నవీపేట,ఏప్రిల్ 30: కరోనా కష్ట కాలంలో సైతం కూలీలకు చేతినిండా పనికల్పించేందుకే ఈజీఎస్ పనులను యథావిధిగా కొనసాగిస్తున్నట్లు డ్వామా ఏపీడీ సంజీవ్రావు తెలిపారు. మండలంలోని కమలాపూర్, అనంతగిరి గ్రామాల్లో కొనసాగుతున్న ఉపాధిహామీ పనులను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కూలీలతో మాట్లాడుతూ కొవిడ్ నిబంధనలను అనుసరిస్తూ పనులు చేయాలని సూచించారు.అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆయా గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్ విధించుకుంటే పేద కూలీలకు జీవనోపాధి కష్టంగా మారుతుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే కూలీలకు చేతి నిండా పని కల్పించేందుకు ప్రభుత్వం ఈజీఎస్ పనులను నిరంతరాయంగా కొనసాగిస్తున్నదని గుర్తు చేశారు. ప్రతి గ్రామంలో కొవిడ్ నిబంధనలు పాటించి పనులు చేసే విధంగా ఆయా గ్రామాలకు చెందిన గ్రామ కార్యదర్శులు, టీఏలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లాలోని బోధన్ తదితర ప్రాంతాల్లో కొవిడ్తో మృతి చెందిన ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ల ఆత్మకు శాంతి చేకూరాలని సమావేశంలో రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సయ్యద్ సాజీద్ అలీ, ఎంపీవో రాజ్కాంత్, ఏపీవో రాజేశ్వర్, ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్లు ఆయా గ్రామాలకు చెందిన కార్యదర్శులు పాల్గొన్నారు.