హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్న పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్కు ఓటర్ల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఓటువేయటంలో విద్యావంతులు బద్దకస్తులన్న అపవాదును పట్టభద్రులు చెరిపేశారు. గతానికి భిన్నంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరటంతో భారీగా పోలింగ్ నమోదైంది. ఎన్నడూ లేనిది హైదరాబాద్ పాతబస్తీలో కూడా భారీగా స్పందన వచ్చింది. వరంగల్-ఖమ్మం-నల్లగొండ స్థానంలో 2015లో 54.62 శాతమే పోలింగ్ నమోదవ్వగా, ఈసారి ఏకంగా 76 శాతం దాటిపోయింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్లో కూడా అదే ఒరవడి కనిపించింది. 2015 ఎన్నికల్లో ఈ స్థానంలో కేవలం 37.72 శాతమే పోలింగ్ జరిగింది. ఈసారి మాత్రం సుమారు 72.45 శాతంవరకు ఓట్లు పోలైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. మహిళలు కూడా భారీగా ఓటు వేశారు. భారీగా పోలింగ్ నమోదుకావటం అధికార టీఆర్ఎస్కే అనుకూలంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
మండలి ఎన్నికలంటేనే ఓటర్లు కాస్త నిర్లక్ష్యంగా ఉంటారని గతానుభవాలు చెప్తున్నాయి. ఈసారి మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి కనిపించింది. మండే ఎండను కూడా లెక్కచేయకుండా ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా క్యూ కట్టారు. ఉదయం నెమ్మదిగానే పోలింగ్ ప్రారంభమైనప్పటికీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓటువేసిన తర్వాత ‘గ్యాస్ సిలిండర్కు దండంపెట్టి వచ్చి ఓటేశానని’ చేసిన ప్రకటనతో ఓటర్లలో అనూహ్య చలనం వచ్చింది. వేలమంది పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు.
ఈసారి పట్టభద్రుల ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ మొదటినుంచీ ఓటర్లలో చైతన్యం నింపే కార్యక్రమాలు చేపట్టింది. ఓటర్ నమోదు కార్యక్రమానికి విస్తృత ప్రచారం కల్పించింది. ఇతర ప్రతిపక్షాలు కూడా టీఆర్ఎస్ మార్గంలోనే నడువటంతో రెండు నియోజకవర్గాల్లోనూ భారీగా పట్టభద్రులు ఓట్లు రిజిస్టర్ చేసుకొన్నారు. పోలింగ్ రోజు కూడా టీఆర్ఎస్ శ్రేణులు అదే ఉత్సాహంతో ఓటర్లను ప్రోత్సహించటంతో పోలింగ్ భారీగా పెరిగిందని ఎన్నికల పరిశీలకులు అంటున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ చిల్లర రాజకీయాలను పట్టభద్రులు తిప్పికొట్టారని విశ్లేషకులు అంటున్నారు. ఉద్యోగాల భర్తీపై అసత్య ప్రకటనలు చేస్తూ హిందూ కార్డును వాడుకొని ఎన్నికల్లో గెలువాలని ప్రయత్నించిన ఆ పార్టీకి ఓటర్లు చెక్ పెట్టారని అంటున్నారు. విశాఖ ఉక్కుతోపాటు దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించటం, విపరీతంగా పెరిగిన పెట్రోల్, వంటగ్యాస్ ధరలపై ఎన్నికల ప్రచారంలోనే బీజేపీకి ఓటర్లు చుక్కలు చూపించారు. పట్టభద్రలు సూటిగా వేసిన ప్రశ్నలకు బీజేపీ నేతల వద్ద సమాధానమే లేకుండా పోయింది.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ నియోజకవర్గంలో 2015లో మొత్తం ఓటర్లు 2,81,138 మాత్రమే. ఇందులో 54.62 శాతం.. అంటే 1,53,547 మంది మాత్రమే నాడు ఓటు వేశారు. తాజా ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 5,05,565కు పెరిగింది. అందుబాటు లో ఉన్న సమాచారం ప్రకారం ఇందులో 76.35 శాతం అంటే 3,74,117 మంది ఓట్లు వేశారు. వీరిలో ఉద్యోగులు, యువకులు, మహిళలే అధికంగా ఉన్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానంలో 2015లో 2.96 లక్షల మంది ఓటర్లుండగా, 37.72 శాతం.. అంటే 1.13 లక్షల మంది ఓటు వేశారు. తాజా ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 5.31 లక్షలకు పెరిగింది. వీరిలో దాదాపు 72.45 శాతం మంది.. అంటే 3.50 లక్షలమంది ఓటువేశారని ప్రాథమిక అంచనా. ఈ రెండుస్థానాల్లో కొత్తగా చేరిన ఓటర్లంతా ప్రభుత్వానికి అనుకూలంగానే ఓటు వేశారని అంటున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల చుట్టుపక్కల గత రెండుమూడేండ్లలో కొత్తగా వచ్చిన పరిశ్రమలు ఈ ఓటర్లతో చాలామందికి ఉపాధి కల్పించాయి. దాంతో వారు ప్రభుత్వంవైపు మొగ్గారని విశ్లేషకులు అంటున్నారు.
గతంలో మాదిరిగా కాకుండా ఈసారి పట్టభద్రుల ఎన్నికల ప్రచారం పోటాపోటీగా సాగింది. టీఆర్ఎస్ మొదటినుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించి కిందిస్థాయి కార్యకర్త నుంచి ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు అందరినీ ప్రచారంలో భాగస్వాములను చేసింది. ఇప్పటికే భర్తీచేసిన 1.32 లక్షల ఉద్యోగాలతోపాటు త్వరలో భర్తీచేయనున్న 50 వేల ఉద్యోగాలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూటిగా, బలంగా, స్పష్టంగా చేసిన ప్రకటనలు పట్టభద్రుల్లో ఆలోచన రేకెత్తించాయి. దాంతో పోలింగ్కు ముందే టీఆర్ఎస్ విజయం ఖాయమని విశ్లేషకులు అంచనాలు వేశారు.
నల్లగొండ- వరంగల్- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాకు జన్మనిచ్చిన స్టేషన్ఘన్ఫూర్ నియోజకవర్గం నుంచే తొలి విజయం అందుకొంటా. వారంనుంచి టీఆర్ఎస్ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశాయి. ప్రభుత్వ అభివద్ధి, సంక్షేమ పథకాలను వివరించి పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చేలా కృషిచేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఒక్క ఓటు కూడా పోవద్దనే నినాదంతో కృషి చేశారు.
– పల్లా రాజేశ్వర్రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి
పట్టభద్రులు ఉత్సాహంగా ముందుకొచ్చి ఓటు వేయడం సంతోషంగా ఉన్నది. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ శాతం ముందెన్నడూ లేనివిధంగా పెరగడం టీఆర్ఎస్ గెలుపునకు చిహ్నం. టీఆర్ఎస్కు ఓటు వేసిన ప్రతి పట్టభద్రుడికి.. అనునిత్యం సైనికుల్లా పనిచేసిన పార్టీ కార్యకర్తలకు, సీనియర్ నేతలకు, ఎన్నికల ఇంచార్జిలకు కృతజ్ఞతలు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయం.
– ఎస్ వాణీదేవి, టీఆర్ఎస్ అభ్యర్థి