న్యూఢిల్లీ: ముఖేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్తో విలీన ఒప్పందం చేసుకున్న రిటైల్ నెట్వర్క్ మేజర్ ఫ్యూచర్స్ రిటైల్కు గురువారం ఢిల్లీ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రిలయన్స్ రిటైల్లో విలీనం చేసేందుకు ఆ సంస్థతో ఫ్యూచర్స్ రిటైల్స్ రూ.24,713 కోట్ల విలువగల ఒప్పందం చేసుకున్నది. దీనిపై ముందుకు వెళ్లరాదని ఫ్యూచర్స్ రిటైల్ను ఆదేశించింది. ఫ్యూచర్స్ రిటైల్ ఉద్దేశపూర్వకంగా సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం అత్యవసర ఆదేశాలను ఉల్లంఘించిందని ఢిల్లీ హైకోర్టు ధ్రువీకరించింది.
అంతటితో ఆగకుండా బీపీఎల్ క్యాటగిరీలో ఉన్న సీనియర్ సిటిజన్లకు కొవిడ్-19 వ్యాక్సిన్ వేయడానికి ప్రధానమంత్రి సహాయ నిధిలో రూ.20 లక్షల నగదు జమ చేయాలని ఫ్యూచర్స్ గ్రూప్, దాని డైరెక్టర్లను కోరింది. ఇక ఫ్యూచర్స్ రిటైల్ సీఈవో కిశోర్ బియానీ, ఇతరుల ఆస్తులను జప్తు చేయాలని అధికారులను ఆదేశించింది. వచ్చేనెల 28వ తేదీన విచారణకు హాజరు కావాలని కిశోర్ బియానీ తదితరులకు ఆదేశాలు జారీ చేసింది.
రిలయన్స్ రిటైల్లో విలీనానికి ఆ సంస్థతో రూ.24,713 కోట్ల విలువైన ఒప్పందం ఫ్యూచర్స్ రిటైల్ చేసుకోవడాన్ని సవాల్ చేస్తూ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గత ఏడాది అక్టోబర్ 25వ తేదీన సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
దీనిని విచారించిన సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం.. సదరు ఒప్పందంపై ముందుకు వెళ్లొద్దని ఫ్యూచర్స్ను ఆదేశించింది. కానీ రిలయన్స్లో విలీనానికి ఫ్యూచర్స్ చర్యలు చేపట్టడంతో సింగపూర్ మధ్యవర్తిత్వ న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో అమెజాన్ పిటిషన్ దాఖలు చేసింది.
అమెజాన్ పిటిషన్పై విచారణ తర్వాత ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలు ఫ్యూచర్స్ రిటైల్కు గట్టి ఎదురుదెబ్బ కానున్నది. గతేడాది రిలయన్స్కు తన బిజినెస్ పూర్తిగా విక్రయించేందుకు ఫ్యూచర్స్ రిటైల్ అంగీకరించింది. దేశవ్యాప్తంగా 1700కి పైగా స్టోర్లు ఉన్నాయి. 2019లో ఫ్యూచర్స్ రిటైల్ తనతో చేసుకున్న ఒప్పందం ప్రకారం రిలయన్స్ సహా ఏ సంస్థకు ఫ్యూచర్ ఆస్తులు విక్రయించరాదని అమెజాన్ వాదించింది.