ముంబై: పిల్లి తోక కత్తిరించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహారాష్ట్రలోని ముంబైలో ఈ ఘటన జరిగింది. ముంబైలోని మలాడ్ వెస్ట్ ప్రాంతంలో నివాసం ఉండే ఒక వ్యక్తి ఇంటికి ప్రతి రోజు ఒక పిల్లి వచ్చేది. ఆయన దానికి ఆహారం పెట్టేవారు. అయితే ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు ఆ పిల్లి తోకను కత్తిరించారు. గాయంతో అతడి ఇంటికి వచ్చిన ఆ పిల్లిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అనంతరం మలాడ్ వెస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు జంతువులపై క్రూరత్వం నిరోధక చట్టం కింద గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.