న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: కరోనా అల్లకల్లోలంతో దేశంలో సంక్షోభ పరిస్థితులు నెలకొన్న సమయంలో తాము మూగ ప్రేక్షక పాత్ర పోషించలేమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కరోనాకు సంబంధించి పలు హైకోర్టుల్లో ఇప్పటికే జరుగుతున్న విచారణను ఆపే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేసింది. హైకోర్టులు పరిశీలించలేని కొన్ని సమస్యలపై సహాయం చేసే పాత్రను తాము పోషిస్తామని వెల్లడించింది. ఈ విషయంలో తమ జోక్యాన్ని సహేతుక కోణంలో అర్థం చేసుకోవాలన్నది. ఈ మేరకు జస్టిస్లు డీవై చంద్రచూడ్, ఎల్ నాగేశ్వరరావు, ఎస్ రవీంద్ర భట్తో కూడిన ధర్మాసనం మంగళవారం వెల్లడించింది.
ధరలపై వ్యత్యాసమెందుకు?
మే 1 నుంచి 18 ఏండ్లుపైబడిన వారందరికీ టీకాలను వేయనున్నట్టు కేంద్రప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయంపై కూడా కోర్టు స్పందించింది. రాష్ర్టాలకు వ్యాక్సిన్ సరఫరా, ఆక్సిజన్ పంపిణీ, పర్యవేక్షణ వ్యవస్థకు సంబంధించిన సమగ్ర వివరాలు తెలుపాలని కేంద్రాన్ని ఆదేశించింది. అలాగే, ఉత్పత్తి సంస్థలు టీకా డోసులకు వేర్వేరు ధరలను నిర్ణయించడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. టీకా ధరల్లో అసమానతల అంశంలో ఏమిచేస్తున్నారని కేంద్రాన్ని నిలదీసింది. ఔషధ నియంత్రణ చట్టాన్ని అనుసరించి ధరలను ఎందుకు నియంత్రించలేదని ప్రశ్నించింది. జాతీయ సంక్షోభం తలెత్తిన ఇలాంటి పరిస్థితుల్లో కాకుండా ఇంకెప్పుడు అధికారాలను ఉపయోగిస్తారని మండిపడింది. టీకా ధరల విధానంపై వివరాలు సమర్పించాలని కేంద్రానికి నోటీసులు జారీచేసింది.
అప్పీళ్ల దాఖలు గడువును పొడిగించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి ఆందోళనకర పరిస్థితులు సృష్టించిదని సుప్రీంకోర్టు పేర్కొంటూ కక్షిదారులకు అప్పీళ్ల దాఖలు గడువును పొడిగించింది. గత నెల 14వ తేదీతో ముగిసిన గడువును తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పొడిగిస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.