దళిత గొంతుక
డబ్భు ఏండ్ల క్రితం సమాజంలోని అణగారిన దళిత జీవితాలకు అక్షరరూపమే ఈ ‘మా లచ్చువమ్మ’ నవల. మూడు తరాల జీవితాలను ఒక దళిత స్త్రీ దృక్కోణంలో చూపించారు రచయిత. దళితుల జీవితం, ఆహారపు అలవాట్లు, ఆచారాలను ప్రస్తావిస్తూనే, ఆనాటి జానపద గీతాల ద్వారా వాటిని కండ్లకు కట్టే ప్రయత్నం చేశారు. కొన్ని సన్నివేశాలు అప్పటి సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థితిగతులను తెలుపుతాయి. నవల మొదట్నించి చివరిదాకా మనుషుల మధ్య ఉండే బంధాలు, అనుబంధాల విలువలు పాఠకులను చలింపజేస్తాయి. అచ్చ తెలంగాణ భాషలో రాసిన ఈ నవల చదువుతున్నంత సేపు మట్టి పరిమళం మనసుకు తాకినట్లు అనిపిస్తుంది. చావుబతుకుల మధ్య ఉన్న తండ్రి శరీరం మీద నుంచి, అతని బిడ్డను తిప్పివేస్తే, చిన్న ప్రాణం పోయి తండ్రి బతుకుతాడనుకోవడం వంటి ఆనాటి ప్రజల మూఢనమ్మకాలను తెలియజేశారు రచయిత. దళితులు పాటించే ఆచార వ్యవహారాల్లో చావు తంతు చేయడం, మైల తీయడం వంటివి మనసుకు భారంగా అనిపిస్తాయి. రోజువారీ జీవితంలో మమేకమైన తెలంగాణ సామెతలు, జాతీయాలు ముచ్చటగా ఇందులో అనిపిస్తాయి.
మా లచ్చువమ్మ (దళిత నవల)
రచయిత: భూతం ముత్యాలు
పేజీలు: 118, వెల: రూ.100
ప్రతులకు: 94904 37978
అందమైన అనుభవాలు
జీవితంలో ప్రతి రోజూ అందమైందే. ప్రతి క్షణం విలువైందే. ఈ జీవితయానంలో ఎదురయ్యే సంఘటనలు, పరిచయమయ్యే మనుషులు ప్రతిదీ ప్రధానమైందే. తరచి చూస్తే ప్రతి అనుభవమూ వినూత్నంగా నిలిచిపోతుంది. ఆ జ్ఞాపకాలకు చిత్రిక పట్టి అందమైన కథల సంకలనంగా మలిచారు రచయిత తడకమళ్ల మురళీధర్. ఆయన చిన్నప్పటి సంగతులు కొన్ని, పెద్దయ్యాక చూసినవి ఇంకొన్ని అందమైన కథలుగా మలిచి ఆవిష్కరించారు. ‘చిన్ననాటి దీపావళి’ సంబురాన్ని మతాబులంత మనోహరంగా వర్ణించారు. ‘హమారా హైదరాబాద్ డబుల్ డెక్కర్ బస్సు’ కథ చదువుతుంటే భాగ్యనగరి గత వైభవం కండ్లముందు సాక్షాత్కరిస్తుంది. డబుల్ డెక్కర్ బస్సులో మనమే కూర్చొని నగరంలో విహరిస్తున్న అనుభూతిని పొందుతాం. ‘బెల్ బాటమ్ ఫ్యాషన్’ ముచ్చట్లు సరదాగా అనిపిస్తాయి. ‘అమర్ రహే రామారావు’ కథ ఓ విజ్ఞానఖనిని పరిచయం చేస్తుంది. కొన్ని సాధారణ అనుభవాలే అయినా, వాటిని రచయిత అందమైన కథగా మలిచిన తీరు బాగుంది. ఇందులోని కథలు చదువుతున్న పాఠకుడికి తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకురాకుండా ఉండవంటే అతిశయోక్తి కాదు.
అమ్మ కోరిక (కథలు-జ్ఞాపకాలు)
రచయిత: తడకమళ్ల మురళీధర్
పేజీలు: 123, వెల: రూ.100
ప్రతులకు: నవ చేతన, ప్రజాశక్తి, నవ తెలంగాణ, నవోదయా పుస్తక కేంద్రాలు
ఆదిలాబాద్ నానీలు
లేదని ఏడవటం, అసలు దరిద్రంఉన్నంతలో, మనసు తృప్తి సముద్రం కవితా ప్రక్రియల్లో నానీలది విభిన్న శైలి. నాలుగు పంక్తుల్లోనే ఒక విషయాన్ని ప్రస్తావించి, ముగింపు పలుకుతారు. అవి ఆలోచింపజేస్తాయి, చురకలు విసురుతాయి, హాస్యపు జల్లులు కురిపిస్తాయి. అలాంటి నానీలతో కూర్చిన అందమైన సంకలనం ఇది.
రచన: ఉదారి నారాయణ
పేజీలు: 64, వెల: రూ.70
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
పాలపిట్ట బుక్స్: 040 2767 8430
మనసును తట్టిలేపే కథలు
‘లొట్టపీసు’ అన్న పదం తెలంగాణలో ప్రముఖంగా వినిపిస్తుంటుంది. ‘వాడి దగ్గర ఏముంది? అంతా ఖాళీ’ అని చెప్పడానికి ఈ వాడుకను ప్రయోగిస్తుంటారు. కానీ, లొట్టపీసు పూలు అందంగా ఉంటాయి. ఆకర్షణీయంగా కనిపిస్తాయి. రచయిత శీలం భద్రయ్య ఆ పూల సొగసును పరిచయం చేసే ఉద్దేశంతో ఈ కథల సంకలనానికి ‘లొట్టపీసు పూలు’ అని పేరు పెట్టారేమో! ఇందులోని పదిహేను కథలూ అణిముత్యాలే. అందమైన నేపథ్యం, అంతకుమించి కుదిరిన శైలి, బంగారానికి తావి అద్దినట్టుగా తెలంగాణ భాష పరిమళం కలగలిసి ‘లొట్టపీసు పూలు’ కథలన్నీ పాఠకుడిని అలరిస్తాయి. కథా వస్తువును ఎంచుకోవడంలోనే కాదు, దానిని మేలి మలుపులతో మలిచిన విధానం బాగుంది. ఎత్తుగడకు తగ్గ ముగింపుతో కథలను ఇంపుగా తీర్చిదిద్దారు రచయిత. మూసధోరణిలో కాకుండా ఒక్కో కథను ఒక్కో కోణంలో ఆవిష్కరించారు. అప్పటి నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల దురాగతాలు, ప్రజల తిరుగుబాట్లు ఈ కథల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. తెలంగాణ పల్లెవాసుల అనుబంధాలు, ఆత్మీయతలు తొంగిచూస్తాయి. అభూత కల్పనలకు చోటు లేకుండా తెలంగాణ అస్తిత్వాన్ని, సహజత్వాన్ని ఈ కథల్లో అద్భుతంగా చిత్రించారు రచయిత.
లొట్టపీసు పూలు (తెలంగాణ కథలు)
రచయిత: శీలం భద్రయ్య, పేజీలు: 106,
వెల: రూ.108, ప్రతులకు: 98858 38288,
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు