భూస్వాముల హవా నడుస్తున్నది. భూమికోసం, భుక్తి కోసం ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజల శ్రమతో సంపన్నులు బాగుపడుతున్నారు. పేదల పరిస్థితి నానాటికీ క్షీణిస్తున్నది. ప్రతి ఒక్కరికీ దున్నుకోవడానికి ఎంతోకొంత భూమి ఉంటే పరిస్థితిలో కొంత మార్పు రావచ్చు. కానీ, భూములిచ్చేదెవరు? ‘నేనున్నా..’ అని ముందుకొచ్చి భూదానోద్యమానికి జీవం పోశారు వెదిరె రామచంద్రారెడ్డి. నీలకంఠ దర్శకత్వంలో ఆ యోధుడి ఉద్యమ జీవితంపై ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సందర్భంగా వెదిరెను స్మరించుకుందాం.
1951
మహాత్మాగాంధీ ఆశయాలను సాధించే సంకల్పంతో దేశవ్యాప్తంగా సభలు, సమావేశాలు జరుగుతున్నాయి. గాంధీజీ శిష్యుడు వినోబా భావే సర్వోదయ సిద్ధాంతాలను ప్రచారం చేసేందుకు దేశవ్యాప్త యాత్రకు శ్రీకారం చుట్టారు. ఏప్రిల్ 15న, హైదరాబాద్లోని శివరాంపల్లిలో ఓ సమావేశంలో పాల్గొన్నారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసు కున్నారు. దున్ను కునేందుకు తమకు భూములు కావాలని ప్రజలు విన్నవించుకున్నారు. ఎవరి నుంచీ భూములను లాక్కోకుండా, శాంతియుతంగా ఉద్యమిస్తూ పేదల సమస్యకు పరిష్కారం చూపించాలని అనుకున్నారు వినోభా బావే. దీంట్లో భాగంగానే హైదరాబాద్ నుంచి పాదయాత్ర ప్రారంభించేందుకు నిశ్చయించారు.
ఏప్రిల్ 17, 1951.
హయత్నగర్ నుంచి వినోబా పాదయాత్ర ప్రారంభమైంది. బాటసింగారం, కొత్తగూడెం మీదుగా యాత్ర గాజుల పోచంపల్లికి చేరుకున్నది. వినోబా పోచంపల్లి అంతటా తిరిగి ప్రజల సమస్యలను విన్నారు. చెరువు పక్కన ఉన్న అషూర్ఖానా (పీర్ల కొట్టం)లో భూదాన్ బృందానికి విడిది ఏర్పాటు చేశారు. ఆరోజు రాత్రి వినోబా సమావేశం నిర్వహించారు. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.
ఏప్రిల్ 18..
వినోబా తన బృందంతో హరిజనవాడకు వెళ్లారు. పీర్లకొట్టం దగ్గరలో ఉన్న జువ్విచెట్టు కింద ఏర్పాటుచేసిన సమావేశంలో ‘ప్రజలారా ఎలా ఉన్నారు? మీకు ఎలాంటి సమస్యలున్నాయి? గాంధీజీ ఆశయాలను సాధించేందుకు మేం దేశమంతటా తిరుగుతున్నాం. అందులో భాగంగానే గాజుల పోచంపల్లికి వచ్చాం’ అంటూ ఉపన్యాసం ప్రారంభించారు. ‘అయ్యా! మేం ఇన్ని దినాలు ఎట్లనో అట్ల ఉన్నాం. ఇప్పుడు మా పిల్లలు పెద్దగైతుండ్రు. మేం అదే గోసపడ్డాం. పిల్లలు కూడా అదే గోసలు పడాల్నా? మా బిడ్డలకు సదువులేదు, సందెలేదు. తిననీకె తిండిగూడా లేదు. ఇస్తే ఇంత భూమియ్యిర్రి. దున్నుకొని తిండిమందమైనా సంపాదించుకుంటం. ఉన్నదాంట్లె నిమ్మలంగా ఉంటం. ఇది తప్పితే వేరే ఇంకేదిజేసినా దండుగే’ అని మూకుమ్మడిగా తమ ఆవేదనను తెలియజేశారు ప్రజలు.
నేనిస్తాను..
