కరీంనగర్ : అసైన్డ్ భూములను కబ్జా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ అరెస్టుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి కరీంనగర్లో మీడియాతో మాట్లాడారు. సీలింగ్ నిబంధనలు ఉల్లంఘించి భూములు కొన్న ఈటలను అరెస్టు చేయాలని, ఆయన కుటుంబం పేర ఉన్న 140 ఎకరాల్లో 90 ఎకరాలను వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కౌశిక్ రెడ్డి సూచించారు. సీలింగ్ చట్టం ప్రకారం ఒక కుటుంబానికి 50 ఎకరాల భూమి కంటే ఎక్కువ ఉండొద్దన్న నిబంధన ఈటలకు తెలియదా? అని ప్రశ్నించారు.
హైదరాబాద్లోని అప్పా జంక్షన్ నుంచి చేవెళ్ల, గండిపేట వరకు అనేక చోట్ల ఈటల పెద్ద మొత్తంలో భూములు కొన్నారని, వాటన్నింటిని త్వరలోనే బయటపెడుతామని చెప్పారు. ఈటల అక్రమ ఆస్తులు, అవినీతి సొమ్ము వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.