భక్తి కథామృతం
కృష్ణ తత్వం విచిత్రమైంది. అల్లరివాడుగా కనిపిస్తాడు. ఆదుకునేవాడుగా మెప్పిస్తాడు. వెన్న తింటాడు. మన్ను తింటాడు. గోపికల హృదయాలను కొల్లగొడతాడు. భక్తుల హృదయాల్లో నిలిచి ఉంటాడు. నల్లనయ్య అర్థమైతే అంతకన్నా చల్లనయ్య మరెవరూ ఉండరనిపిస్తుంది. ఆ అవతార పురుషుడి గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే అవుతుంది. కృష్ణతత్వాన్ని సులభంగా అర్థం చేసుకునేలా అందమైన కథలుగా అందించారు రచయిత్రి జొన్నలగడ్డ సౌదామిని. కృష్ణలీలలను రసరమ్యంగా ఆవిష్కరించడంతోపాటు పోతన కథామృతాన్ని కమనీయ కథలుగా ఇందులో పొందుపరిచారు. రామ కథామృతంలో ‘ఉడత సాయం’తోపాటు ‘ఎలుక సాయం’ కథనూ అందించారు. రాములోరికి ఎలుక ఏం సాయం చేసిందో తెలుసుకోవాలంటే ఆ కథ చదువాల్సిందే. వాగ్గేయకారుడు త్యాగరాజు జీవిత విశేషాలను ఇందులో కథలుగా సమర్పించారు. రమణ కథామృతం, వాసిష్ఠ కథామృతం అదనపు అమృతత్వాన్ని ప్రసాదిస్తాయి. ఆధ్యాత్మ, భక్తి, మధుర కథల సమాహారం చదివిన కొద్దీ ఆనందం కలుగుతుంది. కృష్ణ తత్వాన్ని అలతి పదాల్లో పరిచయం చేశారు.
బృందావన సారంగ
రచన: జొన్నలగడ్డ సౌదామిని
పేజీలు: 320, వెల: రూ.200
ప్రతులకు:acchamgatelugu@gmail.com సెల్: 85588 99478
చరణ్-చరిత-శీను
రానురానూ పుస్తకాలు చదవడం తగ్గిపోతున్నది. కానీ, వాస్తవ జీవితానికి దగ్గరగా, మనసుకు హత్తుకుపోయే ప్రేమకథ తారసపడితే ఎవరు మాత్రం చదవకుండా ఉంటారు. ‘మీలో ఒకరి కథ’ అచ్చంగా అలాంటి నవలే. ఒకసారి చదవడం మొదలుపెడితే పూర్తయ్యే వరకు విడిచిపెట్టరు. ప్రేమకున్న పవర్ అలాంటిదా అంటే.. అన్ని ప్రేమ కథా చిత్రాలు హిట్ అవ్వడం లేదు కదా! నాయకానాయికల ప్రేమలో ప్రేక్షకుడు లీనమైనప్పుడే సినిమాకు ఆదరణ. కథ, నవల విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది. అందులోని కథా వస్తువు కన్నా, పాత్రల తీరుతెన్నులు, వాటితో పాఠకుడు లీనమవ్వడం మీదే వాటి ఆదరణ ఆధారపడి ఉంటుంది. ‘మీలో ఒకరి కథ’ అలాంటి అనుభూతినే కలిగిస్తుంది. క్యాంపస్ స్నేహాలు, ప్రేమలు, కొట్లాటలు.. చదువుతున్నప్పుడు పాఠకులకు వారి క్యాంపస్ రోజులు గుర్తుకువస్తాయి. ముఖ్యంగా ఇందులోని ప్రధాన పాత్రలు చరణ్, చరితల మధ్య ప్రేమ ప్రతి ఒక్కరినీ తమ కాలేజీ జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తుంది. చరణ్ స్నేహితుడు శీనుగాడి పాత్ర ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. కథలో మలుపులన్నిటికీ ఆ పాత్రే ఆధారం. నిజమైన ప్రేమకు, విలువైన స్నేహానికి పట్టం కట్టిన ‘మీలో ఒకరి కథ’ నవల మనందరికీ నచ్చుతుందనడంలో సందేహం లేదు.
