కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా
వనపర్తి రూరల్, మార్చి 30 : జిల్లా కేంద్ర అభివృద్ధిలో పట్టణ ప్రజలు సకాలంలో మున్సిపల్ పన్ను చెల్లించి భాగస్వాములు కావాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. మంగళవారం వనపర్తి మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ అధ్యక్షత నిర్వహించిన 2020-21 బడ్జెట్ ప్రవేశ సమావేశానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల అభివృద్ధికి అధిక నిధులు మంజూరు చేస్తుందని, దాంతో పట్టణ ప్రాంతాల్లో అనేక సదుపాయాలు సమకూర్చేందుకు మున్సిపాలిటీలకు అధికారులను అందజేస్తుందన్నారు. అలాగే పట్టణంలో వైకుంఠధామ నిర్మాణం త్వరగతిన పూర్తి చేయాలని సూచించారు. పట్టణంలో సమీకృత మార్కెట్ మంజూరైందని త్వరలో పనులు చేపట్టాలన్నారు. పట్టణంలో మిషన్భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. హరితహారానికి సంబంధించిన నర్సరీల అభివృద్ధితోపాటు పట్టణ పరిసర ప్రాంతాల్లో 3.75లక్షల మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా కేంద్రాన్ని మరింత అభివృద్ధి పర్చేందుకు ప్రజలు సకాలంలో మున్సిపల్కు సంబంధించిన అన్ని రకాల పన్నులు చెల్లించి తోడ్పాటునందించాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.