ప్రజలకు ఆ జానెడు భూమి ఎలా ఇవ్వగలమా అని వినోబా తీవ్రంగా ఆలోచించారు. అప్పుడే భూదానోద్యమ మార్గం స్ఫురించింది. ‘ఇది మీ ఒక్క ఊరి సమస్య కాదు. తెలంగాణ మొత్తం ఇట్లనే ఉన్నది. పేదరికానికి భూమే పరిష్కారం. జమీందార్ల నుంచి లాక్కొని ఇవ్వొచ్చు. కానీ తర్వాత అల్లర్లు జరుగుతాయి. భూమిని మీ చేతుల్లో పెట్టి మేం వెళ్లిపోతాం. తర్వాత, భూస్వాముల నుంచి మీకు సమస్యలు మొదలవుతాయి. మీపై కక్ష పెంచుకుంటారు. దానివల్ల నష్టం మనకే. కాబట్టి ఎవరిదగ్గరా భూమి లాక్కోకుండానే పరిష్కారం వెతకాలి. అంటే భూస్వాములు ఇష్టపూర్వకంగా పేదలకు తమ భూముల్ని దానం చేయాలి. కానీ ఎవరిస్తారు? మీ ఊర్లో ఏ భూస్వామి అయినాఇస్తారా?’ అని అడిగారు. మరుక్షణమే ‘నేనిస్తా’ అంటూ ఒక చేయి లేచింది. ఆ చేయి వెదిరె రామచంద్రారెడ్డిది. వినోబా అతనివైపు ఆశ్చర్యంగా చూశారు. ‘ఆలోచించుకొని చెప్పు. నిజంగానే ఇస్తావా?’ అని రెట్టించారు. తొణకుండా, బెణకకుండా ‘నిజంగానే ఇస్తాను’ అని గట్టిగా చెప్పారు రామచంద్రారెడ్డి.
100 ఎకరాలు..
మనసులో ఏదో మూలన వినోబాకు అనుమానంగానే ఉంది. ‘రెడ్డి గారూ ఆలోచించండి. తొందరేం లేదు. మనస్సాక్షిగానే ప్రకటిస్తు న్నారా?’ అని రెట్టించి అడిగారు. ‘ఇస్తానని చెప్పాను కదా? బాజాప్తా ఇస్తాను’ అని రామచంద్రారెడ్డి బల్లగుద్ది చెప్పారు. ‘అయితే, దాన పత్రాలు రాసిస్తారా?’ అంటూ వినోబా మరో అడుగు ముందుకేశారు. ‘చూడండయ్యా! మనస్ఫూర్తిగా నా తండ్రి నర్సింహారెడ్డి జ్ఞాపకార్థంగా ఇస్తున్నా. దాన పత్రాలు కాదు, యజ్ఞ ప్రమాణంగా వేదపండితుల సమక్షంలో నాపేరు మీద ఉన్న 100 ఎకరాలను ఇప్పుడే దానం ఇస్తాను’ అని ప్రకటించడంతో వినోబాతో పాటు అక్కడున్నవారంతా కరతాళ ధ్వనులు చేశారు. అగ్నిహోత్రం సాక్షిగా 100 ఎకరాల భూమిని దానం చేశారు రామచంద్రారెడ్డి. ఊర్లో ఎంతమంది దళితులు ఉన్నారు? అన్నది లెక్కతేల్చి, ఒక్కొక్కరికి మూడు, నాలుగు ఎకరాల చొప్పున అప్పటికప్పుడు తన స్వహస్తాలతో పంచారు వినోబా.
