జరిగిన కథ
శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్మిక సంకేతాలు. అవన్నీ సార్వభౌముడిని ఉలికిపాటుకు గురిచేస్తాయి. నారసింహుడి ఆనవాళ్లను వెతికేలా ఉసిగొల్పుతాయి. ఆ ప్రయాణంలో ఓ తాపసి తారసపడతాడు. ఓ గిరిపుత్రుడి మాటలు కూడా కొత్త ఆలోచనలు రేకెత్తిస్తాయి. అంతలోనే, ఓ ముసుగు వ్యక్తి త్రిభువన మల్లు మీద దాడికి తెగబడతాడు. సాక్షాత్తు నారసింహుడే తన భక్తుడిని రక్షించుకుంటాడు. కానీ, రాజ్యంలో మాత్రం అనిశ్చిత పరిస్థితులు, యుద్ధ భయం!
“నేను యుద్ధానికి సారథ్యం వహిస్తాను” అని ఎప్పుడైతే రాణీ చంద్రలేఖ తన నిర్ణయాన్ని ప్రకటించిందో.. ఏం బదులు చెప్పాలో తోచక విద్యాపతి, ఇతర సభాసదులు నిరుత్తరులయ్యారు. తన నిర్ణయం ప్రకటించి రాణీగారు సభనుంచి వెళ్లిపోయాక గుసగుసలు ప్రారంభ
మయ్యాయి.
‘రాణీగారి నిర్ణయాన్ని ఎలా మార్చాలా?’ అని అతిరథ మహారథులందరూ మల్లగుల్లాలు పడుతున్నారు. పశ్చిమ చాళుక్యుల వంశంలో మగవారే తప్ప, ఆడవారు కత్తిపట్టి యుద్ధానికి వెళ్లిన చరిత్ర లేదు.
అయితే రాణీగారికి ఎవరు చెప్పాలి? ఎలా నచ్చచెప్పాలి?
దండనాయకుడొకరికి ఒక ఉపాయం తోచింది. తన ఆలోచనను విద్యాపతికి చెప్పాడు.
‘కానీ.. ఇది వీలవుతుందా?’
తనలో తానే తర్కించుకున్నాడు విద్యాపతి.
“కవివరేణ్యా.. ఇప్పుడున్న పరిస్థితులలో ఇదొక్కటే మార్గం. మహాదండ నాయకుడు, చక్రవర్తిగారి సన్నిహిత అనుచరుడు, విధేయుడు అనంతపాలుడు. వారే గనుక వస్తే, మహారాణిగారి మనస్సును మార్చగలడు. తనే యుద్ధభూమికి వెళ్లగలడు” ఇదీ ఆ దండనాయకుడి ఆలోచన.
“ఇప్పుడెక్కడున్నాడు అనంతపాలుడు” అడిగాడు విద్యాపతి
“ఇదిగో ఈ వార్తాహరుడు మీకు అన్ని విషయాలూ
వివరంగా చెప్పగలడు”
వార్తాహరుడు ముందుకొచ్చి,
విద్యాపతికి వినయంగా నమస్కరించాడు.
“నువ్వేనా అనంతపాలుని సమాచారం తీసుకొచ్చింది”
“అవును స్వామి”
“ఎక్కడున్నాడతను?”
“విరూపాక్ష ఆలయానికి వెళ్లారు. స్వామివారి ఆలయ ప్రాంగణంలో జరిగే ఆరాధనోత్సవాలకు కుటుంబ సమేతంగా వెళ్లి, అక్కడే పక్షం రోజులపాటు విడిది చేశారు. వారు త్వరలో తిరిగొస్తారని, వారి సేవకులు అనుకోగా విన్నాను” తనకు తెలిసినంతవరకూ చెప్పాడా వార్తాహరుడు.
“అయితే.. వారికి ఇక్కడి విషయాలు, పరిస్థితులు..
ఏమీ తెలియవన్నమాట..”
ఆ మాటలు పూర్తి కాకుండానే హడావుడిగా ప్రవేశించాడు.. సైనికలాంఛనాలతో అలంకృతుడైన ఒక ఆజానుబాహుడు. ఆయనను చూస్తూనే ఆనంద పడిపోయాడు విద్యాపతి.
