న్యూఢిల్లీ, మే 19: బహుళప్రాచుర్యం పొందిన క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్ గత 24 గంటల్లో 35 శాతం పతనమై 30,000 డాలర్ల దిగువకు పడిపోయింది. ఇది 14 నెలల కనిష్టస్థాయి. బుధవారం ఇంట్రాడేలో 29,563 డాలర్ల కనిష్టస్థాయిని (రూ.21.5 లక్షలు) నమోదుచేసిన బిట్కాయిన్, అటుతర్వాత షార్ట్ కవరింగ్ కారణంగా కొంతవరకూ కోలుకుంది. ఈ ట్రెండ్లో భాగంగా మరో క్రిప్టోకరెన్సీ ఈథరిమ్ కూడా గత 24 గంటల్లో 40 శాతం (1818 డాలర్లు, రూ.1.32 లక్షలకు) క్రాష్ అయ్యింది. తక్కువ విలువగల బిట్కాయిన్లలో డొజేకాయిన్ 0.21 డాలర్ల వద్దకు (రూ.15 స్థాయికి) పతనమయ్యింది. క్రిప్టోకరెన్సీ లావాదేవీలకు సంబంధించిన సర్వీసుల్ని బ్యాంకులు, పేమెంట్ కంపెనీలు అందించడాన్ని మంగళవారం చైనా నిషేధించడంతో తాజా పతనం సంభవించింది. గత ఏడాదికాలంగా గొప్పర్యాలీ జరిపి 65,000 డాలర్లస్థాయిని చేరిన బిట్కాయిన్, అదేతరహాలో పడిపోవడం గమనార్హం.
బిట్కాయిన్కు వాస్తవ విలువ ఏదీ లేదని, ఇది కరెన్సీయే కాదని, చెల్లింపులకు మారకం కానేకానేకాదంటూ అమెరికా ఆర్థిక వేత్త నౌరియల్ రౌబిని తీవ్రంగా విమర్శించారు. కనీసం ఇది ఎటువంటి ఆస్తి కూడా కాదని, ఇందులో పెట్టుబడిచేసి జూదం ఆడుతున్న సంస్థాగత ఇన్వెస్టర్లను తక్షణం ఉద్యోగాల నుంచి తొలగించాలని న్యూయార్క్ యూనివర్సిటీ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్ అయిన రౌబిని మండిపడ్డారు.
వారం రోజుల్లో బిట్కాయిన్ మార్కెట్ కేపిటలైజేషన్ 300 బిలియన్ డాలర్లకు పడిపోయిందని, ఇది ప్రస్తుత రిజర్వుబ్యాంక్ విదేశీ కరెన్సీ ఆస్తుల్లో సగమని కేపిటల్ మైండ్ వ్యవస్థాపకుడు దీపక్ షెనాయ్ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు.
తాజా పతనంతో క్రిప్టోకరెన్సీ ఇన్వెస్టర్ల సంపద ఏకంగా 600 బిలియన్ డాలర్లమేర తరిగిపోయింది. సంస్థాగత ఇన్వెస్టర్లు ఆసక్తి కనపర్చడంతో ఏప్రిల్ నెలలో మొత్తం క్రిప్టోకరెన్సీల విలువ తొలిసారిగా 2 ట్రిలియన్ డాలర్లను మించింది. కేవలం రెండు నెలల్లో వాటి విలువ రెట్టింపయ్యింది.
ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్లే బిట్కాయిన్ జోరుగా పెరగడానికి ఒక కారణంకాగా, ఆయన ట్వీట్లతోనే క్షీణత మొదలైంది. కొద్దినెలల క్రితం క్రిప్టోకరెన్సీకి అనుకూలంగా దాదాపు రోజూ ట్వీట్లు చేసిన మస్క్ ఒక దశలో టెస్లా కార్లను బిట్కాయిన్ను చెల్లించి కొనవచ్చని, టెస్లా వద్ద రెండు బిలియన్ డాలర్ల విలువైన బిట్కాయిన్ హోల్డింగ్స్ వున్నాయంటూ వెల్లడించడంతో అది అడ్డూఆపూ లేకుండా పెరిగింది. గతవారం మస్క్ మాటమారుస్తూ టెస్లా కంపెనీ కార్ల కొనుగోలుకు బిట్కాయిన్లను తీసుకోబోదని చేసిన ట్వీట్తోపాటు ఆయన ఇతర ట్వీట్లు కూడా మార్కెట్లో ఆయోమయాన్ని కల్గించాయి. క్రిప్టోకరెన్సీ మైనింగ్ కోసం అపారమైన విద్యుత్ అవసరమవుతుందని, అది పర్యావరణానికి హానికరమంటూ స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు కూడా అయిన మస్క్ ట్వీట్ చేశారు. ఇతర క్రిప్టోలకంటే బిట్కాయిన్ మరింత విద్యుత్ను తీసుకుంటుందని, ఈ కారణంగా బిట్కాయిన్ల చెల్లింపును టెస్లా స్వీకరించదంటూ మస్క్ పేర్కొన్నారు. టెస్లా బిట్కాయిన్ హోల్డింగ్స్ను అమ్మలేదంటూ తక్షణమే మస్క్ ప్రకటించడంతో కొద్దిగంటలపాటు బిట్కాయిన్ కోలుకున్నప్పటికీ, అటుతర్వాత మళ్లీ క్షీణబాట పట్టింది.