తల్లాడ, ఏప్రిల్ 16: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శుక్రవారం డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకటశేషగిరిరావుతో కలిసి తల్లాడ మండలంలోని కొడవటిమెట్ట, అంబేద్కర్నగర్, మల్లవరం, మంగాపురం, గొల్లగూడెం, నారాయణపురం, తల్లాడ, బిల్లుపాడు, అన్నారుగూడెం, వెంగన్నపేట గ్రామాల్లో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు పూలు చల్లుతూ ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయా గ్రామాల్లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకూ సంక్షేమ పథకాలు అందిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం అందరి అభిమానాన్నీ చూరగొంటున్నదని అన్నారు. తల్లాడ మండలంలో 16 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు రూ.16,01,856 విలువైన చెక్కులను, 34 మందికి రూ.18,09,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను శుక్రవారం అందజేశామన్నారు. మల్లవరంలో నిరుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలో ఉన్న బెల్లంకొండ వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులకు రూ.7.50 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కు ఇచ్చారు.
మరెక్కడా ఇలాంటి పథకాలు లేవు..
తల్లాడలో జరిగిన సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు ఏ రాష్ట్రంలోనూ లేవని అన్నారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సంక్షేమ పథకాల చెక్కులను అందించడం అభినందనీయమన్నారు. స్థానిక ప్రజాప్రతిధులు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు నల్లమల వెంకటేశ్వరరావు, రెడ్డెం వీరమోహన్రెడ్డి, దుగ్గిదేవర వెంకట్లాల్, దూపాటి భద్రరాజు, దిరిశాల దాసురావు, నారపోగు వెంకటేశ్వర్లు, జొన్నలగడ్డ కిరణ్బాబు, వరపర్ల ఉమాఉదయ్, కోసూరి నరసింహారావు, దొడ్డా చిన్నశ్రీను, రుద్రాక్షల బ్రహ్మం, మువ్వా మురళి, వింజం కృష్ణార్జున్రావు, కేతినేని చలపతి, షేక్ యూసూఫ్, గుండ్ల నాగయ్య, పెరిక నాగేశ్వరరావు, గరిడేపల్లి వెంకటేశ్వర్లు, బొడ్డు వెంకటేశ్వర్లు, దగ్గుల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.