‘మీలో ఒకరి కథ’
రచయిత: బ్రహ్మా బత్తులూరి
పేజీలు: 185, వెల: రూ.200
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
బుక్ షెల్ఫ్
ఉర్దూ వ్యాకరణం
శబ్ద సౌందర్యం కలిగిన భాషల్లో ఉర్దూ ప్రత్యేకమైనది. లిపి అర్థం కాకపోయినా, భాష రాకపోయినా ఆ పదాల్లో ఆకర్షించే గుణం ఏదో ఉంటుంది. అందుకే, తెలియకుండానే ఉర్దూ పదాలు వాడేస్తూ ఉంటాం. భాష తెలుసుకొని ప్రయోగిస్తే మరింత అందంగా ఉంటుంది. అందుకు సాయం చేస్తుంది ఈ పుస్తకం. ఉర్దూ భాషలోని వర్ణమాల, వ్యాకరణం, విభక్తులు, పద ప్రయోగాలు, లిపి రాసే విధానాన్ని తెలుగులో వివరిస్తూ పుస్తకాన్ని తీర్చిదిద్దారు రచయిత. ఈ రచన వెనుక అపారమైన కృషి దాగుంది.
రచయిత: లక్ష్మణ్రావు పతంగే
పేజీలు: 159, వెల: రూ.150
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఆత్రేయ పాటల తోట
తన సినీగీతాలతో రసహృదయుల అభిమానాన్ని చూరగొన్న కవి ఆచార్య ఆత్రేయ. ప్రత్యేకించి మనసు పాటలతో ప్రతి ఒక్కరికీ దగ్గరయ్యారు. ప్రణయం, ప్రబోధం, వినోదం, విషాదం ఇలా అంశమేదైనా అలతి అలతి పదాలతో, అనల్పమైన భావాలతో పాటను శిల్పంలా తీర్చి మనకు అందించారు. 1951లో ‘దీక్ష’ సినిమాతో గీతరచయితగా పరిచయమైన ఆయన 477 సినిమాలకు సాహిత్యపు విలువలు కలిగిన 1,636 పాటల్ని రాసి తెలుగు సినిమా పాట స్థాయిని పెంచారు. సినీగేయ సాహిత్య పరిశోధకుడిగా విశిష్టముద్రను పదిలపరుచుకున్న డా.పైడిపాల ‘ఆత్రేయ సాహితి’ అపూర్వ సృష్టికి పూనుకున్నారు. గానగంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సూచన మేరకు ఆత్రేయ శతజయంతి నాటికి ’సినీగేయ సర్వస్వం’ తేవాలని సంకల్పించారు. ఎంతో శ్రమించి, పరిశోధించి ఆత్రేయ సినీగేయ సర్వస్వాన్ని రెండు బృహత్ సంపుటాలుగా ప్రచురించారు. ఆత్రేయ అభిమానులెందరికో ఇది తులలేని కానుక. పాటలను ప్రేమించేవారు, ఆత్రేయ రచలను అభిమానించే వారు భద్రంగా దాచుకోవాల్సిన రచన ఇది. మనసు కవికి ఈ పుస్తకం ఒక ఘనమైన నివాళి.
ఆత్రేయ సాహితి
(ఆత్రేయ సినీగేయ సర్వస్వం- రెండు సంపుటాలు)
సంపాదకులు: డాక్టర్ పైడిపాల
పేజీలు: 664 (మొదటి భాగం), 664 (రెండవ భాగం)
ధర. రూ.800 (రెండు సంపుటాలు కలిపి)
ప్రతులకు: సెల్: 99891 06162
-తిరునగరి శరత్ చంద్ర