దేశంలో హరిత విప్లవం నేపథ్యంలో ధాన్యాలు, కూరగాయలు, పండ్ల దిగుబడి పెంచడానికి రసాయన ఎరువులు, క్రిమిసంహారకాల ఉపయోగం విపరీతంగా పెరిగిపోయింది. రసాయనాల వల్ల పంటలను ఆశించే తెగుళ్లపైనే కాకుండా మనుషుల ఆరోగ్యం పైనా ప్రతికూల ప్రభావాలు పడుతున్నాయి. కాగా, ఇటీవలి కరోనా వైరస్ కారణంగా పరిశుభ్రత, ఆరోగ్యం, ఆహారం విషయంలో ప్రజల్లో శ్రద్ధ పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో కూరగాయలు, పండ్లు, స్వచ్ఛమైన గాలి కోసం కొన్ని మొక్కలను.. పల్లెటూళ్లలో అయితే పెరళ్లు, పట్టణాలలో అయితే మిద్దెతోటల పేరుతో డాబాలపై పెంచడానికి ప్రజలు మొగ్గుచూపుతున్నారు. అయితే పెరటి, మిద్దెతోటల యాజమాన్య పద్ధతుల గురించి అవగాహన ఉన్నవాళ్లు మాత్రం తక్కువే. ఇలాంటి వారికోసం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం విస్తరణ విశ్రాంత సంచాలకులు ప్రొఫెసర్ రావి చంద్రశేఖర్, ఎడ్ల శ్రీకీర్తన (ఎమ్మెస్సీ హార్టికల్చర్ ) సంయుక్తంగా ‘పొదరిల్లు’ పుస్తకం సంకలనం చేశారు. విత్తనాల ఎంపిక, మొక్కలు, నర్సరీ ఏర్పాటు మొదలుకొని మిద్దెతోటల పెంపకానికి, పోషకాలు, తెగుళ్ల నివారణ సహా వాటి యాజమాన్యం, సస్య రక్షణకు సంబంధించిన అన్ని విషయాలనూ ఫొటోలతో సహా ఈ పుస్తకంలో పొందుపరిచారు. వీటితోపాటు గృహాలంకరణ, ఔషధ, సుగంధ మొక్కల పెంపకం గురించి కూడా ఇందులో వివరించారు. పుస్తకం చివర్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో మిద్దెతోటల పెంపకందారుల్లో కొంతమంది పేర్లు, ఫోన్ నంబర్లు కూడా ఇవ్వడం విశేషం. తోటలు పెంచుకోవాలనుకునే వాళ్లకు, గృహాలంకరణ మొక్కల పట్ల ఆసక్తి ఉన్న వారికి ఈ పుస్తకం మార్గదర్శిగా నిలుస్తుంది.
పొదరిల్లు
(మిద్దెతోటల పెంపకం)
రచయిత: రావి చంద్రశేఖర్
పేజీలు: 162, వెల: రూ.250,
ప్రతులకు: రైతునేస్తం పబ్లికేషన్స్
ఫోన్- 040- 23395979, 96767 97777
E- mail: rytunesthampub@gmail.com
-చింతలపల్లి హర్షవర్ధన్
తండాను తడిమిన కథలు
ప్రకృతికి దగ్గరగా.. బయటి ప్రపంచానికి దూరంగా.. పాడిపంటలే లోకంగా బతుకుతున్నారు బంజారాలు. ఆచార సంప్రదాయాలు, జీవన విధానం ఎవరితో పోల్చినా ప్రత్యేకమే. అయితే మనకు తెలిసిన, మనకు కనిపించే బంజారాలు వేరు. బయటి ప్రపంచం తెలియక తండాల్లో అజ్ఞానంలో మగ్గుతున్న బంజారాలు వేరు. టెక్నాలజీ ఎంతొచ్చినా.. మంత్రాలు, పసరు మందులపైనే జీవిస్తున్న బంజారాలు ఎందరో! వారి చరిత్ర వారికే తెలియదు. ఇప్పటి వరకూ చరిత్రలో వారికంటూ కొన్ని పేజీలు కూడా లేవు. తమ జాతి చరిత్ర, జీవన విధానాల గురించి