న్యూఢిల్లీ : కొవిడ్-19 మహమ్మారితో అర్ధంతరంగా పలువురు తనువు చాలిస్తుండగా తాజా సర్వే మరో షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. వేగంగా నడిచేవారితో పోలిస్తే మెల్లగా నడిచే వారు కొవిడ్-19తో మరణించే ముప్పు నాలుగింతలు అధికమని, తీవ్ర లక్షణాలుండే వైరస్ స్ట్రెయిన్ బారినపడే ముప్పు రెండు రెట్లు అధికమని యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్లో బయోమెడికల్ పరిశోధనా కేంద్రానికి చెందిన పరిశోధకులు చేపట్టిన అథ్యయనంలో వెల్లడైంది. ‘స్థూలకాయం, నడిచే వేగం, కొవిడ్-19, మరణాలు : యూకే బయోబ్యాంక్ విశ్లేషణ’ పేరుతో ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఒబెసిటీలో ప్రచురితమైన అథ్యయన నివేదిక ఈ వివరాలు వెల్లడించింది.
కరోనా వైరస్ వ్యాధి బారినపడేందుకు, వ్యాధి తీవ్రతకు స్ధూలకాయం కీలక ముప్పుగా ఈ నివేదిక పేర్కొంది. ఇక బ్రిస్క్ వాకర్స్తో పోలిస్తే సాధారణ బరువు కలిగిన మెల్లగా నడిచే వారు వైరస్ కారణంగా మరణించే ముప్పు 3.75 రెట్లు అధికమని లీసెస్టర్లో ఆరోగ్య పరిశోధకులు పేర్కొన్నారు.4,00,000 మందికి పైగా మధ్యవయస్కుల నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ అథ్యయనం చేపట్టారు.
అథ్యయనంలో పాల్గొన్న వారు అందించిన వారి నడక వేగం ఇతర వివరాల ఆధారంగా వారిలో వైరస్ రిస్క్ అధికంగా ఉన్నవారిని పరిశోధకులు అంచనా వేశారని అథ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ టామ్ యేట్స్ పేర్కొన్నారు. బాడీ మాస్ ఇండెక్స్ (బీఏంఐ), నడక వేగానికి కొవిడ్-19 సోకే అవకాశం, మరణాల ముప్పునకూ సంబంధాలను వెల్లడించేలా ఈ అథ్యయనాన్ని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ రీసెర్చి (ఎన్ఐహెచ్ఆర్) లీసెస్టర్ బయోమెడికల్ రీసెర్చి సెంటర్ నిర్వహించింది.
గంటకు 4.8 కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో నడిచే వారిని స్లో వాకర్స్గా పరిగణిస్తుండగా, గంటకు 6.4 కిలోమీటర్ల వేగంతో నడిచేవారిని నిలకడ యావరేజ్ స్పీడ్గా, గంటకు నాలుగు మైళ్ల కంటే ఎక్కువ వేగంతో నడిచేవారిని బ్రిస్క్ వాకర్స్గా బ్రిటన్ ప్రమాణాలను అనుసరించి నిర్దారించారు. వేగంగా నడిచేవారితో పోలిస్తే మెల్లగా నడిచేవారు కొవిడ్ బారినపడే అవకాశాలు రెండున్నర రెట్లు అధికమని పరిశోధకులు కనుగొన్నారు. మెల్లగా నడిచేవారు స్ధూలకాయులైనా, సాధారణ బరువున్నా ముప్పు మాత్రం ఒకేరకంగా అధికంగా ఉన్నట్టు గుర్తించారు.