అహ్మదాబాద్ : గుజరాత్ లోని జామ్ నగర్ లో రిలయన్స్ ఫౌండేషన్ వేయి ఆక్సిజన్ పడకలతో కూడిన కొవిడ్ కేర్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ప్రజలకు పూర్తి ఉచితంగా సేవలందించే ఈ దవాఖాన ఏర్పాటుకు అయ్యే వ్యయంతో పాటు నిర్వహణ వ్యయాన్ని తమ సంస్ధ భరిస్తుందని రిలయన్స్ ఫౌండేషన్ ఓ ప్రకటనలో పేర్కొంది. జామ్ నగర్ లోని ప్రభుత్వ డెంటల్ కాలేజ్ బోధనాసుపత్రిలో 400 కొవిడ్ కేర్ సెంటర్ వచ్చే వారంలో అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది.
మరో రెండు వారాల్లో అదే ప్రాంతంలోని మరో చోట 600 పడకల ఆస్పత్రి సేవలందిస్తుందని తెలిపింది. ఈ కేంద్రాల్లో వైద్య సిబ్బంది, పరికరాలు, ఇతర ఖర్చులు అన్నింటిని రిలయన్స్ భరిస్తుందని పేర్కొంది. జామ్ నగర్, ఖంబలియా, ద్వారక, పోర్ బందర్ సహా సౌరాష్ట్రలోని ఇతర ప్రాంతాల ప్రజలకు ఈ దవాఖానలు ఊరట కల్పిస్తాయని వెల్లడించింది. మరోవైపు రిలయన్స్ ఫౌండేషన్ కొవిడ్ కేర్ సెంటర్ల లో డాక్టర్లు, వైద్య సిబ్బంది నియామకంలో గుజరాత్ ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపింది.