ఎన్పీఏలు పైపైకి: ఫిచ్ రేటింగ్స్
న్యూఢిల్లీ, మార్చి 8: దేశీయ బ్యాంకుల్లో మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు లేదా ఎన్పీఏలు) పెరిగే వీలుందని, రుణ వ్యయం కూడా ఎగబాకవచ్చని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ అంచనా వేసింది. కరోనా వైరస్.. భారతీయ బ్యాంకులకు సవాళ్లను విసిరే పరిస్థితులు కనిపిస్తున్నాయని అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22) భారతీయ బ్యాంకుల ప్రదర్శన ఏమంత బాగుండకపోవచ్చన్నది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిస్థితి ఇంకా దిగజారే వీలుందని పేర్కొన్నది. దేశ ఆర్థిక వ్యవస్థను కరోనా ప్రభావం నుంచి గట్టెక్కించడానికి కేంద్రం చేపడుతున్న చర్యల్లో ప్రభుత్వ బ్యాంకులు భాగస్వాములు కావడమే ఇందుకు కారణమని తెలిపింది. కొత్త వ్యాపారాల్లేక, ఆదాయం పెరుగక, రుణాలు వసూలవ్వక బ్యాంకింగ్ రంగం ఇబ్బందుల్లో పడే అవకాశాలున్నాయని హెచ్చరించింది.