న్యూఢిల్లీ : కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా దేశంలో టీకా డ్రైవ్ సాగుతోంది. ఇందులో కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్లను వినియోగిస్తుండగా.. ఈ వ్యాక్సిన్లను రూపొందించిన ఆస్ట్రాజెనెకా, భారత్ బయోటెక్ కంపెనీలు పిల్లలకు సురక్షితమైన, సమర్థవంతమైన మోతాదులను నిర్ణయించేందుకు అధ్యయనాలు నిర్వహిస్తున్నాయని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. పిల్లలు తిరిగి పాఠశాలలకు వెళ్లాలంటే మహమ్మారిని నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు పిల్లల కోసం సురక్షితమైన వ్యాక్సిన్లను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
భారత్లో వాడుతున్న టీకా కంపెనీలు రెండు పిల్లలకు సంబంధించినంత వరకు భద్రతా, మోతాదు పరిశీలనకు అధ్యయనాలు నిర్వహిస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో టీకా డ్రైవ్ దశల వారీగా ప్రారంభించింది. మొదటై ఫ్రంట్లైన్ కార్మికులు, ఆ తర్వాత 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు, 45 ఏళ్లు దాటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి టీకాలు వేస్తోంది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో టీకా ప్రక్రియ ముమ్మరం చేసేందుకు గురువారం నుంచి 45 ఏళ్లు పైబడిన వ్యక్తులందరికీ టీకాలు వేయనుంది.
ఇప్పటి వరకు దేశంలో 5.5 కోట్లకుపైగా డోసులు అందుకున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో భారత ఔషధ నియంత్రణ సంస్థ 18 ఏళ్లు పైబడిన వ్యక్తులు రెండు వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అధికారం ఇచ్చింది. పిల్లలు.. చిన్న పిల్లలు అని తేడా చెప్పలేరని, అవసరమైన మోతాదు, దుష్ప్రభావాలు రెండింటిపరంగా విభిన్నంగా ఉంటారని.. ఈ మేరకు డేటా అవసరమన్నారు. వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తే దేశానికి ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. మరింత మందికి టీకాలు వేసే అవకాశం ఉంటుందన్నారు.