పాటను ్రప్రేమించారు. సంగీత సాహిత్యాలను అభిమానించారు.
బాల్యంలోనే గాయకుడిగా సత్తా చాటారు. కానీ, అందివచ్చిన అవకాశంతో
గీత రచయితగా చిత్రసీమలో స్థిరపడ్డారు. ఆయనే.. తీగల శ్రీకుమార్.
పాటనే బాటగా చేసుకొని సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.
తన సాహిత్యంతో యువ హృదయాలను ఉర్రూతలూగిస్తున్నారు.
సినీ గీత రచయిత తీగల శ్రీకుమార్ స్వస్థలం నల్గొండ జిల్లా అన్నారెడ్డి. తీగల లచ్చయ్య – కాశమ్మ దంపతులకు 1989 డిసెంబర్ 12న జన్మించారు. సికింద్రాబాద్లోని ‘గుడ్ షెపర్డ్ ప్రైమరీ స్కూల్’, ‘జాగృతి విద్యాలయ’లో పాఠశాల విద్యను అభ్యసించారు. నల్గొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్, నల్లొండలోని నాగార్జున కళాశాలలో డిగ్రీ చేశారు. చిన్నప్పటి నుంచే పాటలు పాడటం అంటే ఇష్టం. విద్యార్థి దశలోనే లయాత్మకంగా పాడేవారు. సినీ గాయకుడిగా రాణించాలనే ఆశయంతో హైదరాబాద్లో అడుగుపెట్టారు. కానీ, పాటల రచయితగా స్థిరపడ్డారు. భక్తి, రాజకీయ ఇతివృత్తాలతో 130కిపైగా ప్రైవేటు గీతాలను రాశారు.
‘అయ్యో రామారే’ అంటూ..
2013లో సాజిద్ ఖురేషీ దర్శకత్వంలో వచ్చిన ‘పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్’ సినిమాతో తొలి అవకాశాన్ని దక్కించుకొన్నారు శ్రీకుమార్. ‘అయ్యో రామారే రామా రామారే అయ్యో కృష్ణారే’ పాటతో సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఎంతో వినోదాత్మకంగా, సన్నివేశానికి సన్నిహితంగా ఉండేలా ఈ పాటను రాశారు. అదే ఏడాది వచ్చిన ‘ప్రియా నీ మీదే ఆశగా’ చిత్రంకోసం ‘నమ్మలేనే నమ్మలేనే ఇది నిజమంటే నేను నమ్మలే..’ అంటూ ప్రేమ గీతాన్ని అందించారు. ప్రేయసి కోసం ప్రియుడి ఆరాటాన్ని ఆవిష్కరించారు. విరహ వేదనతో రగిలిపోతున్న ప్రేమికుడి మనస్తత్వాన్ని వివరించారు. ఇందులోని ‘ఏకాంతం నన్ను నేడు పిలిచి జాలిగా నవ్విందే.. కాంతిలేని చీకటినే నా జత చేసిందే’ అనే పంక్తుల్లో, ప్రేమకు దూరమైన యువకుల బాధను భలేగా కూర్చారు.
పాటతోనే పట్టం..
సాహిత్యపు విలువలను కాపాడుతూనే, అద్భుతమైన పాటలను అల్లుతున్నారు శ్రీకుమార్. 2019లో వచ్చిన ‘కొత్త కుర్రాడు’ సినిమా కోసం ‘మా ఊరి దేవుడు.. మా శేషాద్రి నాయుడు’ అంటూ ఊరిపెద్దకు హారతిపట్టారు. ధర్మమార్గంలో ప్రజల్ని నడిపిస్తూ ఊరందరికీ దైవంలా నిలబడ్డ మానవతామూర్తికి పాటల పట్టం కట్టారు. ఇందులోని ‘చెప్పేది శిలాశాసనం ఎదురంటూ లేని ప్రస్థానం.. తన కళ్లల్లోనే మండే సూర్యుడే, తన నవ్వుల్లోనే నిండే చంద్రుడే’ అనే పంక్తుల్లో ఊరిపెద్ద ఎలా ఉండాలో చెప్పారు. న్యాయానికి కట్టుబడి, అన్యాయానికి తిరగబడి, మంచికి మంచులా కరుగుతూ, చెడుకు కంచులా మోగే అసమాన కీర్తిమూర్తిని కండ్లముందు ఉంచారు. 2019లో వచ్చిన ‘మామా ఓ చందమామా’ చిత్రంలో ‘మనసే తేలికైనది అలలా తేలుతున్నది..’ అనే పాట రాశారు. ‘చాటింగ్’, ‘సెల్ఫ్ డిఫెన్స్’, ‘హరిలో రంగహరి’ మొదలైన సినిమాలకూ చక్కని పాటలను అందించారు.
యువ హృదయాల చిందులు..
ప్రేమికుల మనసులను, తలపులను సరికొత్తగా ఆవిష్కరిస్తూ.. యువ హృదయాలతో చిందులేయిస్తారు శ్రీకుమార్. 2014లో వచ్చిన ‘ప్రేమలేదని’ సినిమా కోసం ‘వలిషా వలిషా మోనాలిసా.. నిను చూశాకే ఏదో నిషా’ అంటూ వలపు బాణం సంధించారు. ఇందులోని ‘నాతో నడిచిన నీడే నన్నే విడిచిందే.. నీ నీడగ మారి నీతో ఉంటానంటుందే’ వంటి పంక్తుల్లో వీడని నీడగా, తోడుగా సాగే ఇద్దరి ప్రేమబంధాన్ని తెలియజేశారు. 2017లో వచ్చిన ‘ఇదేం దయ్యం’ సినిమాలో ‘నింగి జారేలాగా చిందులెయ్యాలంట.. భూమి అదిరేలాగా రచ్చ చేయనా’ అంటూ తొలి ప్రేమ చిగురించిన వేళ, యువత సందడిని వివరించారు. ఇదే సినిమాలోని ‘ఊహలకే అందనివెన్నో ఉన్నాయి సృష్టిలో ఉన్నాయి.. హృదయాలు ఊరించేలా ఉన్నాయి.. వింతలు ఉన్నాయి’ అనే పాటకూడా భావుకతను పొదుగుకున్నదే!
-తిరునగరి శరత్ చంద్ర , 6309873682