హైదరాబాద్ : మద్యం మత్తులో కట్టుకున్న భార్యనే కడతేర్చాడో ప్రబుద్ధుడు. నగరంలోని ఓయూ పోలీస్ స్టేషన్ పరిధి పిట్టలబస్తీలో ఈ దారుణ ఘటన జరిగింది.
సుదర్శన్, సౌందర్య (23) దంపతులు కొంతకాలంగా పిట్టలబస్తీలో నివాసం ఉంటున్నారు. ఆదివారం రాత్రి దంపతులిద్దరూ మద్యం తాగి ఆర్థికపరమైన విషయాల్లో గొడవపడ్డారు.
మాటామాటా పెరగడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన సుదర్శన్ భార్యను గొంతు నులిమి హతమార్చారు. ఉదయం మత్తు నుంచి తేరుకోవడంతో జరిగింది గ్రహించి ఓయూ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు.
పోలీసులు సౌందర్య మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.