రూ.40 లక్షలు సొంతానికి
అధికారి తనిఖీలో ఆలస్యంగా వెలుగులోకి
వారం క్రితమే గుట్టుచప్పుడు కాకుండా చెల్లింపులు
విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం: ఈవో
వేములవాడ, ఏప్రిల్ 27: రాజన్న ఆలయ లడ్డూప్రసాదాల విక్రయశాలలో మరోసారి నగదు దుర్వినియోగమైనట్లు తెలిసింది. గతంలో కంటే ఈసారి మాత్రం దాదాపు 2 లక్షల లడ్డూ ప్రసాదం విక్రయించి రూ.40 లక్షల నగదు సొంతానికి వాడుకున్న వ్యవహారం ఓ అధికారి తనిఖీలో ఆలస్యంగా వెలుగుచూసినట్లు తెలుస్తున్నది.
రూ.40 లక్షల దుర్వినియోగం !
ప్రసాదాల తయారీ విభాగం నుంచి రోజూవారీ లెక్కలతో విక్రయశాలకు తరలిస్తుంటారు. విక్రయశాలలో భక్తులకు టికెట్ల ద్వారా లడ్డూ ప్రసాదం విక్రయిస్తూ ఏరోజుకారోజు లెక్కలు చూపుతూ నగదును స్వామివారి ఖజానాలో చెల్లిస్తారు. ఇక ఈ విభాగంలో రెండు విడుతల్లో ఉద్యోగులు విధులు నిర్వహిస్తుంటారు. అయితే ఇటీవల ప్రసాదం తయారీ విభాగం పర్యవేక్షకుడిగా బాధ్యతలు చేపట్టిన ఓ అధికారి సదరు విక్రయశాల సిబ్బందిపై అనుమానం వచ్చి రికార్డులు తనిఖీ చేయగా 2 లక్షల లడ్డూ ప్రసాదం విక్రయాల్లో తేడాను గుర్తించారు. రూ.40 లక్షలు గత కొన్ని రోజులుగా తన సొంతానికి వాడుకున్నట్లుగా లెక్కల్లో తేడాను గుర్తించారు. అయితే ప్రసాదం నిల్వలు ఉన్నట్లుగా చూపుతూ ఈ నగదు దుర్వినియోగానికి పాల్పడినట్లు తెలుస్తున్నది. సదరు విభాగం ఉద్యోగులు రోజువారీగా రూ.5 నుంచి రూ.8 లక్షల చొప్పున మొత్తం రూ.40 లక్షలను వారం క్రితమే స్వామివారి నగదు విభాగానికి చెల్లించినట్లు ఆలస్యంగా తెలిసింది.
పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం
ప్రసాదాల విక్రయాల్లో నగదు దుర్వినియోగంపై పూర్తిస్థాయి విచారణ జరుపుతాం. విచారణ జరిపిన అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. పొరపాట్లు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నిబంధనలపై కూడా అధికారులు చర్చించి పకడ్బందీగా విక్రయాలు జరిగేలా చూస్తాం.
-కృష్ణప్రసాద్, రాజన్న ఆలయ ఈవో వేములవాడ