“సర్వసైన్యాధ్యక్షా.. మిత్రమా! అనంతపాల వీరాగ్రేసరా.. హృదయపూర్వక స్వాగతం” అంటూ ఎదురువెళ్లి ఆలింగనం చేసుకున్నాడు. అనంతపాలుడి ముఖంలో తిరిగొచ్చిన సంతోషం లేదు. ఆందోళన కనిపిస్తున్నది.
“అనంతపాలా! అంతా క్షేమమే కదా?” అడిగాడు విద్యాపతి.
“రాజులేని రాజ్యం, రక్షణలేని వ్యాధి, భద్రత లేని ప్రజలు.. ఎక్కడ క్షేమమూ, ఎక్కడ శాంతి”
కోపంగా ఒక్కొక్క మాట ఒత్తి పలికాడు.
“విద్యాపతి.. ఏమిటిదంతా? చక్రవర్తికీ, రాణీగారికి సలహా ఇచ్చేవారే లేరా? నచ్చచెప్పే వారే లేరా?”
విద్యాపతి మౌనంగా ఉండిపోయాడు.
“మేధావుల మౌనం రాజ్యక్షేమానికి శ్రేయస్కరం కాదు. చక్రవర్తివారి ఉప్పు తింటున్నాం మనం. వారికొచ్చే ముప్పును వివరించి, నివారించాలి. అధికార హోదాలూ, నివాస భవనాలూ, పరివార గణమూ, పలురకాల సౌకర్యాలు.. ఇవి చాలా మనకు? రాజ్యక్షేమం, రాజకుటుంబ క్షేమం మనకు అవసరం లేదా? మనం అందరం రాజాశ్రయంలో ఉన్నాం, త్రిభువనమల్ల చక్రవర్తి ఛత్రచ్ఛాయలో సురక్షితంగా! మీ కవుల భాషలో చెప్పాలంటే కడుపులో చల్ల కదలకుండా ఉన్నాం. మన పైనున్న కప్పు కుప్పకూలిపోతే.. మనం మాత్రం సురక్షితంగా ఉంటామా? ప్రభువులవారిని ఒంటరిగా వదిలేసి ఈ కోటలో మనం చేసే పనేమున్నది? ఈ పరిస్థితులు మాకు సమ్మతం కాదు..”
కోపాన్ని అదుపు చేసుకోలేకపోతున్నాడు అనంతపాలుడు. ఆయన ఆవేశానికి కారణం ఉన్నది. కానీ, పరిస్థితుల నియంత్రణ ఎవరి చేతుల్లో లేదనీ, ప్రభువుల ఆలోచన ప్రకారమే ఇదంతా జరిగిందనీ, జరుగుతున్నదనీ అనంతపాలుడికీ తెలుసు. తెలియకపోతే తను తెలియచెప్పాలి.
“అనంతపాలా! నీ కోపం ఎవరిపైన? నీ నిందారోపణ ఎవరి గురించి? ఎవరు ఎవరిని శాసించాలి. ఎవరి ప్రయత్నాన్ని ఎవరు మార్చాలి? నీకెంత బాధ ఉందో నాకూ అంత బాధ ఉంది. నీకెంత బాధ్యత ఉందని నువ్వు అనుకుంటున్నావో అంతకన్నా ఎక్కువ బాధ్యత నాకుంది. అధికారం కోసమో, ఆనందాన్నిచ్చే దాని కోసమో ఈ విద్యాపతి ఇక్కడ లేడు, ఉండడు. ప్రభువుల క్షేమం, ఈ సామ్రాజ్య సంక్షేమం నాకు ప్రథమ ప్రాధాన్యం. అన్యుల గురించి నాకు అవసరం లేదు. నువ్వు వచ్చావు.. తెలుసుకున్నావు. ఈ పరిస్థితులను మార్చడానికి ఏం చేయగలవో చేయి. సమంజసంగా ఉంటే నా పూర్తి సహకారం నీకుంటుంది” స్పష్టంగా చెప్పాడు విద్యాపతి.
ఆ మాటలతో కొంత తగ్గాడు
అనంతపాలుడు.
“ముందుగా మనం చేయవలసిన పని, ప్రభువులవారిని ఒప్పించైనా కోటకు తిరిగి రప్పించాలి. విష్ణువర్ధనుడి యుద్ధకాంక్ష ఈనాటిది కాదు. ‘గరుడదళం’ పేరుతో ప్రత్యేక సేనా వాహినిని రూపొందించి, అద్భుతమైన యుద్ధనైపుణ్య శిక్షణ ఇప్పిస్తున్నాడు. అతడిని నిలువరించడం చాలా కష్టమైన పని. సర్వం సహా సైన్యాలతో సాక్షాత్తూ త్రిభువనమల్ల చక్రవర్తే యుద్ధానికి వెళ్లినా, జయాపజయాలు దైవాధీనాలు అనే చెప్పాలి” అనంతపాలుడి మాటలు ఆశ్చర్యం కలిగించాయి విద్యాపతికి.
