సికింద్రాబాద్, ఏప్రిల్ 18: ప్రభుత్వం అందిస్తున్న ఉచిత తాగునీటి సరఫరాను పొందడం కోసం వినియోగదారులు ఎంతో ఉత్సాహం చూపిస్తున్నప్పటకీ నిబంధనలు పాటించడంలో మాత్రం తాత్సారం చేస్తున్నారు. జలమండలి ఇచ్చిన గడువును వినియోగదారులు వినియోగించుకోవడంలో ఉత్సాహం చూపిస్తున్నట్లు కనిపించడం లేదని అధికారులు అంటున్నారు. గత డిసెంబర్ నుంచి ప్రతినెల 20వేల లీటర్ల ఉచిత తాగునీటిని అందిస్తున్నారు. అంతకంటే ఎక్కువ వాడితే అధికంగా వినియోగించిన నీటికి బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం జలమండలి కొన్ని నిబంధనలు పెట్టింది. ప్రతి నీటి కనెక్షన్కు ఉన్న క్యాన్నంబర్కు ఆధార్ నంబర్ను అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ఉచిత నీటి సరఫరా ప్రారంభించగా జలమండలి అధికారులు మార్చినెల చివరి వరకు గడువుఇచ్చారు.
ఈ లోగా నీటి కనెక్షన్కు ఆధార్ అనుసంధానం చేసుకోవడంతో పాటు నీటి కనెక్షన్కు కచ్చితంగా అధికారులు ధ్రువీకరించిన నీటి మీటర్లను బిగించాల్సి ఉంటుంది. నీటి వినియోగదారులు మాత్రం అంతంత మాత్రంగానే మీటర్లు ఏర్పాటు చేసుకోవడంతో పాటు నీటి కనెక్షన్కు ఆధార్ను అనుసంధానం చేసుకున్నారు. మార్చినెల చివరి వరకు జలమండలిలో ఉన్న కనెక్షన్లలో కేవలం పది శాతం మంది మాత్రమే నిబంధనలు పాటించారు. దీంతో జలమండలి అధికారులు మీటర్లు ఏర్పాటు చేసుకోవడంతో పాటు క్యాన్నంబర్కు ఆధార్ అనుసంధానం చేసుకోడానికి ఏప్రిల్ చివరి వరకు పొడిగించారు. అధికారుల లెక్కల ప్రకారం ఏప్రిల్ 15వ తేదీనాటికి జలమండలి మారేడ్పల్లి డివిజన్ పరిధిలో మొత్తం 60, 855 కనెక్షన్లు ఉండగా వాటికి మీటర్లు ఏర్పాటు చేసుకున్నవారు 18, 800 మంది మాత్రమే. క్యాన్నంబర్లకు ఆధార్ అనుసంధానం చేసుకున్న వారు మాత్రం కేవలం 20వేలపై చిలుకు మాత్రమే.
జలమండలి అధికారులు క్యాంపులు ఏర్పాటు చేసి నీటి వినియోగదారులకు అవగాహన కల్పించారు. పలు ప్రాంతాల్లో జలమండలి డివిజన్ జీఎం స్థాయి అధికారి నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు నీటి వినియోగదారుల వద్దకు వెళ్లి ప్రభుత్వం ఉచితంగా ఇస్తామన్న 20 వేల లీటర్ల నీటికి ఎలాంటి నిబంధనలు పాటించాలో వివరించారు. ఉదయం పూట నీటి సరఫరా జరిగే సమయంలో కూడా అధికారులు నివాసాల వరకు వెళ్లి మీటర్ల ఏ ర్పాటు, ఆధార్ అనుసంధానం గురించి వివరించారు. అలాగే నిర్ణీత సమయంలో మీటర్లు ఏర్పాటు చేసుకోకపోయినా, క్యాన్ నంబర్కు ఆధార్ అనుసంధానం చేసుకోకపోయినా గత డిసెంబర్ నుంచి నీటి బిల్లులు చెల్లించాల్సి ఉంటుందని కూడా కనెక్షన్దారులకు వివరించారు. అయినప్పటికీ పెద్దగా స్పందన కనిపించడం లేదని అధికారులు అంటున్నారు. వినియోగదారులు సందేహాలు ఉంటే తీర్చడానికి సిద్ధంగా ఉన్నామని, అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నప్పటికీ వినియోగదారు ల్లో ఉత్సాహం కనిపించడం లేదని అంటున్నారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన 20వేల లీటర్ల ఉచిత తాగునీటి సరఫరాను పొందడం కోసం కనెక్షన్దారులు ఏప్రిల్ చివరి నాటికి మీటర్లను ఏర్పాటు చేసుకోవడంతో పాటు క్యాన్ నంబర్లకు ఆధార్ను తప్పకుండా అనుసంధానం చేసుకోవాలి. లేదంటే గత సంవత్సరం డిసెంబర్ నీటిబిల్లుతో పాటు ప్రస్తుత సంవత్సరం నాలుగు నెలల బిల్లుకూడా చెల్లించాల్సి ఉంటుంది. – కృష్ణ, డీజీఎం జలమండలి