ఐఐటీలో ఇంజినీరింగ్ చేయలేదు. పరిశోధనలూ, ప్రయోగాలూ తెలియవు. అయినా ఓ కొత్త ఆవిష్కరణకు ప్రాణం పోసింది. నడవలేని స్థితిలో వీల్చైర్కే పరిమితమైన తండ్రి బాధను చూడలేక, ‘పైకి లేచే వీల్చైర్’ను కనిపెట్టింది నల్గొండ జిల్లాకు చెందిన షేక్ బషీరా. ఈ బాలిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నది. ఆమె తండ్రి అనారోగ్యంతో కొంతకాలంగా నడవ లేని స్థితిలో ఉన్నారు. ఎత్తులో ఉన్న వస్తువులను అందుకోవడానికి తండ్రి పడుతున్న బాధను చూడలేకపోయిందా చిన్నారి. బడిలో చదువుకున్న ‘పాస్కల్ సూత్రం’తో పైకి లేచే వీల్చైర్ను ఎందుకు తయారు చేయలేమన్న ఆలోచన వచ్చింది. ఆ ఐడియాను సైన్స్ టీచర్ పూర్ణిమతో పంచుకుంది. అంతలోనే ఇన్నొవేషన్ చాలెంజ్కు పిలుపు వచ్చింది. ఏదైనా ప్రాజెక్టు చేయమని టీచర్ ఆదేశించారు. జైనబ్, షమీమ్, బషీరా మిత్ర బృందం కూడా ఉత్సాహంగా చేతులు కలిపింది. పైకిలేచే వీల్చైర్ నమూనాను సిద్ధంచేశారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఇన్నొవేషన్ చాలెంజ్లో దీన్ని ప్రదర్శించారు. ప్రదర్శనకు హాజరైన మంత్రి కేటీఆర్ బషీరాను ప్రత్యేకంగా అభినందించారు. ఆ బాలిక ఆర్థిక పరిస్థితి తెలుసుకుని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మంజూరు చేశారు.