“జయాపజయాలు దైవాధీనాలు అనే మాట నీ నోట రావడం ఆశ్చర్యకరమే కాదు, దురదృష్టం కూడా..”
“మిత్రమా.. విద్యాపతీ! మన శక్తియుక్తులు చూసి శత్రువులు బిత్తరపోవాలి గానీ, మనం ఈ శక్తి చాలు అనుకోకూడదు. కనుకనే.. ఆ మాటన్నాను”
“అయితే.. ఈ యుద్ధానికి మహారాణివారు సారథ్యం వహిస్తానంటున్నారు”
విద్యాపతి మాటలకు నవ్వాడు
అనంతపాలుడు.
“అయితే మహారాణి వారివద్దనే తేల్చుకుందాం” అంటూ ముందుకు కదిలాడు అనంతపాలుడు.
త్రిభువనమల్ల చక్రవర్తి వర్ణచిత్రం.. మనిషెత్తు చిత్రపటం. రాజమందిరంలో గంభీరంగా ఉంది. ఎదురుగా ..
రాణీ చంద్రలేఖా దేవి.
ఆ వర్ణచిత్రంలో ప్రభువులవారు.. ‘తన ఆలోచనలను, అంతరంగ సంఘర్షణను నిశితంగా పరిశీలిస్తున్నారా?’ అని ఒక్కక్షణం అనిపించిందామెకు. వెంటనే తలదించుకుంది.
“అమ్మా… అనంతపాల సేనానీ, విద్యాపతి కవిగారు మీ దర్శనం కోరుతున్నారు. అత్యవసర విషయం అంటున్నారు”
“సరే.. రమ్మను”
ఈ సమయంలో అనంతపాలుడు రావడం చాలా మంచిది అనిపిస్తున్నది.
“మహారాణీవారికి గౌరవాభివందనాలు” వినయంగా పలికింది అనంతపాలుడి స్వరం.
“అనంతపాల మహాసేనానీ! ఈ క్లిష్ట సమయంలో మీ రాక మాకెంతో ధైర్యాన్నిస్తున్నది. మీ విరూపాక్ష ఆలయ సందర్శన ఎలా జరిగింది? అందరూ క్షేమమే కదా!”
“విరూపాక్ష దేవుడి కటాక్షం వల్ల, మహాప్రభువులు త్రిభువనమల్ల చక్రవర్తి శుభాశీస్సులవల్ల అంతా క్షేమమే మహారాణీ! కానీ, ఇక్కడి పరిస్థితుల గురించి తెలిసింది”
“అవును, యుద్ధానికి మేమే వెళ్దామనుకుంటున్నాం. మీ అభిప్రాయం?” అంటూ.. ‘ఏం చెప్తాడా’ అని చూసింది చంద్రలేఖ.
“నా అభిప్రాయానికి విలువ ఇస్తామని మీరు చెబితే.. నేను నా అభిప్రాయాన్ని నిస్సంకోచంగా చెప్తాను.”
అనంతపాలుడి మాటలకు నవ్వింది మహారాణి.
“విలువ అనేది చెప్పే మనిషికుంటుందా? చెప్పిన అభిప్రాయానికి ఉంటుందా? మీరేమనుకుంటున్నారో చెప్పండి?”
“ఇది సాధ్యం కాదు.. అనుకుంటున్నాను” ఖండితంగా చెప్పాడు.
“ఓహో.. మీరు అసాధ్యం అంటున్నది యుద్ధమా? విజయమా?”
ఒక్కక్షణం మౌనం వహించాడు. చివరకు చెప్పాడు.
“రెండూ.. మహారాణీ! యుద్ధమూ.. విజయమూ రెండూ. మన్నించాలి, మీవల్ల సాధ్యం కాదేమోనని మా అభిప్రాయం. మీరు అడిగారు కాబట్టి చెప్పాను”
మహారాణి ముఖం కోపంతో ఎరుపెక్కింది.
వెంటనే తమాయించుకున్నది.
