ఆయన వయసు 65 ఏండ్లు.. ఆమె వయసు 58 ఏండ్లు.. ఆ దంపతుల ఇద్దరు పిల్లలు విదేశాల్లో సెటిల్డ్. ఇంకేముంది అంతా హ్యాపీ. ఇక ఖాళీ సమయం దొరికినప్పుడల్లా.. ఆ దంపతులు ఫోటోషూట్లతో అదరగొడుతూ.. నవ దంపతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అదరగొట్టే ఫోటోలతో యువతీయువకుల మనసు దోచేసుకుంటున్నారు ఆ దంపతులు.
కేరళలోని కోజికోడ్కు చెందిన హరిదాసన్(65), కృష్ణవేణి(58) దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. ఆ అమ్మాయిలిద్దరికి వివాహాలు కాగా, దుబాయిలో సెటిలయ్యారు. హరిదాసన్ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందారు. కృష్ణవేణి మాత్రం గృహిణి.
అయితే ఈ దంపతులిద్దరే కోజికోడ్లో ఉంటున్నారు. కరోనా కారణంగా ఇంటికే పరిమితం అయ్యారు. ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టడంతో.. ఫోటో షూట్కు వెళ్దామని భర్త హరిదాసన్ను కృష్ణవేణి కోరింది. తమ బంధువైన ఫోటోగ్రాఫర్ రాకేశ్ను పిలిపించుకుని చెట్టికులం బజార్ బీచ్లో వాలిపోయారు.
ఇక ఆ ఫోటోషూట్లో ఈ దంపతులు నవ దంపతుల్లా మారిపోయారు. నూతన వధూవరుల ప్రీవెడ్డింగ్ షూట్కు ఏ మాత్రం తీసిపోకుండా తమ ఫోటోషూట్ను అదరగొట్టారు. హరిదాసన్ తెలుపు రంగు దుస్తుల్లో, కృష్ణవేణి గోధుమ రంగు దుస్తుల్లో మెరిసిపోయారు. ఒకరికొకరు ముద్దులు పెట్టుకుంటూ రొమాన్స్లో మునిగిపోయారు. కల్లు తాగుతూ ఎంజాయ్ చేశారు. కృష్ణవేణి బీచ్లో కూర్చొని ఉండగా, ఆయన ముంతతో కల్లు పోస్తున్న పిక్ అద్భుతం. ఇక ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.