మొత్తం 1000 ఎకరాలు
భూదానోద్యమం పట్ల వినోబా మనసులో ఉన్న సందేహాలన్నీ తొలగిపోయాయి. ‘భూమికోసం యుద్ధాలు, రక్తపాతాలు జరిగాయి. కానీ రామచంద్రారెడ్డిగారు మన సమస్యలను అర్థంచేసుకొని.. మొదట 100 ఎకరాల భూమిని దానం ఇవ్వడంతో భూదానోద్యమం ప్రారంభమైంది. మనం చేపడుతున్న భూదానోద్యమానికి మొదటి మహాదాత ఆయనే’ అని నిండు సభలో ఉద్ఘాటించారు వినోబా. ఆ రోజు మొదలైన భూదానోద్యమం దేశవ్యాప్తంగా విస్తరించింది. ఓ యజ్ఞంలా సాగింది. 42 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచారు. భూదానోద్యమం తర్వాత గాజుల పోచంపల్లి.. భూదాన్ పోచంపల్లిగా మారింది. 1964లో వినోబా మరోసారి పోచంపల్లి వచ్చినప్పుడు.. ‘గాంధీ ఆశయాల కోసం ఉద్యమిస్తున్న నాకు భూదానోద్యమం వల్ల ఆయనకంటే ఎక్కువ గుర్తింపు వచ్చింది. అదంతా మీ ఘనతే. మీలో ఒకడిగా రామచంద్రారెడ్డి చేసిన తొలి దాన ఫలితమే. పోచంపల్లిని నా రెండో జన్మస్థలంగా సగర్వంగా ప్రకటిస్తున్నా. ఇక్కడ మొదలైన భూదాన గంగోత్రి దేశవ్యాప్తంగా ప్రవహిస్తూ ఎంతోమంది పేదలకు మంచి భవిష్యత్తును ఇస్తున్నది’ అన్నారు. 1964లో రామచంద్రారెడ్డి మరోసారి 800 ఎకరాల భూమిని దానం చేశారు. ఇలా మొత్తం 1000 ఎకరాల భూమిని దానంగా ఇచ్చారు రామచంద్రారెడ్డి. ఎందరో భూస్వాములు కాలగర్భంలో కలసిపోయినా, ఆయన పేరు మాత్రం స్థిరంగా నిలబడింది.
గౌరవంగా భావిస్తున్నా
స్వాతంత్య్ర సమరయోధుడు వినోబా భావే ప్రారంభించిన ‘భూదానోద్యమం’ చాలా గొప్పది. అలాంటి గొప్ప కార్యక్రమానికి తొలి భూదాతగా నిలిచిన వెదిరె రామచంద్రారెడ్డి వంటి గొప్ప ఉద్యమకారుడి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కే సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం దక్కడం గౌరవంగా భావిస్తున్నా. చారిత్రక కథాంశం కాబట్టి స్క్రిప్ట్కు సమాంతరంగా రీసెర్చ్ కూడా జరుగుతున్నది. ఇంత గొప్ప బాధ్యత అప్పగించిన నా నిర్మాతలు అరవింద్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
నీలకంఠ, దర్శకుడు
‘భాయ్సాబ్’గా గుర్తింపు
వెదిరె రామచంద్రారెడ్డి 1905 జూలై 13న జన్మించారు. కమ్యూనిస్టు ఉద్యమకారుడు రావి నారాయణరెడ్డి, వెదిరె రామచంద్రారెడ్డి బావాబామ్మరుదులు. బారిస్ట్టర్ చదివిన రామచంద్రారెడ్డి ఊరిపై ప్రేమతో, సమాజం పట్ల బాధ్యతతో ఉద్యోగాలు వదిలేసి ప్రజా జీవితంలోకి వచ్చారు. ఊరిని మార్చాలి.. పేదలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో పోచంపల్లికి సర్పంచ్గా ఎన్నికయ్యారు. కానీ, నలుగురికీ ఆదర్శంగా నిలబడుతూ సర్పంచ్ పదవికి రాజీనామా చేసి, బెదిరెకోట చంద్రయ్య అనే దళితునికి అవకాశం ఇచ్చారు. తన దగ్గరికి వచ్చినవాళ్లు ‘దొరా..’ అని పిలిస్తే.. ‘దొరేంది దొరా.. మీకంటే వయసులో పెద్దోడిని అయితే అన్నా అనుండ్రీ.. చిన్నోడిని అయితే తమ్మీ అనుండ్రీ.. అలా అనలేమని అనుకుంటే భాయ్సాబ్ అనుండ్రిగానీ, ఈ పదం వాడొద్దు’ అని మందలించేవారట. అప్పటి నుంచి ఇప్పటివరకు పోచంపల్లిలో ఆయనను ‘భాయ్సాబ్’గానే పిలుస్తున్నారు. అందరితో ఆయన చాలా ప్రేమగా ఉండేవారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా తీర్చేవారు. ఆయనకు నలుగురు సంతానం.
… దాయి శ్రీశైలం
ఇన్పుట్స్: చేరాల ప్రకాశ్