విద్యుత్ లేకపోతే ఘడియ కూడా ఉండలేం.అదే కరెంటుతో..పారిశ్రామికవేత్తలు
వ్యాపారం చేస్తారు.రైతులు వ్యవసాయం చేస్తారు.సామాజిక బాధ్యత ఉన్నవారు మాత్రం నలుగురికీ పంచుతారు.మూడో కోవకు చెందిన వ్యక్తి.. పృథ్వీ మాంగరి.
అవసరం మన ఆలోచనా విధానాన్ని మార్చేస్తుంది. ఆవిష్కరణవైపు అడుగులు వేయిస్తుంది. ఆచరణకు శ్రీకారం చుడుతుంది. బెంగళూరుకు చెందిన పృథ్వీ మాంగరి జీవిత ప్రయాణం కూడా ఇలాగే సాగుతున్నది. సంగీతం అంటే అతడికి ప్రాణం. కుటుంబ సభ్యులు కూడా సంగీతప్రియులే. పృథ్వీ కుటుంబానికి బెంగళూరులో ‘బ్రెడ్ అండ్ జామ్ మ్యూజిక్ ఇన్స్టిట్యూట్’ పేరుతో సంగీత వాద్య శిక్షణ సంస్థ ఉంది. దీంతో, ఆ వీధిలోని వారికి నిత్యం సంగీత పరికరాల మోతే. ఆ సందడి భరించలేక ఎన్నోసార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘జనాలు నివసించే ప్రాంతాల్లో ఈ మోతలు ఏంటి? మీ ఒక్కరూ ప్రశాంతంగా ఉంటే సరిపోతుందా? పక్కవాళ్ల గురించి పట్టదా?’ అని పోలీసులూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో పృథ్వీ ఆలోచనలో పడ్డారు. అదే తన ఆదాయ వనరు కాబట్టి, సంగీత సంస్థను వదులుకోలేని పరిస్థితి. దీనికో మధ్యే మార్గం వెతికారు. కరెంట్ ఆధారిత వాద్యాలద్వారా శబ్దం తక్కువగా విడుదలవుతుంది. దీంతో అటువైపు మళ్లారు. దీనివల్ల ఇరుగు పొరుగుకు ఇబ్బంది ఉండదని అనుకున్నారు. ఫిర్యాదులూ అందలేదు. కానీ, ఇక్కడా ఓ సమస్య ఎదురైంది. వేలకువేల కరెంటు బిల్లు వచ్చేది. ఎంత ఆదా చేసినా ఓ ఐదొందలు తగ్గేది. వాడకాన్ని తగ్గించడం అసాధ్యం కాబట్టి, బిల్లును తగ్గించే అవకాశముంటే బాగుండని అనుకున్నారు. ఏడాదిన్నరపాటు పృథ్వీ పరిష్కారం కోసం అన్వేషించాడు. సోలార్ విద్యుత్ ఒక్కటే కండ్లముందు
కనిపించసాగింది.
ప్రత్యామ్నాయంగా సోలార్
సోలార్ ఆలోచన బాగుంది కానీ, అంత పెద్ద ప్లాంట్ అంటే ఖర్చు ఎక్కువే. చిన్న చిన్న ప్యానెల్స్ ఏర్పాటు చేస్తే ఆశించిన ఫలితం ఉంటుందని నిపుణులు చెప్పడంతో.. ఇదేదో బావున్నట్టు అనిపించింది. టెర్రస్మీద సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలనుకున్నారు. తొలి ప్రయత్నంగా ఒక ప్యానెల్ ఏర్పాటుచేశారు. అది సక్సెస్ కావడంతో మరో 15 ప్యానెల్స్ను ఏర్పరిచారు. రూ.5 లక్షల వరకూ ఖర్చయింది. ఏడాదిన్నర నుంచీ 15 ప్యానెల్స్ద్వారా ఉత్పత్తి అయిన కరెంటుతోనే, ‘బ్రెడ్ అండ్ జామ్ ఇన్స్టిట్యూట్’ను నడుపుతున్నారు. ఇతర, అవసరాలూ తీర్చుకుంటున్నారు. లెక్కేస్తే, సంవత్సరానికి లక్ష రూపాయలు ఆదా. సౌర విద్యుత్ ప్యానల్స్ను ఇలాగే కొనసాగించాలని నిర్ణయించారు. వీలైతే విస్తరిస్తాననీ చెబుతున్నారు. పొదుపు మంత్రం
సౌర విద్యుదుత్పత్తి ప్రయత్నం విజయవంతమైంది. కానీ, 15 ప్యానెల్స్ద్వారా ఉత్పత్తి చేసిన విద్యుత్ అంతా వినియోగం కాలేదు. మిగులు కరెంటును ఏం చేయాలో తెలిసేది కాదు. ఈ విషయం బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లయ్ కంపెనీ లిమిటెడ్ (బెస్కాం) నిర్వాహకులకు తెలిసింది. పృథ్వీని సంప్రదించారు. మిగులు విద్యుత్తో నగరవాసుల అవసరాలు తీర్చమని కోరారు. పృథ్వీ సంతోషంగా ఒప్పుకొన్నారు. 5 కిలోవాట్ల సోలార్ విద్యుత్ను ఉత్పత్తి చేసే 15 ప్యానెల్స్కు బెస్కాం అధికారులు ఒక ప్రత్యేక మీటర్ను అమర్చారు. పృథ్వీ అవసరాలకు పోగా, మిగిలిన కరెంట్ను సమీప ట్రాన్స్ఫార్మర్లలోకి మళ్లిస్తుంది ఆ మీటర్. ఆ పవర్ను ప్రజల అవసరాలకు వినియోగిస్తున్నారు. ఒకప్పుడు ఇన్స్టిట్యూట్ను ఎత్తేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన వారే ఇప్పడు, ఆ వెలుగులను ఆస్వాదిస్తున్నారు. పొరుగువాళ్లకు తనో సక్సెస్ స్టోరీ!