న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: మనుషుల ప్రాణాల కంటే ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువేమీ కాదని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. ఢిల్లీలోని పలు దవాఖానల్లో ఆక్సిజన్ కొరత తీవ్రమవడంతో ధర్మాసనం ఈ విధంగా స్పందించింది. పారిశ్రామిక అవసరాలకు ఆక్సిజన్ వినియోగాన్ని నిలిపివేసేలా కేంద్రప్రభుత్వం కంపెనీలను వెంటనే ఆదేశించాలని సూచించింది. గురువారం నుంచి కంపెనీల ఆక్సిజన్ వినియోగంపై నిషేధం విధిస్తున్నట్టు విచారణ సందర్భంగా కేంద్రప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. ఢిల్లీలోని పలు దవాఖానల్లో మరో 4-8 గంటల్లోగా ఆక్సిజన్ నిల్వలు అయిపోయే పరిస్థితులు ఉన్న పరిస్థితుల్లో.. గురువారం వరకూ ఎందుకు ఆగాలని నిలదీసింది. ఆక్సిజన్ వినియోగాన్ని నిషేధిస్తూ వెంటనే కంపెనీలను ఆదేశించాలని, ఆ ఆక్సిజన్ను దవాఖానలకు తరలించాలని పేర్కొంది. ఆలస్యం జరిగితే, కోట్లాది మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదమున్నదన్నదని, మీరు దానినే కోరుకుంటున్నారా? అని ఘాటు వ్యాఖ్యలు చేసింది. గత సెషన్లో తామిచ్చిన ఆదేశాల ప్రకారం ఆక్సిజన్ను ఎందుకు సరఫరా చేయలేదని ఐనాక్స్ కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేసింది. స్టీల్, పెట్రోలియం వంటి కంపెనీలు తమ ఉత్పత్తులను తగ్గించేలా ఆదేశాలివ్వాలని కేంద్రానికి సూచించింది. తద్వారా ఆక్సిజన్ వినియోగాన్ని తగ్గించాలన్నది. ఆక్సిజన్ను సొంతంగా ఉత్పత్తి చేసుకునే వ్యవస్థ కలిగిన కొవిడ్ పడకలను దవాఖానల్లో పెంచాలని అభిప్రాయపడింది.
సరిపడా ఆక్సిజన్ సరఫరాతోనే సమస్య: ఐనాక్స్
దేశంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో డిమాండ్కు సరిపడా ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయని దేశంలోనే అతిపెద్ద ఆక్సిజన్ ఉత్పత్తి సంస్థ ఐనాక్స్ ఎయిర్ ప్రొడక్ట్స్ వెల్లడించింది. తూర్పు భారత్లోని ఒడిశా, జార్ఖండ్లలో అధికంగా ఆక్సిజన్ సరఫరా ఉన్నదని, అయితే మధ్యభారతంలోని మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్లలో అధికంగా డిమాండ్ ఉన్నదన్నారు. ఇదే ప్రధాన సమస్యగా మారిందని చెప్పారు. త్వరలో పరిస్థితి సద్దుమణుగుతుంద’ని ఐనాక్స్ డైరెక్టర్ సిద్ధార్థ్ జైన్ తెలిపారు. మరోవైపు, పలు రాష్ర్టాల్లోని దవాఖానల్లో 162 పీఎస్ఏ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లకు కేంద్రం అనుమతినిచ్చింది.