సిటీలో సెకండ్ వేవ్ శరవేగంగా విస్తరిస్తున్నది. ఇంటిల్లిపాదినీ చుట్టేస్తున్నది. ఫ్యామిలీలో ఒకరికి వస్తే చాలు.. ఒకరి తర్వాత ఒకరు.. వైరస్ బారినపడుతున్నారు. కుటుంబాలకు కుటుంబాలే చికిత్స కేంద్రాలకు తరలిరావాల్సిన పరిస్థితి నెలకొంటున్నది. రెండో దశ తీవ్రతకు ఇదే పత్యక్ష నిదర్శనం. ప్రజలు స్వీయ నియంత్రణ మరిచిపోవడం.. ‘నాకెందుకొస్తుందిలే’ అన్న అతివిశ్వాసమే కొంప ముంచుతున్నది. కేసులు పెరుగడానికి దోహదం చేస్తున్నది. పిల్లలు కూడా మహమ్మారి బారినపడుతుండటం ఆందోళన కలిగించే అంశం. మరోవైపు వైద్యులు కరోనాను ఎదుర్కొనే చిట్కాలను సూచిస్తున్నారు. అవసరమైతే తప్ప.. బయటికి వెళ్లొద్దని, ఏమీ తినకుండా అస్సలు రావొద్దని హెచ్చరిస్తున్నారు. పౌష్టికాహారంతో మహమ్మారికి అడ్డుకట్ట వేయవచ్చని చెబుతున్నారు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తే.. కొవిడ్ను తరిమికొట్టవచ్చని భరోసానిస్తున్నారు.
ఖాళీ కడుపుతో బయటకు వెళ్తున్నారా…అయితే ఒక్కసారి ఆగండి. బయట కరోనా వైరస్ కాచుకుని కూర్చుంది. ఖాళీ కడుపులోకి వైరస్ సునాయసంగా చొరబడుతుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. పౌష్టికాహారం తీసుకోవడం వల్ల మనిషిలో శక్తి, రోగనిరోధక శక్తి పెరిగి బయట నుంచి వచ్చే ఇన్ఫెక్షన్లను అడ్డుకుంటాయి. పౌష్టికాహారంవల్ల శరీరానికి కావల్సిన ప్రొటీన్స్, మినరల్స్, క్యాలరీలతో పాటు విటమిన్స్ అందుతాయని వైద్యులు తెలిపారు. శరీరంలో ‘డి’, ‘సి’విటమిన్లు సమపాలలో లేకుంటే కరోనా వంటి సమయాల్లో తీవ్ర అనారోగ్యంపాలు కావల్సి వస్తుంది. అయితే పౌష్టికాహారం తీసుకుంటే ఈ విటమిన్ల లోపమే ఉండదని, వైరస్లు వచ్చినా ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపవంటున్నారు.
గత సంవత్సర కరోనా కాలం నుంచి కొంతమంది ఆహారపు అలవాట్లలో మార్పులు వచ్చినప్పటికీ.. ఇంకా చాలామందిలో రావల్సి ఉం ది. ముఖ్యంగా ఆహారం విషయంలో సమయపాలన చాలా అవసరం. ఇది పాటిస్తే సగం రో గాలు మాయమవుతాయి. ఇక రెండవది పౌష్టికాహారం. దీనివల్ల దాదాపు 90శాతం రోగాలు మాయమవుతాయి. మూడవది వ్యాయామం. ఈ మూ డు నియమాలు ఖచ్చితంగా పాటిస్తే ఎలాంటి రోగాలనైనా మన శరీరం అడ్డుకుంటుంది. కరోనాకు మహమ్మారికి పౌష్టికాహారమే పెద్ద విరుగుడు. తాజా ఆకుకూరలు, కాయగూరలు, దుంప లు, తాజా పండ్లు, సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలి. – డాక్టర్ రవీందర్, ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్