సాహిత్యంలో ఎక్కడా ప్రస్తావించలేదనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో ఆ గొప్ప బాధ్యతను తలకెత్తుకున్నారు యువ కవి రమేశ్ కార్తీక్ నాయక్. ఢావ్లో కథల సంపుటి ద్వారా గోర్ బంజారాల జీవన సంవేదనను తెలుపుతున్నారు. ఢావ్లో అంటే విషాద గీతం. దీనికి బంజారా జీవితంలో ఓ ప్రత్యేక స్థానం ఉన్నది. బంజారాల్లో ఆడపిల్లగా పుట్టిన ప్రతీ ఒక్కరూ దీన్ని నేర్చుకోవాలి. తమ దుఃఖాన్ని ఢావ్లో రూపంలో వ్యక్తపర్చాలి. ఎనిమిది కథలున్న ఈ పుస్తకంలో వేటికవే ప్రత్యేకం. ఏ కథ చదివినా తండాను తడిమినట్లు అనిపిస్తుంది. ఈ కథల్లోని నిజామాబాద్ బంజారాల భాష, యాస అందరికీ నచ్చుతుంది. సమాజంలో బంజారాల పాత్ర, వాళ్ల అమాయకత్వం, ఎదుర్కొంటున్న కష్టాలు ఇవన్నీ రచయిత కథా వస్తువులు. ఢావ్లో విషాద గీతాన్ని మీరూ చదవండి. అప్రయత్నంగా ఒక్క కన్నీటి బొట్టయినా రాలుతుంది. బంజారాలపై గౌరవం పెరుగుతుంది.
-పడమటింటి రవికుమార్
పుస్తకం పేరు: ఢావ్లో (గోర్ బంజారా కతలు)
రచయిత: రమేశ్ కార్తీక్ నాయక్
పేజీలు:170,
వెల: 160
ప్రతులకు: ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
సృజనాత్మక ‘కథలు’
సరళమైన శైలిలో పిల్లల కోసం ‘స్నేహ ధర్మం’ పేరుతో కథా సంపుటిని వెలువరించారు ఎస్. హనుమంతరావు. 38 విభిన్న కథలతో కూడిన ఈ సంపుటి బాలలకు మంచి కానుక అనే చెప్పాలి. ఏ కథకు ఆ కథ విలక్షణంగా, వినూత్నంగా ఉంది. ఇతివృత్తాలు ఇంతకు ముందు ఎక్కడో చదివినట్టుగా కాక కొత్తగా ఉండటం ఈ సంపుటికి ప్రత్యేక బలం. పిల్లలే కాదు, పెద్దలకూ ఆసక్తి కలిగించేలా రచయిత ఊహలు కథా రూపాలుగా సంతరించుకున్నాయి. అన్నిట్లో ఏ కథ బాగుందనేది చెప్పడం కష్టమే.. అన్నీ బాగున్నాయి కనుక. తొలికథ ‘మూడు తాటిచెట్లు’ చక్కని నీతిని బోధిస్తే… ‘స్నేహ ధర్మం’ స్నేహితుడి ధర్మం ఎలా ఉండాలో సూచిస్తుంది. ‘తోటలో చందమామ’ అందమైన భావనామయ జగత్తులో విహరింప చేస్తుంది. ఎదుటి వారి పోకడలను అనుకరిస్తే ఏమవుతుందో ‘జామచెట్టు’ కథ చెబుతుంది. ‘పాలు నీళ్లు’ సరికొత్త అంశాన్ని అందంగా చెబుతుంది. ’సాహస చిన్నూ’లో చిట్టి చీమ సాహసం అబ్బురం గొలిపింది. ఇలా ఒకటేమిటి? అన్ని కథలూ పిల్లలకు నచ్చేలా, పెద్దలు మెచ్చేలా సాగిపోయాయి. చిన్నారుల ఆసక్తులను పట్టుకోవడానికి ఆకాశవాణిలో పనిచేసిన అనుభవం రచయితకు బాగా ఉపకరించింది. పిల్లలకు పసందైన కథావిందు ఈ పుస్తకం.
-చంద్ర ప్రతాప్
స్నేహధర్మం (బాలల కథలు)
రచయిత: ఎస్. హనుమంతరావు
పేజీలు: 76 వెల: రూ.70/-
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు