హనుమాన్ ఆలయం.. పరమ పవిత్రం. శ్రీరామనామ స్మరణతోపాటు పూలు, పండ్లు, శాకాహార పదార్థాలే ఆంజనేయుడికి నైవేద్యం. కానీ, మహబూబ్నగర్ జిల్లా పెబ్బేరు మండలం పాతపల్లిలో వెలసిన అంజన్న దగ్గర మాత్రం.. ఇందుకు భిన్నం. పొట్టేళ్లు, మేకలు, కోళ్లు బలి ఇస్తూ భక్తులు మొక్కులు తీర్చుకోవడమే ఆచారం.
దుష్టశక్తుల నుంచి రక్షిస్తాడన్న నమ్మకంతో గ్రామాల్లో ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించుకొంటారు. అయితే, పాతపల్లిలో మాత్రం హనుమాన్ ఆలయాన్ని నిర్మించలేదు. గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో వెలసిన ఆంజనేయ స్వామినే గ్రామస్తులు నేటికీ కొలుస్తున్నారు. స్వామివారే తమనూ, తమ గ్రామాన్నీ దుష్టశక్తుల నుంచి రక్షిస్తారని నమ్ముతారు.
స్థల పురాణం
‘చింతలకుంట ఆంజనేయస్వామి’గా ఇక్కడి స్వామిని పిలుచుకొంటారు. ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో పొట్టేళ్లు, మేకలు, కోళ్లు బలి ఇస్తారు. దీని వెనుక బలమైన కారణమున్నదని స్థల పురాణం చెబుతున్నది. పూర్వం ఆలయ పరిసరాల్లో చింతచెట్లు భారీగా పెరిగి, అడవిని తలపించేదట. అందులో రాక్షసులు సంచరిస్తూ.. ప్రజలను, వారి పశుసంపదను చంపి తినేవారట. ఆ ఆగడాలు భరించలేని ప్రజలు ఆంజనేయ స్వామిని వేడుకొన్నారు. ఆయన రాక్షసులందర్నీ వధిస్తూ వచ్చాడట. స్వామి ధాటికి కకావికలమైన రాక్షసులు.. తమ పెద్దల ద్వారా ఆంజనేయుడి బలాన్ని తెలుసుకొన్నారట. లంకలో రావణుడినే వణికించాడనీ, మృత్యువును జయించి చిరంజీవిగా అవతరించిన ఆంజనేయుడిని గెలవడం కష్టమనీ గుర్తించిన రాక్షసులు, ఆయనను కొలిచి, ప్రసన్నం చేసుకొన్నారట. రాక్షసులైన తాము ఆహారం కోసం ప్రజలను, జంతువులను చంపక తప్పదనీ, తమనూ అనుగ్రహించమనీ వేడుకొన్నారట అసురులు. దీంతో ఆంజనేయుడు.. ప్రజలను చంపవద్దనీ, రాక్షసుల ఆకలి తీరేలా తాను చూసుకొంటానని అభయమిచ్చాడట. తాను ఇక్కడే వెలుస్తాననీ, తన దర్శనం కోసం వచ్చే భక్తులు జంతు బలులిస్తారనీ, అలా క్షుద్బాధ తీర్చుకొమ్మని రాక్షసులకు చెప్పాడట. అందుకే, ఈ ఆలయంలో బలి ఉంటుందని స్థల పురాణం.
ప్రత్యేక మొక్కులు..
కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా పాతపల్లి హనుమాన్ను భక్తులు కొలుస్తారు. సంతానం కలగని వారు, నిరుద్యోగులు, పదవులు పొందాలనుకొనే నేతలు.. ఇలా న్యాయమైన కోర్కెలతో స్వామిని దర్శించి, వేడుకుంటే ప్రయత్నం ఫలిస్తుందని నమ్ముతారు. అందుకే, తమ కోర్కెలు తీరిన తర్వాత తండోపతండాలుగా తరలివస్తారు. జంతువులు, కోళ్లతో ప్రదక్షిణలు చేసి, ఆలయం ఎదుట బలులు ఇస్తారు. మాంసాన్ని వండి, నైవేద్యంగా సమర్పిస్తారు. బంధువులు, స్నేహితులను పిలిచి, ఇక్కడే విందులూ నిర్వహిస్తుంటారు. స్వామి కటాక్షంతో తమకు కలిగిన సంతానానికి, ఇక్కడే పుట్టు వెంట్రుకలు తీయిస్తుంటారు. దసరా, సంక్రాంతి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో జాతర నిర్వహిస్తారు. ఉమ్మడి మహబూబ్నగర్తోపాటు చుట్టుపక్కల జిల్లాల నుంచీ భక్తులు పెద్ద సంఖ్యలో తరలిస్తారు.
ఇలా చేరుకోవచ్చు..
హైదరాబాద్ నుంచి బెంగళూరు నేషనల్ హైవే మీదుగా 165 కిలోమీటర్లు ప్రయాణిస్తే పెబ్బేరు వస్తుంది. అక్కడి నుంచి పాతపల్లి మరో ఆరు కిలోమీటర్లు. గ్రామంలోని పొలాల మధ్య నుంచి చెరువుగట్టు మీదుగా రెండు కిలోమీటర్లు వెళ్తే ఆలయానికి చేరుకోవచ్చు. ఇక్కడి వాతావరణం మానసిక ప్రశాంతతనూ ఇస్తుంది.
తాతల కాలం నుంచీ ..
స్వామివారు ఎప్పుడు వెలిశారో తెలియదు. కానీ, మా తాతల తరాల నుంచీ మేమే ఇక్కడ పూజలు చేస్తున్నాం. చింతలకుంట ఆంజనేయస్వామి చాలా మహిహగల దేవుడు. స్వామివారికి భక్ష్యాలు ఇష్టం. కానీ, తమ కోరికలు నెరవేరిన భక్తులు మాంసం, కల్లు నైవేద్యంగా పెడుతుంటారు. అయితే, వాటిని గర్భగుడిలోకి అనుమతించం. ఆలయ ప్రధాన ద్వారం వద్దే ఉంచుతారు. గుడి ఎదుట జంతుబలి ఇస్తుంటారు. ఈ ఆనవాయితీ తరాలుగా కొనసాగుతున్నది.