“ఒక ఆడది.. సైన్యాన్ని ఎలా శాసించగలదు? అనేగా మీ సందేహం”
విద్యాపతి, అనంతపాలుడు మొహామొహాలు చూసుకున్నారు.
“సంగీత, సాహిత్యాల్లో, సంసారం, సంతానం, పెంపకం.. ఇటువంటి వాటికే ఆడవారు పరిమితం కావాలంటారా?”
“అమ్మా! మహాశక్తివంతుడైన విష్ణువర్ధనుడి పైన మనం చేసే యుద్ధం, మన రాజ్యాన్ని రక్షించుకోవడానికా? లేక మహిళల యుద్ధ నైపుణ్యానికి పరీక్ష పెట్టడానికా?” అన్నాడు అనంతపాలుడు.
చంద్రలేఖ ఏమీ మాట్లాడలేదు.
“ఒక బిడ్డకు ప్రాణం పోసే తల్లి ఆడది. ఆమె యుద్ధరంగంలోనైనా సరే.. శత్రువు ప్రాణం తీయలేదు. సుకుమారమైన శరీరం, మనస్సు ఉండే స్త్రీమూర్తి రణరంగంలో పోటెత్తే రక్తపాతాన్ని చూసి తట్టుకోగలుగుతుందా?”
అనంతపాలుడి మాటలకు ఆలోచనలో పడింది చంద్రలేఖ.
“మహాసేనానీ, మీ మాతృమూర్తి ఒక వీరమాత. ఆమెకే యుద్ధమంటే భయమున్నట్టయితే.. మీరు యుద్ధాల్లో గెలిచి, ఈ సామ్రాజ్యానికి సర్వసైన్యాధ్యక్షులయ్యే వారా? ”
“కానీ, మాదొక మనవి. శ్రీ నారసింహస్వామివారి దర్శనం కోరి అడవికి వెళ్లిన ప్రభువులవారిని తక్షణమే తిరిగొచ్చేయమని వేడుకుందాం. వారొచ్చే వరకూ ఈ యుద్ధాన్ని ఆపేద్దాం.. మీకు సమ్మతమైతేనే!”
రాజీ ధోరణిలో అన్నాడు అనంతపాలుడు.
‘చూద్దాం’ అన్నట్టు తలూపింది మహారాణి.
“మహారాణీ! మీ సెలవైతే… ప్రభువుల వారిని వెతుక్కుంటూ వెళ్తాం. వారికి ఈ పరిస్థితుల గురించి వివరిస్తాం. వారిని తిరిగి కోటకు తీసుకొస్తాం”
“సరే.. కొద్దికాలం.. వేచి చూద్దాం” అంటూ సంభాషణను ముగించింది చంద్రలేఖా దేవి.
భువనగిరి సామ్రాజ్యంలో ఎక్కడ చూసినా ఒకటే చర్చ. ప్రభువులవారి ఆరోగ్యం బాగా లేదని, శ్రీ నారసింహుని దర్శనం కోసం అడవిలో కొండపైకి వెళ్లి తిరిగి రాలేదనీ.
త్రిభువనమల్లుడంటే.. ప్రజలకు ప్రభువు మాత్రమే కాదు, ఆరాధ్య దైవం కూడా. వ్యవసాయానికి సాయం చేయడంలో, రాజ్యంలో శాంతిభద్రతలను కాపాడటంలో చక్రవర్తిని మించిన మంచి మనిషి లేడని ప్రజలందరూ భావిస్తారు. ఒకరొకరుగా అందరూ కొండదగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బండ్లు కట్టుకొని కొందరు. గుర్రాలపైన ఇంకొందరు. పల్లకీలు మోయించుకుంటూ, కాలినడకనా మరికొందరు అడవికేసి బయలుదేరారు. నరసింహస్వామి దర్శనం కోసం త్రిభువనమల్లుడు కొండపైన వేచి చూస్తున్నాడనీ, త్రిభువనమల్ల ప్రభువు దర్శనం కోసం ప్రజలు కొండకింద వేచి చూస్తున్నారు. ఈలోగా అనంతపాలుడు ప్రభువుల అంగరక్షక దళంతో కోటనుంచి బయలుదేరాడు. ఇదంతా ఇలా ఉండగా..
