న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 18 ఏండ్లు దాటిన వారందరికీ వ్యాక్సినేషన్కు అనుమతించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కొవిడ్-19 వ్యాక్సిన్ అందచేసేందుకు అర్హతా ప్రమాణాలను సడలిస్తే మూడు నెలల్లో ఢిల్లీవాసులందరికీ వ్యాక్సిన్ అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. అన్ని సెంటర్లలో ప్రజలు నేరుగా వచ్చి వ్యాక్సిన్ వేయించుకునేందుకు అనుమతించాలని, ఇలా చేస్తే మూడు నెలల్లో ఢిల్లీ అంతటా వ్యాక్సినేషన్ను పూర్తి చేస్తామని కేజ్రీవాల్ చెప్పారు. తమ వద్ద తగిన సంఖ్య కరోనా వ్యాక్సిన్లు ఉన్నాయని పేర్కొన్నారు.
కేసుల పెరుగుదలపై అధికారులతో సమీక్షా సమావేశం అనంతరం కేజ్రీవాల్ మాట్లాడుతూ అధిక సెంటర్లలో వ్యాక్సినేషన్ను పెద్ద ఎత్తున చేపట్టేలా నిబంధనలను సవరించాలని కోరుతూ ఢిల్లీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాస్తుందని అన్నారు. ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్ వేయించుకునేందుకు అనుమతించేలా నిబంధనలను సడలించాలని కోరారు. కరోనా మహమ్మారి కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియను విస్తరించడంతో పాటు వేగవంతం చేయాలని అన్నారు. ఇక బుధవారం ఢిల్లీలో 536 తాజా కేసులు వెలుగుచూడటంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6.45 లక్షలకు ఎగబాకింది.