిగజారుడు రాజకీయాలు చేస్తున్నది. బీజేపీ, కేంద్రం స్పందన చూస్తుంటే.. అంతర్జాతీయంగా తమ ప్రతిష్ఠ గురించే వారి భయమంతా అని తెలుస్తున్నది. కానీ మా భయమంతా పిల్లల గురించే’ అని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా స్పష్టంచేశారు. మరోవైపు థర్డ్వేవ్ నుంచి పిల్లలను రక్షించేందుకు స్పెషల్ టాస్క్ఫోర్స్ ఏర్పాటుచేసినట్టు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. బెడ్లు, ఆక్సిజన్, ఔషధాలకు కొరత రాకుండా చర్యలు చేపడుతున్నామన్నారు.