కొండపైన త్రిభువనుడి పరిస్థితి వేరుగా ఉంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తాను, సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఎలా మారాడో తలచుకుంటే అదొక అద్భుతంగా, దైవ సంఘటనగా కనిపిస్తున్నది. తన ఎదురుగా కొండ గుహ!
‘స్వామివారు కొలువైందీ, యాదర్షికి దర్శనం ఇచ్చిందీ.. ఈ కొండ గుహయేనా?’
ఆ గుహకు అడ్డుగా ఉన్న పెద్ద రాయిని పక్కకు తొలగించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు.
కానీ, ఆ రాయి అంగుళం కూడా కదలడం లేదు. చుట్టూ చూశాడు. ఎవరూ కనిపించలేదు. కొండ గుహకు పైభాగంలో ఎవరో శిల్పి చెక్కినట్టుగా శంఖ, చక్రాలు కనిపించాయి. అప్రయత్నంగా చేతులు జోడించాడు.
‘ఎలా ఈ రాయిని కదిలించాలి?’
ఇంతలో ఒక శ్లోకం వినిపించింది.
అది.. శ్రీ నారసింహుడి విష్ణు పుష్కరిణి గురించి..
“శ్రీ హరేః పాద పద్మాభ్యాం.. ప్లావితం పాపనాశనం
విష్ణుతీర్థం సర్వారోగ్య ప్రదాయనం”
ఎవరో ఒక నిండువృద్ధుడు.. పండు ముదుసలి.. ఒంటినిండా వైష్ణవ నామాలతో పవిత్రంగా కనిపిస్తున్నాడు. వణుకుతున్న స్వరంతో పలుకుతున్నాడు.
నిజమే! విష్ణుతీర్థం సర్వారోగ్య ప్రదాయనం!
“స్వామీ.. ఎవరు మీరు? ఈ కొండ ఎలా ఎక్కగలిగారు”
“ఆయన అండ ఉంటే.. ఈ కొండ ఒక లెక్కా నాయనా?” నవ్వుతూ అన్నాడు. మళ్లీ.. “ఇక్కడే ఆగిపోయావేం.. స్వామి దర్శనం చేసుకోవా..?” అని అడిగాడు ఆ వృద్ధుడు.
“స్వామీ మీరెవరు? ఈ కొండ ప్రాంతం బాగా తెలిసినవారిలా ఉన్నారు. స్వామివారు స్వయంభువుగా వెలిసిన కొండగుహ ఇదేనా? ఎంత ప్రయత్నించినా ఈ రాయి కొంచెం కూడా కదలడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు” నిరాశ ధ్వనించింది త్రిభువనుడి కంఠ స్వరంలో.
“నాయనా.. అర్థం చేసుకోగలిగితే శ్రీ నారసింహ తత్వం చాలా సులభంగా అర్థమవుతుంది. ఈ రాయి పక్కకు కదలాలంటే, నువ్వు చేయాల్సిన పని ఇంకోటి ఉంది”
స్వామిని ధ్యానిస్తూ చెప్పాడా వృద్ధుడు
“శ్రీ హరేః పాద పద్మాభ్యాం..
ప్లావితం పాపనాశనం
విష్ణుతీర్థం సర్వారోగ్య ప్రదాయనం”
ఎవరో ఒక నిండువృద్ధుడు.. పండు ముదుసలి.. ఒంటినిండా వైష్ణవ నామాలతో పవిత్రంగా కనిపిస్తున్నాడు. వణుకుతున్న స్వరంతో పలుకుతున్నాడు.
నిజమే! విష్ణుతీర్థం
సర్వారోగ్య ప్రదాయనం!
“స్వామీ.. ఎవరు మీరు?
ఈ కొండ ఎలా ఎక్కగలిగారు”
“ఆయన అండ ఉంటే.. ఈ కొండ ఒక లెక్కా నాయనా?” నవ్వుతూ అన్నాడు. మళ్లీ.. “ఇక్కడే ఆగిపోయావేం.. స్వామి దర్శనం చేసుకోవా..?”
అని అడిగాడు ఆ వృద్ధుడు.
“ మీరెవరు? ఈ కొండ బాగా తెలిసినవారిలా ఉన్నారు. స్వామివారు స్వయంభువుగా వెలిసిన కొండగుహ ఇదేనా? ఎంత ప్రయత్నించినా ఈ రాయి కొంచెం కూడా కదలడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు” నిరాశ ధ్వనించింది త్రిభువనుడి కంఠంలో.
-అల్లాణి శ్రీధర్