మొయినాబాద్, ఏప్రిల్ 20 : కరోనాను అరికట్టడానికి పంచాయతీ పాలకవర్గాలు ఏకగ్రీవ తీర్మానాలు చేసి లాక్డౌన్ విధించుకుంటున్నారు. గ్రామాల్లో పాజిటివ్ కేసులు తగ్గడం లేదని పంచాయతీలు భావించాయి. దీంతో లాక్డౌన్ విధించాలని నాలుగు రోజులు కింద అజీజ్నగర్ పంచాయతీ పాలకరవ్గం ఏకగ్రీవ తీర్మానం చేసి సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ విధించారు. అదే బాటలో సురంగల్, హిమాయత్నగర్ గ్రామాలు ఉన్నాయి.
సురంగల్లో వినూత్న పద్ధతిలో లాక్డౌన్..
సురంగల్లో ఇప్పటి వరకు కరోనాతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పంచాయతీ పాలకవర్గం అప్రమత్తమై గ్రామంలో శానిటైజేషన్ చేయించింది. వైరస్ను నియంత్రించడానికి మంగళవారం పంచాయతీ పాలకవర్గం సర్పంచ్ లావణ్య అధ్యక్షతన లాక్డౌన్పై ఏకగ్రీవ తీర్మానం చేశారు. గ్రామంలో దుకాణాలు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలని నిర్ణయించారు. దుకాణాల వద్ద ప్రజలు భౌతిక దూరం పాటించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. మాస్కులు లేని వారికి సరుకులు ఇవ్వమనే నోటీసు ఏర్పాటు చేయాలి. మాస్కు లేకుంటే పంచాయతీ జరిమానా విధిస్తుందని నిర్ణయించారు. రెవెన్యూ పరిధిలో ఫామ్ హౌస్ల్లోని స్విమ్మింగ్ ఫూల్స్లో నీటిని తీసివేయాలని నిర్ణయించారు. పంచాయతీ తీర్మానాలు బుధవారం ఉదయం నుంచి అమలులోకి వస్తాయని సర్పంచ్ తెలిపారు. సమావేశంలో ఉపసర్పంచ్ యాదమ్మ, కార్యదర్శి ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు.
ప్రజలు సహకారం అందించాలి: లావణ్యఅంజిరెడ్డి, సర్పంచ్, సురంగల్, మొయినాబాద్
అందరం ఆరోగ్యంగా ఉండడానికి పంచాయతీ తీర్మానానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. స్వచ్ఛంద లాక్డౌన్ ప్రజలు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని విధించాం. ప్రభుత్వం రాత్రి సమయంలో కర్ఫ్యూ విధించినప్పటికీ స్థానిక సంస్థల బాధ్యతగా లాక్డౌన్ విధించాం. ప్రభుత్వం విధించిన కర్ఫ్యూని పకడ్బందీగా అమలు చేస్తాం.